
మళ్లీ పెరిగిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర
న్యూఢిల్లీ : సబ్సిడీపై ఇస్తున్న గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. దేశ్యవ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ ధరలు భారీగా పెరిగిన రెండోరోజే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 14.2 కిలోల బరువుండే ఒక్కో సిలిండర్ పై రూ.2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. సబ్సిడీ సిలిండర్ ధర ప్రస్తుతం ఢిల్లీలో 423.09గా ఉండగా, తాజా పెంపుతో రూ.425.06కు చేరింది. కాగా ఈ ఏడాది జులై నుంచి ఇప్పటివరకూ సబ్సిడీ గ్యాస్ ధరలు పెంచడం ఇది మూడోసారి.
గత నెలలోనే సబ్సిడీ గ్యాస్ ధరలను కేంద్రం పెంచిన విషయం తెలిసిందే. ఆగస్ట్ 1న సిలిండర్పై రూ.1.93, జులై 1న రూ.1.98 పెంచింది. కాగా సబ్సిడీలను తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం సిలిండర్ ధరలను పెంచినట్టు తెలుస్తోంది. ఇలా సబ్సిడీలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రతి నెలా సిలిండర్ ధరలు పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.