
న్యూఢిల్లీ: దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన‘పద్మావత్’ చిత్ర వివాదం మళ్లీ మొదటికొచ్చింది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుంచీ వివాదాలతో సహజీవనం చేస్తున్న ‘పద్మావత్’.. తాజాగా మరోమారు సుప్రీంకోర్టు గడపతొక్కింది. మొదట్లో చిత్ర విడుదలకు అంగీకరించని సెన్సార్ బోర్డు కొన్ని షరతులు, సీన్ల తొలగింపు తరువాత ఆమోదముద్ర వేసింది. ఈ చిత్రంపై మొదటినుంచీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నఆందోళనకారులు.. సెన్సార్బోర్డు అనుమతిచ్చినా.. అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్, రాజస్తాన్, హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు.. చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు ప్రకటించాయి.
సినిమా విడుదలను రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంపై పద్మావత్ నిర్మాతలు సుప్రీం కోర్టును ఆశ్రయిచారు. ఎన్నో కష్టాలనోర్చి రూపొందిచిన ‘పద్మావత్’ చిత్రానికి న్యాయం చేయాలంటే.. నిర్మాతలు సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చిత్ర నిర్మాతల పిటీషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా.. రేపు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధానపాత్రలలో సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్' జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment