
మళ్లీ ఆధార్తో ప్రత్యక్ష నగదు బదిలీ
న్యూఢిల్లీ: ఆధార్తో అనుసంధానించిన ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని తిరిగి ప్రారంభించే అంశంపై కేంద్రం శనివారం సమీక్షించింది. ప్రజలకు సబ్సిడీ పథకాల ప్రయోజనాలను అందించే వ్యవస్థను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ఆధార్ అనుసంధాన పథకాన్ని తిరిగిప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆధార్ ప్రాజెక్ట్పై ప్రధాని మోడీ శనివారం ఢిల్లీలో జరిపిన ఉన్నతస్థాయి సమీక్షలో, సబ్సిడీ పథకాల ప్రయోజనాల ప్రత్యక్ష బదిలీకి ఆధార్ ను ప్రాతిపదికగా వినియోగించుకునే సాధ్యాసాధ్యాలపై చర్చించినట్టు తెలిసింది.
మంత్రులు రాజ్నాథ్, రవిశంకర్ ప్రసాద్, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) డెరైక్టర్ జనరల్ విజయ్ ఎస్ మదన్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. విధినిర్వహణలో ప్రభుత్వ అధికారుల హాజరును ఆధార్ అనుసంధానంతో పర్యవేక్షించే అంశంపై కూడా వారు ఈ సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించిన వ్యవస్థను ఈ నెల 14 నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నట్టు సమాచారం.