
16 వేల మందిపై ఎఫ్ఐఆర్
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చోరీ శృతిమించుతూనే ఉంది. దీనిపై ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా విద్యుత్ ను ఏదో రకంగా అపరిస్తూనే ఉన్నారు. తాజాగా పదహారు వేల మంది దొంగ కలెక్షన్లతో విద్యుత్ వాడుతున్న ఘటన వెలుగు చూసింది. ఇంతటీ భారీ సంఖ్యలో విద్యుత్ చోరీ నమోదు కావడంతో రాష్ట్ర సర్కారులో ఆందోళన నెలకొంది. జనవరి 12వ తేదీన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విద్యుత్ చోరీకి సంబంధించి సమీక్ష నిర్వహించి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన విద్యుత్ అధికారులకు విస్తుగొలిపే విషయాలు కంటబడ్డాయి. అధికశాతంలో విద్యుత్ కలెక్షన్లు దుర్వినియోగం కావడంతో అందుకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగానే పదహారు వేల మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. యూపీ ప్రభుత్వం తాజాగా లక్షా 13 వేల కలెక్షన్లను మాత్రమే మంజూరు చేస్తే.. ఎటువంటి అనుమతి లేకుండా విద్యుత్ మీటర్లు ఉన్న సంఖ్య 16 వేలకు పైగానే ఉండటంతో వారిపై ప్రాధమిక దర్యాప్తు చేపట్టనున్నారు.