
శశి థరూర్(ఫైల్ఫోటో)
న్యూఢిల్లీ : భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను అదుకోవాల్సిందిగా తాను ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఐరాసను కోరతానంటూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం జెనీవాలో ఉన్న శశిథరూర్, తాను కేరళ ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర రాయబారిగా ఐక్యరాజ్యసమితిని తమ రాష్ట్రానికి సహాయం చేయాలని అడుగుతానంటూ శశిథరూర్ ట్వీట్ చేశారు.
‘కేరళ వరదల విషయంపై మాట్లాడేందుకు ఐరాస, అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలను కలిసేందుకు జెనీవా వచ్చాను. ఐరాస సాయం కోరడం భారత ప్రభుత్వ హక్కు. నేను ఇక్కడి నుంచి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో సంప్రదిస్తూ ఉన్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో ఐరాసా ఎటువంటి సాయం చేయగలదో తెలుసుకుంటాను’ అని థరూర్ ట్వీట్ చేశారు.
Landed in Geneva to meet w/ @UN & international humanitarian agencies for consultations on #KeralaFloods. While seeking help is the prerogative of the Govt of India, i am here, in close consultation w/ @CMOKerala @vijayanpinarayi, to explore what help could be possible if sought
— Shashi Tharoor (@ShashiTharoor) August 20, 2018
అయితే కేరళ ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను ఖండించింది. అంతేకాక తాము శశిథరూర్ను తమ ప్రతినిధిగా జెనీవా పంపలేదని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఆయన తమ రాయబారి కాదని తెలిపింది.
శశి థరూర్ కేరళ, తిరువనంతపురం నియోకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికయిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఆయన నియోజక వర్గం వరదలకు గురి కాలేదు. అయినా కూడా థరూర్ కేరళకు సాయం చేయాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. కానీ బీజేపీ మాత్రం శశి థరూర్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తోంది. అయితే థరూర్, ఐరాసతో గతంలో తనకున్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని కేరళకు సాయం చేయాలని అడగాలనుకున్నారని, అందులో తప్పేముందని కాంగ్రెస్ బీజేపీపై మండిపడుతోంది.
కేరళలో ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల దాదాపు రూ.20వేల కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. మృతుల సంఖ్య 376కు చేరింది. 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది నిరాశ్రయులున్నారని ప్రభుత్వం తెలిపింది.