
మా ఆయన పద్మశ్రీ లాక్కోవట్లేదు: కరీనా
సైఫ్ అలీఖాన్కు గతంలో ఇచ్చిన పద్మశ్రీ అవార్డును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలనుకుంటోందని కథనాలు రావడంతో.. ఆయన భార్య, బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. అవన్నీ వదంతులేనని, అవార్డు వెనక్కి తీసుకోవట్లేదన్న విషయాన్ని అధికారులు ఒక లేఖ ద్వారా తమకు తెలియజేశారని చెప్పింది. ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా కరీనా విలేకరులను పిలిచి మరీ ఈ లేఖ విషయం తెలిపింది. కళా రంగంలో సేవలు అందించినందుకు గాను 2010 సంవత్సరంలో సైఫ్ అలీఖాన్ను ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
ముంబైలోని ఓ హోటల్లో ఎన్నారై వ్యాపారవేత్త మీద దాడి చేసిన సంఘటనలో ముంబై కోర్టు అతడిపై నేరారోపణ చేయడంతో ప్రభుత్వం పద్మశ్రీని వెనక్కి తీసుకుంటుందంటూ కథనాలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అలాంటిదేమీ లేదంటూ నేరుగా ప్రభుత్వం నుంచే లేఖ వచ్చిందని, అందువల్ల ఇక ఎవరూ దీని గురించి ఎలాంటి కట్టుకథలు రాయనక్కర్లేదని తెలిపింది.