
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో భద్రతా దళాలు మరోసారి మావోయిస్టులపై పై చేయి సాధించాయి. నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు నక్సలైట్లను మట్టుపెట్టాయి. సోమవారం సాయంత్రం ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.
సుక్మా జిల్లా వద్ద అబుజ్మార్గ్ ప్రహార్ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశం అయ్యారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఒక్కసారిగా దాడులు నిర్వహించాయి. ప్రహార్ 2 పేరిట నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. 9 ఆయుధాలను స్వాధీనపరుచుకున్నామని, సుక్మా దగ్గర క్యాంపులను ధ్వంసం చేశామని భద్రతా దళాలు వెల్లడించాయి.
కాగా, నారాయణపూర్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంత జాబితాలో ఉంది. గత నెలలో ఏడుగురు ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయారు. కాగా, సరిహద్దు గ్రామాల్లో మావోయిస్టులు తరచూ సమావేశాలు నిర్వహిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.