
పాక్ జైల్లో భారతీయుడిపై దాడి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జైల్లో భారతీయ ఖైదీపై దాడి జరిగింది. పెషావర్ సెంట్రల్ జైల్లో ఉన్న హమీద్ నెహల్ అన్సారీపై ఓ పాకిస్తాన్ ఖైదీ దాడికి పాల్పడినట్లు మీడియా సంస్థ 'డాన్' శుక్రవారం వెల్లడించింది. గత రెండు నెలల వ్యవధిలో అన్సారీపై దాడి జరగటం ఇది రెండవ సారి. జైలు అధికారులు సైతం రోజూ వేధిస్తున్నారని, అన్సారీకి ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతూ అన్సారీ తరఫు లాయర్ కోర్టును కోరారు. దీనిపై జైలు సూపరిండెంట్ మసూద్ రెహ్మాన్ సమాధానమిస్తూ.. అన్సారీకి అయినటువంటి గాయాలు చాలా చిన్నవనీ.. జైళ్లలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని పేర్కొనడం విశేషం.
గాయాలయిన అన్సారీని ఆసుపత్రికి తరలిస్తామని చెప్పిన జైలు అధికారులు ఆ విధంగా చేయలేదని లాయర్ ఆరోపించారు. అన్సారీకి ప్రత్యేక భద్రత కల్పించాలని కోరినా.. జైలు అదికారులు తిరస్కరించినట్లు తెలిపారు. నఖిలీ పాకిస్తాన్ ఐడీ కార్డును కలిగి ఉన్నాడన్న కారణంతో అరెస్టైన అన్సారీ మూడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.