
తమిళసినిమా: ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలవైపు చూస్తుంటే మనవాళ్లకు మాత్రం ఇప్పటికీ బాలీవుడ్పై మోజు ఏమాత్రం తగ్గలేదని నయనతార మరోసారి రుజువు చేశారు. అంతేకాదు డబ్బెవరికి చేదు పిచ్చోడా అన్నట్టుగా తనకు సినిమాలే చాలు, వాణిజ్య ప్రకటనల్లో నటించను అని పెద్దపెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన నయనతార, చివరికి ఒక శాటిలైట్ సంస్థ ఆఫర్గా ప్లాట్ అయిపోయి దాని ప్రచారయాడ్లో నటించేసింది.
అదేవిధంగా ఇప్పటి వరకు దక్షిణాది చిత్రాలు చాలు, ఉత్తరాదికి దూరం అంటూ వచ్చిన ఈ బ్యూటీ తాజాగా హిందీ చిత్రాలపై మోజు పడుతోంది. దక్షిణాదిలో ముఖ్యంగా కోలీవుడ్లో అగ్రనాయకిగా రాణిస్తున్న నయనతారకిప్పుడు నిజానికి చేతినిండా చిత్రాలున్నాయి. అయినా తన పరిధిని పెంచుకోవడం కోసమో లేక మరింత ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఆశతోనే బాలీవుడ్ రంగప్రవేశానికి పావులు కదుపుతున్నట్లు తాజా సమాచారం. నయనతార ఇప్పుడు మరో పనిలో కూడా బిజీగా ఉంది.
తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్శివతో షికార్లు కొడుతున్న నయనతార ఇటీవల ఆయన పుట్టిన రోజును న్యూయార్క్లో జరిపి వార్తల్లోకెక్కింది. అయితే అక్కడ ఈ భామ స్వకార్యం, స్వామి కార్యం అన్నట్టుగా ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూయార్క్కి వెళ్లిన బాలీవుడ్ క్రేజీ నటి ప్రియాంకచోప్రాను కలిసి కాసేపు ముచ్చటించిందట. పనిలో పనిగా తనకు హిందీ చిత్రాల్లో నటించాలనే ఆసక్తిని ప్రియాంకచోప్రా ముందు వ్యక్తం చేయడంతో పాటు అక్కడ అవకాశాలను సంపాదించుకోవడానికి దారేంటని సలహాను కూడా అడిగేసిందట. మొత్తం మీద నయనతార బాలీవుడ్ రంగప్రవేశానికి సిద్ధం అవుతోందన్నమాట.