
మహిళ మృతిపై ఆస్ట్రేలియా ప్రధాని దిగ్బ్రాంతి
వాషింగ్టన్: ఎమర్జెన్సీ నెంబర్కు కాల్ చేసిన పాపానికి పోలీసుల కాల్పుల్లో తమ దేశ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషాదంపై ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ విచారం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే షాకింగ్, అవాంఛనీయ దుర్ఘటన అని ప్రధాని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి క్షమాపణ చెప్పడం తప్ప చేసేదేం లేదన్నారు. 'జూనియర్ పోలీసు కాల్పుల్లో మహిళ ప్రాణాలతో బయటపడి ఉండే బాగుండేది. నిస్సహాయురాలైన మహిళపై ఆయుధాలతో కాల్పులకు పాల్పడి మా పోలీసు తప్పిదం చేశారని' మిన్నెపోలీస్ చీఫ్ జేన్ హార్ట్యూ అన్నారు.
అసలేం జరిగిందంటే..
అస్ట్రేలియాకు చెందిన జస్టిన్ రస్జెక్ అనే 40 ఏళ్ల మహిళ గడ మూడేళ్లుగా అమెరికాలోని మిన్నెపోలిస్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్థానిక వ్యాపారి డాన్ డామండ్(50) తో ఎంగేజ్మెంట్ జరిగింది. మరికొన్ని రోజుల్లో ఈ జంట వైవాహిక జీవితంలో అడుగుపెట్టనుంది. అయితే గత శనివారం (జూలై 15న) రాత్రి రస్జెక్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో పొరుగింట్లో ఏదో గొడవ జరగడంతో ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న బృందంలోని ఓ మహిళా పోలీసు తమ వాహనంలోంచి ఓ ఇంటి కిటికీ వైపు కాల్పులు జరిపింది. కిటికీ పక్కనే ఉన్న రస్జెక్ కు బుల్లెట్ తగిలి కుప్పకూలి చనిపోయింది. ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని గుర్తించిన డాన్ డామండ్, అతడి కుమారుడు జక్ డామండ్ లు కన్నీరు మున్నీరయ్యారు.
చుట్టుపక్కల వాళ్లను డామండ్ సంప్రదించగా పోలీసులు కాల్పులు జరపడంతో రస్జెక్ చనిపోయి ఉండొచ్చునని జరిగిన విషయాన్ని చెప్పారు. దీనిపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, కాల్పులకు పాల్పడ్డ మహిళా పోలీసు తన తప్పును అంగీకరించారు. రస్జెక్ కు కాబోయే భర్త డాన్ డామండ్కు క్షమాపణ చెప్పారు. కాల్ అందిన వెంటను అక్కడికి వెళ్లగా.. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తివైపు కాల్పులు జరపగా ఈ విషాదం జరిగినట్లు వివరణ ఇచ్చుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.