
'అంబేద్కర్ ఇల్లు కొంటున్నాం'
ముంబై: భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ లండన్లో నివసించిన ఇంటిని కొనేందుకు మరో రెండు రోజుల్లో ఒప్పందం చేసుకోనున్నట్లు మహారాష్ట్ర సర్కారు సోమవారం ప్రకటించింది. ఆ ఇంటిని మహారాష్ట్ర ప్రభుత్వం మరో 15 రోజుల్లోగా స్వాధీనం చేసుకోనుందని ఆ రాష్ట్ర మంత్రి రాజ్కుమార్ బదోలే వెల్లడించారు. ఇంటి విక్రయానికి యజమాని సోమవారాన్ని చివరి తేదీగా నిర్ణయించారని, ఆలోగా స్పందించకపోతే.. మరో పార్టీకి ఇంటిని అమ్మనున్నారంటూ వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు.
ఈ విషయమై ఇప్పటికే సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వినోద్ తావ్డే లండన్ వెళ్లారన్నారు. ఇంటికోసం మహారాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ. 40 కోట్ల నిధులను కేటాయించింది.