
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద ‘రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం’కు సంబంధించిన ఫైళ్లు ఎవరు ఎత్తుకు పోయి ఉండవచ్చనే విషయమై సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సరిగ్గా అర్ధరాత్రి తన రక్షణ శాఖా కార్యాలయం నుంచి రఫేల్ ఫైళ్లు తీసుకెళ్లడం అక్కడి సీసీటీవీ కెమేరాల్లో చిక్కిందంటూ ఒకరు, రోజుకు 23 గంటలపాటు పనిచేసి, చేసి అలసిపోయిన ప్రధాని నరేంద్ర మోదీ పది సెకండ్లపాటు కునుకుతీయగానే రఫేల్ ఫైళ్లను నెహ్రూ తస్కరించారని మరొకరు, ఫైళ్ల తస్కరణకు నెహ్రూ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ మరొకరు సంబంధిత ఫొటోలతో ట్వీట్లపై ట్వీట్లు చేశారు. (రఫేల్ పత్రాలు చోరీ)
నేటి భారత దేశంలోని పరిస్థితులకు, ప్రతి సమస్యకు నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం కారణమంటూ ఇటు ప్రధాని మోదీ అటు ఆరెస్సెస్ నాయకులు నిందిస్తుండడం వల్లన నెటిజెన్లు ఈ తీరుగా స్పందించి ఉండవచ్చు. నేటి కశ్మీర్ కల్లోలానికి నెహ్రూయే కారణమని, తొలి ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే పరిస్థితి వేరుగా ఉండేదని, అసలు ఆయన ప్రధాన మంత్రి కాకుండా అడ్డుకున్నదే నెహ్రూ అని, నాడు భారత్, పాకిస్థాన్లుగా దేశం రెండుగా చీలిపోవడంలో నెహ్రూ ప్రధాన పాత్ర వహించారని నరేంద్ర మోదీ పదే పదే విమర్శించడం తెల్సిందే.
ఆరెస్సెస్ అయితే మరో మెట్టు ముందుకు వెళ్లి ‘జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు బాధ్యుడు నాథూరామ్ గాడ్సే కాదు. జవహర్ లాల్ నెహ్రూ బాధ్యుడు’ అని 2005లో అప్పటి చీఫ్ కేఎస్ సుదర్శన్ ఆరోపించారు. (ఫ్రాన్సు మాజీ అధ్యక్షుడు కూడా అదే అన్నారు)
Comments
Please login to add a commentAdd a comment