
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతోపాటు ప్రపంచ దేశాల ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా ఉన్నవీ, లేనివీ ప్రచారం చేస్తూ మరింత భయపెడుతోంది. ‘భారత్లోకి కూడా ప్రవేశించిన చైనాలోని కరోనా వైరస్ పర్యవసానం ఇదీ’ అంటూ ఆర్చిత్ మెహతా, అంబూజ్ ప్రతాప్ సింగ్ ‘ఫేస్బుక్’లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ రోడ్డుపైన రెండు, మూడు వందల మంది మృతుల్లా పడిపోయినట్లు ఆ ఫొటో కనిపిస్తోంది.
వాస్తవానికి అది 2014, మార్చి 24వ తేదీన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో కళాకారుల బృందం చేసిన ప్రదర్శన. 1945, మార్చి 24వ తేదీన ‘కట్చ్బాగ్’ నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్లో మరణించిన 528 ప్రజల సంస్మరణార్థం కళాకారులు అలా ఆ ప్రదర్శన జరిపారు. కాన్సంట్రేషన్ క్యాంప్లో మరణించిన 528 మంది మతదేహాలను ఫ్రాంక్ఫర్ట్ కేంద్ర స్మశానంలో పూడ్చిపెట్టారని చరిత్ర పుటలు తెలియజేస్తున్నాయి. 2014, మార్చి 25వ తేదీన ఈ ఫొటోలను ‘రాయిటర్స్, హిందుస్థాన్ టైమ్స్’ ప్రచురించాయి.
నకిలీ ఫోటోలను ఇలా గుర్తించండి..
సోషల్ మీడియాలో నకిలీ ఫొటోలను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. ‘యాండెక్స్’ యాప్ ద్వారా ఓ ఫొటోను వెనక్కి తీసుకెళ్లి (నెట్ ద్వారా) అది అంతకుముందు ఎప్పుడు, ఎక్కడ ప్రచురించారో కనుక్కోవడం ద్వారా నకిలీదో, అసలుదో కనిపెట్టవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment