క్రేజీ కాంబినేషన్ చిత్రాలు చాలానే తెరకెక్కుతుంటాయి. అయితే అసలు క్రేజీ అనే పదానికి నిర్వచనంగా ఒక చిత్రానికి శ్రీకారం జరగనుంది. విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు, అత్యంత పాపులర్ నటి శ్రుతిహాసన్ కలిసి నటిస్తే చూడాలన్న ఆసక్తి, ఆశ చాలా కాలంగా చాలా మందికి ఉందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈ కాంబినేషన్లో చిత్రం చాలా కాలంగా ఊరిస్తుందనే చెప్పాలి. అది ఇన్నాళ్లకు నిజం కానుంది.
ఎస్ కమలహాసన్ ఆయన వారసురాలు శ్రుతిహాసన్ కలిసి నటించనున్న చిత్రం ఈ నెల 29న ప్రారంభంకానుంది. దీనికి కమలహాసన్ ఒక మంచి వినోదంతో కూడిన తండ్రీకూతుళ్ల అనుబంధాల కథను ఎంపిక చేసుకున్నారు. దీనికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఈయన కమలహాసన్తో ఇంతకు ముందు చాణక్యన్ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. తాజా చిత్రాన్ని కమల్ రాజ్కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 41వ చిత్రం అవుతుంది. దీనికి హాస్యనటుడు, కథకుడు క్రేజీ మోహన్ సంభాషణలు అందించడం విశేషం అయితే చాలా సుదీర్ఘ గ్యాప్ తరువాత ఇసైజ్ఞాని ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనుండడం మరో విశేషం.
వీరి కలయికలో ఇంతకు ముందు పలు భాషల్లో వందకు పైగా చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం. అయితే తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ముంబై ఎక్స్ప్రెస్నే కమల్, ఇళయరాజాల కాంబినేషన్లో రూపొందిన చివరి చిత్రం. ఇకపోతే ఇందులో ముఖ్య పాత్రను నటి రమ్యక్రిష్ణ పోషించనుండడం మరో విశేషం. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కమలహాసన్ స్థానిక టీ.నగర్, హబిబుల్లా రోడ్డులో గల నడిగర్ సంఘం ఆవరణలో నిర్వహించనున్నారు.ఈ విషయాన్ని ఆయనే ఇటీవల స్వయంగా వెల్లడించారు.
తండ్రీకూతుళ్ల చిత్రానికి 29న శ్రీకారం
Published Tue, Apr 19 2016 2:37 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM
Advertisement