
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 కేసులు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంటే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. కరోనా మహమ్మారి కేసులు ప్రబలిన ప్రాంతాలను దిగ్బంధం చేసి వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రయత్నిస్తున్నాయి. మహమ్మారి చైన్ను బ్రేక్ చేసేందుకు వైద్య సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. ఇక నిర్ధిష్ట ప్రాంతం నుంచి 28 రోజుల పాటు ఏ ఒక్క కేసు నమోదు కాకుంటే వైరస్ చైన్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా బ్రేక్ చేసినట్టుగా ప్రభుత్వం నిర్ధారిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టం చేసింది.
కరోనా కేసులను ఆ స్ధాయికి తీసుకురాగలిగితే మహమ్మారిని అడ్డుకోవచ్చని ఆరోగ్య మంత్రత్వి శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇక యువతలోనూ వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, అయితే మరణాలు అధికంగా వృద్ధుల్లో చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. కరోనా లక్షణాలు కనిపించిన వారు పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందికి సమాచారం ఇస్తే సరైన సమయంలో వైద్య సేవలు అందిస్తారని చెప్పారు. ఇక గడిచిన 24 గంటల్లో 1211 తాజా కేసులు నమోదవగా 31 మంది మరణించారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment