
పీజే శర్మ అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు సాయి కుమార్ తండ్రి సీనియర్ నటుడు పీజే శర్మ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఎర్రగడ్డ శ్మశాన వాటికలో పీజే శర్మ అంత్యక్రియలు నిర్వహించారు. పీజే శర్మ ఆదివారం ఉదయం గుండెపోటు వచ్చింది. మణికొండలోని ఆయన నివాసంలో 7.30 గంటలకు కన్నుమూశారు. పీజే శర్మ మృతికి రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
పీజే శర్మ అసలు పేరు పూడిపెద్ది జోగీశ్వర శర్మ. 1933, మే 24 వ తేదీన విజయనగరం జిల్లా కళ్లేపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. నాటకాలపై మక్కువతో నాటకాలలో నటిస్తుండగా ...1954లో మొదటి సారిగా అన్నదాత చిత్రంలో చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. వందలాది డబ్బింగ్ సినిమాలలో డబ్బింగ్ చెప్పారు. 1966లో నటి కృష్ణజ్యోతిని పీజే శర్శ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు సాయికుమార్, రవి శంకర్, అయ్యప్ప పీ శర్మ, కుమార్తెలు కమల, ప్రియ. సాయి కుమార్ తనయుడు ఆది ప్రేమ కావాలి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆది వివాహం శనివారం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న పీజే శర్మ... అంతలోనే తుది శ్వాస విడవడంతో ఆయన ఇంటా విషాద ఛాయలు అలముకున్నాయి.