సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండు వారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. సమావేశాల గడువు ఒక వారం తగ్గే సూచనలున్నాయి. ఈ సమావేశాలను మూడు వారాలే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే డిసెంబర్ 4న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మరుసటిరోజైన 5నుంచి పార్లమెంటు సమావేశాల నిర్వహణకు రాష్ట్రపతిని కోరాలన్నది కేంద్ర భావనగా తెలుస్తోంది. సమావేశాలు డిసెంబర్ 23తో ముగుస్తాయని సవూచారం.
వివాదాస్పద మత ఘర్షణల నిరోధక బిల్లును శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకుంది. కాగా, తెలంగాణ బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టగలుగుతుందా? అన్నది ఇప్పటికీ సందేహమేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఎంత త్వరగా తన నివేదిక సమర్పిస్తుంది, నివేదిక ప్రాతిపదికగా రూపొందే తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ద్వారా శాసనసభ, శాసనమండలికి వెళ్లి ఎప్పుడు తిరిగి వస్తుందన్న దానిపై బిల్లు శీతాకాల సమావేశాలలో వస్తుందా? రాదా? అన్నది ఆధారపడి ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి.
ఆలస్యంగా పార్లమెంటు శీతాకాల భేటీ
Published Wed, Oct 23 2013 1:09 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement