
సాక్షి, న్యూఢిల్లీ : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తాజ్మహల్ను సందర్శించారు. భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ వద్ద సరదాగా ఫోటోలు దిగారు. భారత్లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం ఢిల్లీకి ట్రూడో చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జామా మసీదును ట్రూడో కుటుంబం సందర్శించే అవకాశముంది.
2012 తర్వాత భారత్లో పర్యటిస్తున్న కెనడా ప్రధాని ట్రూడోనే. ఈ నెల 23 వరకు ఆయన దేశంలో పర్యటిస్తారు. ప్రధాని మోదీ 2015 ఏప్రిల్లో కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు.. భారత్ రావాల్సిందిగా ట్రూడోను ఆహ్వానించారు. మోదీ ఆహ్వానం మేరకు భారత్కు వచ్చిన ఆయన.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రక్షణ, ఉగ్రవాదం సహా పలు కీలకాంశాలపై ఇరువురు ప్రధానులు చర్చించనున్నారు. సోమవారం గుజరాత్లోని సబర్మతీ ఆశ్రమాన్ని, గాంధీనగర్లోని అక్షర్ధామ్ ఆలయాన్ని ట్రుడో సందర్శిస్తారు. అనంతరం 20న ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నిర్మాతలతో ముంబైలో సమావేశమవుతారు. 21న స్వర్ణదేవాలయాన్ని సందర్శించనున్నారు.