Published
Wed, Mar 16 2016 7:55 PM
| Last Updated on Mon, Oct 8 2018 6:02 PM
ముంబై: దేశం పట్ల తనకు అపారమైన ప్రేమ ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ అన్నారు. తనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ఎవరి దేశభక్తినైనా ఒక్క నినాదంతోనే ఎలా అంచనా వేస్తారని ఆయన ప్రశ్నించారు. జై హింద్, జై భారత్, జై మహారాష్ట్ర అంటేనే ప్రేమ ఉన్నట్టా అని అడిగారు.
తాను ఇక్కడే పుట్టానని, తుదిశ్వాస వరకు ఇండియాలోనే ఉంటానని స్పష్టం చేశారు. మాతృదేశాన్ని అవమానించాలని కలలో కూడా అనుకోనని పేర్కొన్నారు. అసెంబ్లీలో 'భారత్ మాతాకి జై' అని నినదించేందుకు పఠాన్ నిరాకరించడంతో ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించారు.