వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారామ్ బాపూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ 16 ఏళ్ల బాలిక ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్లోని జోధ్పూర్ ఆశ్రమంలో ఆశారామ్ తనపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారని ఆరోపించింది. లైంగిక దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కావడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశారామ్పై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటన రాజస్థాన్లో జరిగినట్లు బాధితురాలు పేర్కొన్నందున కేసును అక్కడికి బదిలీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఈ ఆరోపణలను ఆశారామ్బాపూ ఆశ్రమ ప్రతినిధి నీలమ్ దూబే తోసిపుచ్చారు.
ఆశారామ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ఈ తప్పుడు కేసు పెట్టించారని ప్రత్యారోపణ చేశారు. పోలీసు దర్యాప్తు మొదలైతే ఈ కేసు వెనక ఎవరున్నారో తేలుతుందన్నారు. ఆశారామ్ బాపూపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 2009లో ఆయనపై హత్యాయత్నం, భూకబ్జా కేసులు నమోదవగా మధ్యప్రదేశ్లోనూ భూకబ్జా కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాదాభివందనం చేసేందుకు వచ్చిన ఓ భక్తుడిని ఆశారామ్ దుర్భాషలాడుతూ కాలితో తన్నారు. 2012లో ఓ వీడియో జర్నలిస్టు చెంప చెళ్లుమనిపించారు. 2008లో గుజరాత్లో ఆశారామ్కు చెందిన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు.