
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తుల కొరకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. మహిళా భక్తుల కోసం పంబా నుంచి సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల పూజలు ఆరంభం కానున్న నేపథ్యంలో శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం అర్చకులు తెరవనున్నారు. గరురువారం నుంచి సాధారణ అనుమతి వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి సుందరన్ తెలిపారు. ఈ అన్నదానం జనవరి 14 మకర విళక్కు వరకూ కొసాగుతుందని ఆయన చెప్పారు. అరవణ ప్రసాదం, అప్పం అందరికీ అందేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వనయాత్ర (పెద్దపాదం) చేసే భక్తులకు తాగు నీటికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవుల్లో ప్లాస్టిక్ నిషేధించిన కారణంగా.. బక్తులు ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ తమ వెంట తీసుకెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు.