
శ్రీనగర్: అమర్నాథ్ యాత్ర ఆంక్షల కారణంగా జమ్మూ కాశ్మీర్లో సామాన్య పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ ఆర్థిక శాఖ డైరెక్టర్ ఇంతియాజ్ విమర్శలు గుప్పించారు. యాత్ర కారణంగా తన తండ్రి మృతదేహంతో చాలా గంటలు వేచి ఉండే పరిస్థితి రావడం దురదృష్టకరమంటూ ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. తన తండ్రి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలో మరణించారని... అయితే ఆయన శవాన్ని సొంతూరికి తీసుకువెళ్లే క్రమంలో పోలీసుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నానని వెల్లడించారు. యాత్రికులను అనుమతిస్తాము కానీ మృతదేహాలను అనుమతించమని పోలీసులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సీనియర్ ప్రభుత్వ అధికారినని చెప్పినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ఒక ప్రభుత్వ అధికారికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
కాగా రెండు గంటలపాటు ఎదురుచూసిన తర్వాతే తన తండ్రిని శవాన్ని అనుమతి దొరికిందని ఇంతియాజ్ పేర్కొన్నారు. తాము అమర్నాథ్ యాత్రకు ఏ మాత్రం వ్యతిరేకం కాదని అయితే యాత్ర పేరిట సామాన్య పౌరులకు ఇబ్బంది కలిగించడం సబబు కాదని అభిప్రాయపడ్డారు. కాగా ఈ విషయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన కశ్మీర్ డివిజనల్ కమీషనర్ బషీర్ ఖాన్ పౌరహక్కులను నియంత్రించాలనే ఉద్దేశ్యం తమకు లేదని... ట్రాఫిక్ను మాత్రమే తాము నియంత్రిస్తున్నామని వివరణ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment