
800 ఇంజినీరింగ్ కాలేజీలు మూత?
వచ్చే విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా 800 ఇంజినీరింగ్ కాలేజీలు మూతపడనున్నాయి.
►అడ్మిషన్లు లేకపోవడం
►మౌలిక వసతులు లేమి కారణాలు
బెంగళూరు : వచ్చే విద్యా సంవత్సరం నుంచి 800 ఇంజినీరింగ్ కాలేజీలను మూసివేస్తున్నట్లు ఆల్ ఇండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ఛైర్మన్ అనిల్ దత్తాత్రేయ తెలిపారు. ఆశించిన స్థాయిలో అడ్మిషన్లు లేకపోవడం, మౌలిక వసతులు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమవడం తదితర కారణాలతో అనుమతులు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏఐసీటీఈ నియమ నిబంధనలు పాటించలేక ప్రతి ఏడాది స్వచ్చందంగా 150 కాలేజీలు మూతపడుతున్నాయని ఆయన చెప్పారు. చాలా కాలేజీల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని అన్నారు. 2014-15 నుంచి 2017-18 అకడమిక్ సంవత్సరం అనంతరం 410 కాలేజీలను మూసివేస్తున్నట్లు ఏఐసీటీఈ అధికారికంగా తన వెబ్సైట్లో ప్రకటించింది. వాటిలో 20 కాలేజీలు కర్ణాటకలో ఉండగా, మిగతావి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్లలో ఉన్నాయి.