యుద్ధం ఎవరితో?
తరుణ్, యామి గౌతమ్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘యుద్ధం’. ‘ఎవరితోనైనా’ అనేది ఉపశీర్షిక. భారతి గణేష్ దర్శకుడు. నట్టికుమార్ నిర్మాత. స్వర్గీయ శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించారు. షూటింగ్ ముగించుకొని పోస్ట్ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ సినిమా గురించి నట్టికుమార్ చెబుతూ-‘‘శ్రీహరి పాత్ర ఈ చిత్రానికి హైలైట్. ‘ఢీ’లో ఆయన పోషించిన పాత్ర స్థాయిలో ఉంటుందీ పాత్ర. ఈ చిత్రాన్ని శ్రీహరిగారికి అంకితం ఇస్తున్నాం. ఇటీవలే బ్యాంకాక్, పటాయ్ తదితర ప్రాంతాల్లో తరుణ్, యామి గౌతమ్పై పాటలను చిత్రీకరించాం. కృష్ణారెడ్డి నృత్యరీతుల్ని సమకూర్చారు. చక్రి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేస్తాం. జనవరి తొలివారంలో సినిమాను 600 థియేటర్లలో విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జస్వంత్, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: నట్టి క్రాంతి.