
చిన్న సినిమాలైనా చేస్తాను..
♦ అన్నీ భారీ సినిమాలే
♦ సబ్జెక్టు నచ్చితే రెమ్యూనరేషన్ పట్టించుకోను
♦ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్
తెనాలి : అవకాశం తలుపు తట్టినపుడు ప్రతిభను నిరూపించుకున్న ఎవరినైనా సినిమా ప్రపంచం అక్కున చేర్చుకుంటుంది...అందలం ఎక్కిస్తుంది. తెనాలికి చెందిన బుర్రా సాయిమాధవ్ ఆ తరహా ప్రతిభావంతుడైన అదృష్టవంతుడు. గతేడాది కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాతో మొదలుపెట్టి ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే విడుదలయిన ‘గోపాల గోపాల’, ‘మళ్లీ మళ్లీ రానిరోజు’ ‘దొంగాట’ సినిమాలకు మాటల రచయితగా హాట్రిక్ విజయం సాధించారు. ముత్యాల్లాంటి మాటల్లో సందర్భానుసారం తూటామందును కూరుస్తూ, అంతే బలంగా జీవన సత్యాల్ని ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల నాడిని పట్టుకున్నారు. మళ్లీ మరో నాలుగు భారీ సినిమాలకు సంభాషణలు సమకూరుస్తున్నారు. అతి స్వల్పకాలంలో విభిన్నమైన సినిమాలతో ముందుకు సాగుతున్న సాయిమాధవ్, స్వస్థలానికి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొత్త ప్రాజెక్టులపై చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
► ఇప్పటివరకు చేసిన నాలుగు సినిమాలు నాలుగు రకాలు. ఒక్కో సినిమా ఒక్కో జానర్. అన్నీ హిట్ కావటం చాలా ఆనందంగా ఉంది. ఎలా వ్యక్తం చేయాలో తెలియటం లేదు. ఇంకో సినిమాకు రాయటం తప్ప. ప్రస్తుతం తొలి సినిమా అవకాశం ఇచ్చిన క్రిష్ దర్శకత్వంలో మెగా ఫ్యామిలీలో నాగబాబు కొడుకు వరుణ్తేజ హీరోగా కంచె, పవన్కళ్యాణ్ హీరోగా గబ్బర్సింగ్-2, అక్కినేని నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్నినాయన సినిమాలకు, సుప్రసిద్ధ దర్శకుడు శంకర్ దగ్గర కో-డెరైక్టర్గా చేసిన నరసింహారావు చేస్తున్న ఒక ప్రాజెక్టులో తెలుగు వెర్షనుకు నేను సంభాషణలు సమకూరుస్తున్నారు.
► కంచె సినిమా పూర్తిగా డిఫరెంట్. సౌత్ఇండియాలో ఇప్పటివరకు రాని బ్యాక్డ్రాప్తో ఒక పీరియాడికల్ మూవీగా తీశారు. టీజరు చూస్తే యుద్ధం బ్యాక్డ్రాప్గా తెలిసిపోతుంది. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంగా తీసిన ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందన్న నమ్మకముంది. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. అక్టోబర్ 2న విడుదల కావొచ్చు.
► సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి గోపాల గోపాల సినిమా తీసిన నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థవాళ్లు ఇప్పుడు గబ్బర్సింగ్-2 తీస్తున్నారు. పవన్కళ్యాణ్ ఆప్తమిత్రుడైన శరత్ పరార్ నిర్మాత. పక్కా కమర్షియల్ సినిమా. క్లాసిక్ కమర్షియల్గా ఉంటుది.