
బీజింగ్ : భారత్తో రాజకీయంగా పరస్పర నమ్మకంతో పనిచేయడానికి సిద్ధమని చైనా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య సమస్యలను పరస్పర అవగాహనతో, సున్నితత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని చైనా అభిప్రాయపడింది. ఇండియా తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు చైనా విదేశీ వ్యవహారాల ప్రతినిధి లుకాంగ్ అన్నారు. పరస్పర అభివృద్ధికై రెండు దేశాలు సహకరించుకొని ముందుకెళ్లాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
డోక్లాం ప్రతిష్టంభన నుంచి బయటపడి ఇరు దేశాలు చెరో మెట్టు దిగి ముందుకు సాగాలని లుకాంగ్ ఆకాక్షించారు. గతేడాది సెప్టెంబర్లో భారత్, చైనా దేశాధినేతల మధ్య జరిగిన ఒప్పందాల్ని ఆయన గుర్తు చేశారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులను సమిష్టిగా ఎదుర్కోవడానికి, ఇరుదేశాలు వివాదాలకు అతీతంగా కలిసి పనిచేస్తాయని నరేంద్ర మోదీ, జిన్పింగ్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ మాట్లాడుతూ చైనా భారత్ కలిస్తే (1+1=2) రెండు కాదని పదకొండు(11)తో సమానమంటూ వ్యాఖ్యానించారు.
2017లో ఇండియా-చైనా సరిహద్దుల్లో తీవ్ర అలజడి నెలకొంది. చైనా-పాకిస్తాన్ల మధ్య ఎకనమిక్ కారిడార్, పాకిస్తాన్కు చెందిన జైషే- ఇ- మహమ్మద్ ఛీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా అడ్డుతగలడం, అణు సరఫరా దారుల కూటమిలో భారత్ చేరకుండా చైనా వ్యవహరించిన తీరుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. తమ దేశం నుంచి టిబెట్ను వేరు చేయాలనుకున్న దలైలమాకు భారత్ ఆశ్రయం కల్సించడం కూడా ఇండియా, చైనాల మధ్య ప్రతిష్టంభనకు కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment