
మళ్లీ మెగాఫోన్ పట్టుకున్న ముక్తాశ్రీనివాసన్
కార్యదక్షుడికి మనసుతోనే గానీ వయసుతో పని ఉండదని మరోసారి నిరూపిస్తున్నారు ప్రఖ్యాత దర్శక నిర్మాత ముక్తా శ్రీనివాసన్. ఆయన వయసు ఎంత అన్నది అప్రస్తుతం ఎందుకంటే సినీ అనుభవమే 70 వసంతాలు. ఆ అనుభవంతో ప్రఖ్యాత నటులు శివాజీగణేశన్, జెమినీగణేశన్, జైశంకర్, రజనీకాంత్, కమలహాసన్ల నుంచి ఈ తరం నటుల వరకూ పలు విజయవంతమైన చిత్రాలను రూపొందిన ఘనత ముక్తా శ్రీనివాసన్ది.
ఆయన దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాలలో మచ్చుకు చెప్పాలంటే ముదలాలి, నాలు వెలి నీలం, తామరైకుళం,ఓడి విళైయాడు పాపా, శ్రీరామజయం, నినైవిల్ నిండ్రవన్, అండమాన్ కాదలీ, సిమ్లా స్పెషల్ చిత్రాలు చెప్పవచ్చు. ఈయన నిర్మించిన నాయగన్ చిత్రం కమలహాసన్ సినీ జీవతంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
70 ఏళ్ల సినీ అనుభవం గల ముక్తా శ్రీనివాసన్ 25 ఏళ్ల గ్యాప్ తరువాత మెగాఫోన్ పట్టి సంఘ సంస్కర్త ఆధ్యాత్మక ప్రబోధకుడు శ్రీరామానుజర్ జీవిత చరిత్రను మనిదనేయర్ రామానుజర్ పేరుతో వెండి తెరకెక్కించడానికి నడుం బిగించారు.ఈ చిత్ర వివరాలను ఆయన వెల్లడిస్తూ మనుష్యులందరూ సుఖ సంతోషాలతో జీవించాలని పాటుపడిన మహానుభావుడు శ్రీరామానుజర్ అని అన్నారు. బ్రాహ్మణులకే ఆలయ ప్రవేశం అన్న కుల జాఢ్యం నుంచి ప్రజలను బయట పడేసిన తొలి ప్రబోధకుడు రామానుజర్ అని తెలిపారు.
అలాంటి మహానుభావుడి జీవిత చరిత్రను తెరకెక్కించడం తనకు ఘనతేనన్నారు. చిత్రాన్ని మార్చిలో ప్రారంభించి మూడు నెలలో పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు.చిత్ర షూలింగ్ను శ్రీపెరంబత్తూర్,కల్యాణపురం,కోవిలడి,తిరుకోవిళూర్, శ్రీరంగం ప్రాంతాల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.ఇది తనకు 45 వ చిత్రం అని ముక్తా శ్రీనివాసన్ పేర్కొన్నారు.