
సీఎం.. సీఎస్.. ముదురుతున్న వివాదం
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య రగిలిన వివాదం మరింత ముదురుతోంది. సీఎస్గా రాజేంద్ర కుమార్ను నియమిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్య రగిలిన వివాదం మరింత ముదురుతోంది. శకుంతలా గామ్లిన్ స్థానంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా నియమిస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జారీచేసిన ఆదేశాలను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తిరస్కరించారు. దీంతో వివాదం మరింత ముదిరింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శకుంతలా గామ్లిన్ను రాష్ట్ర ప్రభుత్వ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారుతున్నాయి. శకుంతల నియామకాన్ని నిరసిస్తూ సీనియర్ ఆఫీసర్ అనిందో మజుందార్ (ప్రిన్సిపల్ సెక్రటరీ సర్వీసెస్)ఆఫీసుకు , ఆప్ ప్రభుత్వం సోమవారం ఉదయం తాళాలు వేసింది. ఈ ఆఫీసు నుంచే శకుంతల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందుకే ఆయన ఆఫీసుకు తాళాలు పడ్డాయి. ప్రభుత్వాన్ని కాదని చీఫ్ సెక్రటరీని నియమించడం రాజ్యాంగ విరుద్ధమని, ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో సీఎస్ నియామకం జరగాలని ఆప్ వాదిస్తోంది.
మరోవైపు విద్యుత్ కంపెనీలకు లాబీయిస్టుగా చేస్తున్నారంటూ ప్రభుత్వం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న శకుంతలా గామ్లిన్ ను , ముఖ్యమంత్రి వద్దని చెబుతున్నా సీఎస్ గా నియమించారని, లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కుట్ర పన్నుతోందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నేరుగా సీఎస్ను నియమించడం తగదని కేజ్రీవాల్ సర్కారు ఆరోపిస్తోంది.