
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు, ఇతర అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేృతృత్వంలో పార్టీ నేతల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో ఓటర్ జాబితా పారదర్శకత ఉండాలని ఈసీని కోరారు. ఒకే ఇంటిలో 50కిపైగా ఓట్లు ఉన్న ఇళ్ల వివరాలను ఈసీకి అందజేశామని, తమ ఫిర్యాదు మీద విచారణ జరుపుతామని రజత్కుమార్ భరోసా ఇచ్చారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను రజత్కుమార్ దృష్టికి తీసుకొచ్చామని, బోగస్, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లపై ఫిర్యాదు చేశామని చెప్పారు.
ఈ విషయంలో ఈసీ ఎవరిని బాధ్యులను చేయకుండా ఎలా ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. కొత్త ఓట్ల నమోదులో బోగస్ ఓట్ల నమోదు జరిగిందని, డిసెంబర్లో బోగస్ ఓట్ల వివరాలు ఇచ్చినా కూడా ఇంతవరకు విచారణ చెయ్యలేదని, ఆ ఓట్లను తొలగించలేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటరు స్లిప్స్ పంపిణీ కూడా సరిగా జరగలేదన్నారు. వీవీప్యాట్లు వచ్చాక పోలింగ్ సమయం ఎక్కువ అవసరమన్నారు. పోలింగ్ తేదీలు కూడా సెలవు దినాలలో కాకుండా వారం మధ్యలో పెట్టాలని కోరామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment