
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : సర్వోన్నత న్యాయస్ధానం వెబ్సైట్ అరగంట పైగా క్రాష్ కావడంతో కలకలం రేగింది. జస్టిస్ బీహెచ్ లోయా కేసుపై ఉత్తర్వులు వెలువరించిన అనంతరం సుప్రీం కోర్ట్ వెబ్సైట్ గురువారం మధ్యాహ్నం అరగంట పాటు హ్యాక్ అయింది. వెబ్సైట్ అందుబాటులో లేకపోవడంతో సాంకేతిక విభాగం హ్యాకింగ్ ప్రయత్నం జరిగిందని గుర్తించి భద్రతా చర్య కింద కొద్దిసేపు సైట్ను నిలిపివేసింది. వెబ్సైట్ నిలిచిపోవడాన్ని సుప్రీం కోర్టు నిర్ధారించింది. వెబ్సైట్ పునరుద్ధరణకు మరో రెండుగంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా పదిహేను రోజుల కిందట పలు ప్రభుత్వ వెబ్సైట్ల సేవలు నిలిచిపోవడంతో దీని వెనుక చైనా హ్యాకర్ల హస్తం ఉందనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
అయితే హార్డ్వేర్ వైఫల్యం కారణంగా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) హోస్ట్ చేస్తున్న 10 వెబ్సైట్లు నిలిచిపోయాయని జాతీయ సైబర్ సెక్యూరిటీ సలహాదారు గుల్షన్ రాయ్ వెల్లడించారు.కాగా సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెలువరించిన కొద్దిసేపటికే సుప్రీం కోర్ట్ వెబ్సైట్ నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment