
టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోపం వచ్చింది. తనను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ పోస్ట్ గురించి తీవ్రంగా స్పందించారు. అందులో ఉన్నవి అవాస్తవాలని.. తక్షణమే అది పోస్ట్ చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఫేస్బుక్లో ఆయన చేసిన పోస్ట్... ‘నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం. స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు. ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో ఈ పోస్ట్పై జోరుగా చర్చసాగుతోంది.