
సాక్షి, న్యూఢిల్లీ : లోక్పాల్ నియామక ప్రక్రియ కొనసాగుతోందని, ప్రధానితో కూడిన ఎంపిక కమిటీ మార్చి 1న సమావేశమవుతోందని కేంద్రం శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. లోక్పాల్ నియామకానికి అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టిందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన సుప్రీం బెంచ్కు వివరించారు. లోక్పాల్ నియామకంపై చర్చించేందుకు ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, విపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీ వచ్చే నెల 1న సమావేశం కానుందని తెలిపారు. దీంతో ఈ అంశంపై తదుపరి విచారణను మార్చి 6కు కోర్టు వాయిదా వేసింది.
లోక్పాల్ నియామకంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. గత ఏడాది ఏప్రిల్ 27న లోక్పాల్ నియామకంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఎన్జీఓ కామన్ కాజ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం బెంచ్ విచారిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment