'ప్రణబ్ ను రెండుసార్లు ప్రధాని కాకుండా అడ్డుకున్నారు'
ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత దేశ ప్రదాని కాకుండా రెండుసార్లు గాంధీ కుటుంబం అడ్డుకుంది అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఆరోపించారు. ఇందిరాగాంధీ హత్యకు గురైనపుడు కోల్ కతాలో ఉన్న రాజీవ్ గాంధీ ఢిల్లీకి చేరుకున్నారు. సహజంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మంత్రివర్గంలో సీనియర్ మంత్రికి ప్రధాని బాధ్యతలు అప్పగిస్తారు.
ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో ప్రణబ్ సీనియర్ మంత్రిగా సేవలందిస్తున్నారు. అతనికే ప్రధాని పదవి దక్కాల్సింది. కాని గాంధీ కుటుంబం ఆ అవకాశాన్ని ఆయనకు ఇవ్వలేదు అని మోడీ తెలిపారు.
'రాజీవ్ గాంధీని ప్రధాని చేసి... ప్రణబ్ కు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అలాగే 2004లో కూడా ప్రణబ్ కూడా సీనియర్ రాజకీయవేత్త. సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించింది. ఆ సమయంలో కూడా ప్రధాని అయ్యే అవకాశం ప్రణబ్ కు ఉంది. కాని రెండవసారి కూడా ఆ పదవి ఆయనకు దక్కకుండా గాంధీ కుటుంబం మరోసారి మొండి చేయి చూపింది. ప్రణబ్ ను కాకుండా మన్మోహన్ సింగ్ ను ప్రధాని చేశారు.
ఒకవేళ ప్రణబ్ ప్రధాని అయితే బాగుండేది' అని మోడీ వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ కు జరిగిన అన్యాయాన్ని బెంగాల్ ప్రజలు మరవకూడదు అని మోడీ సూచించారు. కోల్ కోతలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోడీ పాల్గొన్నారు.