ఆర్థిక ఆరోగ్యానికి సీఏలు కీలకం
Published Sat, Jul 1 2017 8:12 PM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM
న్యూఢిల్లీ: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సంస్థ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తేజ పూరిత ప్రసంగం చేశారు. జూలై ఒకటి నుంచి చారిత్రక జీఎస్టీ చట్టాన్నిఅమలు చేయడం గర్వకారణమన్నారు. అలాగే దేశ ఆర్థిక పరిరక్షణలో సీఏల మూల స్థంభాలాంటి వారని చెప్పారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఐసీఏఐ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి ఛార్టెడ్ అకౌంటెంట్లను ఉద్దేశించి ప్రసంగం చేశారు. ఆర్థిక రంగం బలంగా ఉండేందుకు సీఏలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే అవకాశం సీఏలకు ఉందని అన్నారు. వైద్యులు రోగుల వ్యాధులను నయం చేస్తారని, ఛార్టెడ్ అకౌంటెంట్లు ఆర్థికపరమైన జబ్బులను నయం చేయాలని అన్నారు. ఐజిఎఐ ఫౌండేషన్ డే సందర్భఃగా మోదీ కొత్త సీఏ కోర్సును ప్రారంభించారు. ఈ వృత్తిలో చేరిన వారికి ఆర్థిక నైపుణ్యాలను కొత్త కోర్సు పెంచుతుందని తాను ఆశాజనకంగా ఉన్నాననీ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సాంకేతిక ఆవిష్కరణలను తీసుకురావాలని వారిని కోరారు. ఆర్థికపరంగా జరుగుతున్న తప్పులను గుర్తించి అది తప్పు అని చెప్పే ధైర్యం సీఏలకే ఉందని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా భారత ఛార్టెడ్ అకౌంటెంట్లకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. తప్పుడు ఆడిట్లు చేయకుండా ఖాతాదారులను సరైన మార్గంలో నడిపించే బాధ్యత సీఏలపై ఉందన్నారు. స్వచ్ఛత భారత్ లో కార్యక్రమంలో భాగంగా భారతీయ ఆర్థిక వ్యవస్థను తాము ప్రక్షాళన చేస్తున్నట్టుగా నల్ల కుబేరులు గుట్టు వెలికి తీయాల్సి అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం దాదాపు 37వేల షెల్ కంపెనీల లైసెన్సులను, లక్షకుపైగా అక్రమ కంపెనీల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని చెప్పారు.
దేశాన్ని దోచుకున్న వారి పట్ల తమ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభిస్తోందని అన్నారు. ఏ దేశంలో ఆర్థికపరమైన దోపిడీ జరుగుతోందో ఆ దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోలేదని అన్నారు. అటువంటి దోపిడీని తాము అరికడుతున్నామని అన్నారు. పెద్దనోట్ల రద్దు వంటి నిర్ణయంతో తమ ప్రభుత్వం ఆర్థికదోపిడీ చేసే వారి గుండెల్లో భయం పుట్టించిందని అన్నారు. జీఎస్టీ అమలు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయమని, చారిత్రక అవసరమని చెప్పారు.
Advertisement
Advertisement