సాక్షి, న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రసిద్ధ బైక్స్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్సన్ కరోనా సంక్షోభంతో ఆర్థిక కష్టాల్లో పడింది. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు వందలమంది ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 700 మంది ఉద్యోగులను తొలగించనున్నామని ప్రకటించింది.
కరోనా వైరస్ మహమ్మారికారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సంస్థను పునరుద్ధరించే తన కొత్త వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. 'ది రివైర్' పేరుతో హార్లే-డేవిడ్సన్ ఉద్యోగ కోతలు, పునర్నిర్మాణ ప్రణాళికను ప్రకటించింది. సంస్థ పునర్నిర్మాణం, ఖర్చులు తగ్గింపులాంటి చర్యల్లో భాగంగా 700మంది తొలగించనున్నామని, వీరిలో 200మంది ఇప్పటికే నిష్క్రమించగా, మిగిలిన 500మందిని 2020 చివరి నాటికి తొలగించాలని భావిస్తున్నామని హార్లే డేవిడ్సన్ గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. తద్వారా కంపెనీకి 42 మిలియన్ల డాలర్లు ఖర్చు ఆదా అవుతుంది
17 సంవత్సరాల పాటు హార్లేతో ఉన్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జాన్ ఒలిన్ సంస్థకు రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన డారెల్ థామస్ను ఎంపిక చేసింది. హార్లే-డేవిడ్సన్ను విజయవంతమైన మార్గంలో తీసుకురావడానికి గణనీయమైన మార్పులు అవసరం, అందుకు సరికొత్త దశలో కృషి జరుగుతోందనీ, మొత్తం కంపెనీ అంతటా వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని హార్లే-డేవిడ్సన్ సీఈఓ జోచెన్ జైట్జ్ ప్రకటించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా హార్లేలో 6,000 మంది ఉద్యోగులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment