Rajat Kumar
-
త్వరలో నీటిపారుదల సమీకృత చట్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖకు సంబంధించిన 18 వేర్వేరు చట్టాలను కలిపి కొత్తగా ఒక సమీకృత నీటిపారుదల చట్టాన్ని తెస్తున్నామని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఇప్పటికే ముసాయిదా బిల్లును సిద్ధం చేశామని, బడ్జెట్ సమావేశాల్లో కాకుండా ఆ తర్వాత జరిగే సమావేశాల్లో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. నీటిపారుదలశాఖపై ఈఎన్సీ సి.మురళీధర్తో కలసి మంగళవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిజాం కాలం నాటి ఫసలి చట్టం 1935 అమల్లో ఉండగా రాష్ట్ర నీటిపారుదల రంగంలో సమూల మార్పులు రావడంతో కొత్త చట్టం అనివార్యమైందన్నారు. నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణతోపాటు నీటి నిర్వహణ పద్ధతులు, ఆర్థికపరమైన అధికారాలు, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు వచ్చాయని... నీటిపారుదల ఆస్తుల పరిరక్షణ, నీటి భద్రత, నిర్వహణ అంశాలు పాత చట్టాల్లో లేవని, కొత్త చట్టంలో వాటిపై కచి్చతమైన నిబంధనలను పొందుపరచనున్నట్లు రజత్కుమార్ వెల్లడించారు. సెక్షన్–3పై వెనక్కి తగ్గలేదు.. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపకాల కోసం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం–1956లోని సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని రజత్కుమార్ తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ బాధ్యతను కొత్త ట్రిబ్యునల్కు అప్పగించాలా లేక ఇప్పటికే మనుగడలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్–2 లేదా మరే ఇతర ట్రిబ్యునల్కు అప్పగించాలా? అనే అంశంపై న్యాయశాఖ సలహా మేరకు చర్యలు తీసుకుంటామని గత అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. దీనిపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ అధికారులు గతేడాది డిసెంబర్లో హామీ ఇచ్చారని... అందువల్ల ఈ విషయమై మళ్లీ సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాలనే భావనతో ఉన్నామని చెప్పారు. ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల వాటా ఉండగా తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని, ట్రిబ్యునల్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. గోదావరి జలాల విభజనకూ కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటును ఏపీ కోరడంపై స్పందిస్తూ తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. ఎనిమిది డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు.. ఆనకట్టల భద్రతా చట్టం కింద కడెం, మూసీ, స్వర్ణతోపాటు మొత్తం 8 డ్యామ్ల మరమ్మతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. సీతమ్మసాగర్ జలాశయం నిర్మాణంతో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పంపులు నీటమునగనున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని రజత్కుమార్ స్పష్టం చేశారు. -
6లోగా వరదలపై నివేదిక ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్ : వరదల నివారణకు శాశ్వత చర్యలను సూచించడంతో పాటు ఏయే ప్రాంతాలను తరలించాల్సి ఉంటుందో సిఫారసు చేసేలా వరదలపై సమగ్ర నివేదికను నవంబర్ 6లోగా సమర్పించాలని నిపుణుల కమిటీని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్కుమార్ ఆదేశించారు. నవంబర్ 10న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికను సమర్పించి, తదుపరి ఆమోదం తీసుకుంటామని తెలిపారు. భద్రాచలం పరిసరాలు నీట మునగడానికి పోలవరం బ్యాక్ వాటర్తో పాటు ఉప నదుల ప్రవాహం సజావుగా లేకపోవడం, నిలిచి ఉన్న నీరే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాలతో నీటిపారుదలశాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు నేతృత్వంలో నిపుణుల కమిటీ వేశారు. ప్రాథమిక అధ్యయనం అనంతరం అందులోని అంశాలపై శుక్రవారం జలసౌధలో నీటి పారుదలశాఖ రజత్కుమార్, ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, ఈఎన్సీ (గజ్వేల్) బి.హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏడాదిలో 8 నెలలపాటు 892 ఎకరాలు ముంపులోనే... పోలవరం నిర్మాణం పూర్తయి...150 అడుగులు (పూర్తిస్థాయి రిజర్వాయర్ లెవల్)లో నీటిని నిల్వ చేస్తే ఏడాదిలో 8 నెలల పాటు తెలంగాణలోని 892 ఎకరాలు నీట మునుగుతాయని నిపుణులు వివరించారు. ఈ భూములను పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలోనే భాగంగానే సేకరించాలని కమిటీ తెలిపింది. పోలవరం వద్ద డ్యామ్ నిర్మాణం జరగని సమయంలో 25.53 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తే పోలవరం నిర్మాణంలో 2,159 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికే పరిమితమైందని ఈ కారణంగా 103 గ్రామాల్లోనే 40వేల ఎకరాలు నీటమునగగా..28వేల మంది దీనికి ప్రభావితులయ్యారని గుర్తు చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా భద్రాచలం, బూర్గంపాడు, సారపాక వంటి లోతట్టు ప్రాంతాల్లో నీటిని నిరంతరం పంపింగ్ చేయాల్సి ఉంటుందని, దీని కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ అండ్ మెయిటెనెన్స్ ప్రణాళికను సిద్ధం చేయాలని వివరించారు. -
కాళేశ్వరం అనుమతులు పునరుద్ధరించాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండడాన్ని కారణంగా చూపి, కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులకు అనుమతులు జారీ చేసే ప్రక్రియను గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్ఎంబీ) నిలిపివేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అనుమతుల ప్రక్రియను పునరుద్ధరించేలా గోదావరి బోర్డును ఆదేశించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ కేంద్ర జలశక్తి శాఖకు బుధవారం లేఖ రాశారు. అనుమతులు లేకుండా చేపట్టిన అదనపు టీఎంసీ పనుల విషయంలో మాత్రమే యధాతథాస్థితి కొనసాగించాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని లేఖలో స్పష్టం చేశారు. అన్ని అనుమతులున్న కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగానే అదనపు టీఎంసీ పనులను చేపట్టినట్టు ఇప్పటికే కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కలసి నివేదించినట్టు గుర్తు చేశారు. గెజిట్ నోటిఫికేషన్లో పొందుపర్చిన అనుమతి లేని జాబితాల నుంచి అదనపు టీఎంసీ పనుల భాగాన్ని తొలగించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ మధ్య ఈ ప్రాజెక్టు విషయంలో ఆ తర్వాత కాలంలో సమగ్ర చర్చలు జరిగాయన్నారు. సీడబ్ల్యూసీ కోరిన అన్ని రకాల సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేసిందని వివరించారు. ఆ తర్వాతే ఈ ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డుకు సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందన్నారు. ఈ దశలో అనుమతుల ప్రక్రియను గోదావరి బోర్డు నిలుపుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతుల ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని గోదావరి బోర్డును ఆదేశించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి బోర్డు అత్యుత్సాహం.. సీడబ్ల్యూసీ సిఫారసు చేసిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్కు అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసే అధికారం గోదావరి బోర్డుకు లేదని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. డీపీఆర్ను పరిశీలించిన తర్వాత వాటిని బోర్డు సమావేశంలో ఉంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను గోదావరి బోర్డు స్వీకరించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత సీడబ్ల్యూసీలోని టెక్నికల్ అడ్వైయిజరీ కమిటీ (టీఏసీ)కి డీపీఆర్ను గోదావరి బోర్డు పంపించాల్సి ఉంటుందని ఓ అధికారి తెలిపారు. టీఏసీ క్లియరెన్స్ లభించిన తర్వాత అపెక్స్ కౌన్సిల్లో చర్చించి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తారని అధికారులు చెపుతున్నారు. అనుమతుల ప్రక్రియను నిలుపుదల చేసి గోదావరి బోర్డు అత్యుత్సాహం ప్రదర్శించిందని విమర్శిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సవరణ డీపీఆర్ను బోర్డు వెనక్కి తిప్పి పంపలేదని, కేవలం పరిశీలన జరపడానికి నిరాకరించిందని ఓ అధికారి తెలిపారు. -
కాళేశ్వరం పర్యవేక్షణకు ‘కమాండ్ కంట్రోల్’
గజ్వేల్ రూరల్: రాష్ట్రంలోని నదులు, రిజర్వాయర్లు, ప్రధాన కాలువలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇరిగేషన్ శాఖ డేటా సపోర్టింగ్ సిస్టంను తయారు చేసిందని.. ఇందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం గజ్వేల్, కరీంనగర్లలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. శనివారం ఆయన గజ్వేల్ పట్టణంలోని కాళేశ్వరం ఎస్ఈ కార్యాలయంలో కమాండ్ కంట్రోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈలు, ఈఈలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు చేరుతున్నప్పటికీ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాల ద్వారా వరదలు వచ్చినపుడే కాకుండా సాధారణ సమయాల్లోనూ నదులు, ప్రాజెక్టుల సామర్థ్యం, నీటి ప్రవాహ వేగం పరిశీలన, నీటి నిల్వలు, కాలువల కింద ఎంత నీటి అవసరమున్నదనే విషయాలను లెక్కగట్టి నీరు విడుదల చేసే అవకాశముంటుందన్నారు. వరదల జరిగిన నష్టం పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టచర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల వరదల వల్ల లక్ష్మీ పంప్హౌస్లోకి వచ్చిన నీటిని తొలగించే పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల వద్ద అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులంతా అప్రమత్తతతో ఉన్నట్లు వివరించారు. -
Kaleshwaram Project: వందల కోట్ల నష్టమనే ప్రచారం అవాస్తవం: రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నారం, మేడిగడ్డ పంపుహౌస్లు నీట మునగడంతో రూ.వందల కోట్ల నష్టం వాటిల్లిందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. వరదలతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల మేరకు మాత్రమే నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు ఈ నష్టాన్ని కూడా నిర్మాణ సంస్థలే భరిస్తాయని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. 45 రోజుల్లోగా కాళేశ్వరం పంపుహౌస్లకు మరమ్మతులు పూర్తి చేస్తామని.. సెప్టెంబర్లోగా పూర్తిగా పునరుద్ధరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వరదల కారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వాటిల్లిన నష్టంపై రజత్కుమార్ బుధవారం జలసౌధలో సమీక్షించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు వరదల ప్రభావాన్ని సరిగా అంచనా వేయకుండానే కాళేశ్వరం ప్రా జెక్టు నిర్మించడంతో పంపుహౌస్లు నీటమునిగాయన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఎవరూ సరిగా అంచనా వేయలేదు వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ వంటి పరిస్థితులు ఉత్పన్నం కావడంతో పంపుహౌస్లు నీటమునిగాయని రజత్కుమార్ పేర్కొన్నారు. కేంద్ర జల సంఘంలోని 18 విభాగాల నుంచి అనుమతులు లభించాకే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామన్నారు. భారత వాతావరణ శాఖ, యూరోపియన్ శాటిలైట్ ఏజెన్సీలు సైతం వర్షాలు, వరదల తీవ్రతను సరిగ్గా అంచనా వేయలేక పోయాయని చెప్పారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని.. అందువల్లే రికార్డు స్థాయిలో వరద వచ్చినా ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గత వందేళ్లలో ఎన్నడు లేని విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో 30 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురవడంతోనే కడెంకు భారీ వరద వచ్చిందన్నారు. పోలవరంతో తెలంగాణలో భారీ ముంపు గోదావరి నదిపై ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో లక్ష ఎకరాల మేర ముంపు బారినపడతాయని రజత్కుమార్ పేర్కొన్నారు. భద్రాచలం, పర్ణశాలతోపాటు పలు చారిత్రాక ప్రదేశాలు మునిగిపోతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం జరపాలని కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు స్పందన లేదని విమర్శించారు. -
సుజల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లకు పైగా పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జలసౌధలో జరిగిన రాష్ట్ర భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ‘భూగర్భ వనరులు–2020’నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భజల మట్టం మీటర్ పెరుగుదల 100 టీఎంసీల నీటితో సమానమన్నా రు. ఐదేళ్లలో 400 టీఎంసీల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 93% మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు. 50 శాతానికి తగ్గిన భూగర్భ జల వినియోగం 2016–17లో రాష్ట్రంలో 65 శాతం భూగర్భ జలాల వినియోగం ఉండగా, 2019–20 నాటికి 50 శాతానికి తగ్గిందని రజత్కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల లభ్యత పెరగడమే ఇందుకు కారణమన్నారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అధికారులను కోరారు. కాళేశ్వరం కార్పొరేషన్కు ‘ఏ కేటగిరీ’, తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థకు ‘ఏ కేటగిరీ’గ్రేడింగ్ను ఆర్ఈసీ కేటాయించిన నేపథ్యంలో.. ఈ సంస్థలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ లభించనుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఎం.పండిత్ పాల్గొన్నారు. -
తెలంగాణకు తీరని నష్టం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను వినియోగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టదలిచిన ప్రాజెక్టులతో తెలంగాణ ప్రాజెక్టులకు తీరని నష్టం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేశారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేటప్పుడు బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరి అనే విషయాన్ని రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టం గా చెబుతోందని పేర్కొన్నారు. అయినా దానికి విరుద్ధంగా ఏపీ నడుచుకుంటోందని బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీలు తరలించేలా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా కొత్తదని, దీనికి ఎలాంటి అనుమతుల్లేవని, బోర్డు తక్షణం జోక్యం చేసుకొని దీన్ని అడ్డుకోవాలని కోరారు. దీంతోపాటు పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యం పెంచడం కూడా తెలంగాణ తాగు, సాగు నీటి అవసరాలకు విఘాతం కలిగించేదేనని, ఈ దృష్ట్యా ఏపీ తీసుకొచ్చిన జీవో 203పై మరింత ముందుకెళ్లకుండా బోర్డు చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి: 30 ఏళ్ల వరద లెక్కలివ్వండి) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఈలు నరసింహారావు, నర్సింహా.. కృష్ణా బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో బుధవారం జలసౌధలోని ఆయన కార్యాలయంలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన భేటీలో ఇప్పటికే తెలంగాణ అభ్యంతరాలు పేర్కొంటూ రాసిన లేఖను ప్రస్తావిస్తూ, ఏపీ ప్రాజెక్టులతో జరిగే నష్టాన్ని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కోరారు. ఈ అంశంపై తమ పరిధిలో ఏపీ నుంచి వివరణ కోరతామని బోర్డు వారికి హామీ ఇచ్చింది. అలా అయితే అభ్యంతరం లేదు: రజత్ భేటీ అనంతరం రజత్కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు జరిగే నష్టంపై బోర్డుకు వివరించామని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర తాగు, సాగునీటి అవసరాలకు ఇబ్బంది కలుగుతుందని వివరించినట్లు చెప్పారు. గతంలోనే ఈ అంశంపై ఫిర్యాదు చేశామని, దీనిపై ఏపీ వివరణను బోర్డు కోరిందని, అయితే ఇప్పుడు అధికారికంగా జీవో వచ్చినందున తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు. 3 టీఎంసీలతో చేపట్టే లిఫ్టు పథకం ముమ్మాటికీ కొత్తదేనని, దీనికి బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాలని చెప్పామన్నారు. ఈ సందర్భంగానే తమ వాటా 512 టీఎంసీల నుంచే నీటిని వినియోగిస్తామని ఏపీ అంటోంది కదా అని ప్రశ్నించగా.. ‘ఏపీ తమ వాటా మేరకు నీటిని వాడుకుంటే అభ్యంతరం లేదు. అయితే అంతే నీటిని వాడుకుంటున్నారన్న దానికి సరైన విధానం లేదు. పోతిరెడ్డిపాడు వద్ద టెలిమెట్రీ పెట్టాలని చెప్పినా అది పూర్తిగా అమల్లోకి రాలేదు. అక్కడి నీటి వినియోగంపై సరైన పర్యవేక్షణ లేదు. మాటల్లో చెప్పేది ఒకటి, చేసేది ఇంకోటైతే సమస్యే కదా’అని పేర్కొన్నారు. ప్రస్తుతం మధ్యంతర ఒప్పందం మేరకు తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల మేర కేటాయింపులున్నాయని, అయితే పరీవాహకం ఆధారంగా చూస్తే తెలంగాణకు సైతం వాటా పెరగాల్సి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్ ముందు తాము పోరాడుతున్నట్లు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2009లో భారీ వరదలు వచ్చాయని, అలా వచ్చినప్పుడు సమస్య లేదని, అదే 2017, 2018లో వరద లేక క్రాప్ హాలిడే ప్రకటించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. శ్రీశైలానికి వరద రాకుంటే తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలోని ప్రాజెక్టుల కింద తాగు, సాగు అవసరాలకు నీరందడం కష్టం అవుతుందని పేర్కొన్నారు. అందుకే ఏపీ ప్రాజెక్టులను ఆపాలని కోరుతున్నట్లు చెప్పారు. -
‘సీతారామ’ వేగం పెంచండి
సాక్షి, కొత్తగూడెం: కాళేశ్వరం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని, మే చివరికల్లా మొదటి ప్యాకేజీ పనులు పూర్తవ్వాలని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ ఆదేశించారు. శనివారం అశ్వాపురం మండలంలో జరుగుతున్న సీతారామ ప్రాజెక్టు పనులను ఆయన ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండేతో కలిసి పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వచ్చిన బృందం నేరుగా అశ్వాపురం గౌతమీనగర్ హెవీవాటర్ ప్లాంట్లోని పర్ణశాల అతిథి గృహానికి చేరుకుంది. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి కుమ్మరిగూడెం వద్ద ప్రస్తుతం ఉన్న దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సీతమ్మసాగర్ పేరుతో మరో ఆనకట్ట నిర్మించేందుకు నిర్ణయించిన ప్రాంతాన్ని పరిశీలించారు. మ్యాప్ల ద్వారా కాంటెక్ సంస్థ, అధికారులతో మాట్లాడి కొత్త బ్యారేజీ ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యం, వరద ముంపు తదితర వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంప్హౌసులు, కెనాల్ పనుల వివరాలు తెలు సుకున్నారు. అనంతరం బీజీకొత్తూరులో సీతారామ ప్రాజెక్ట్ మొదటి ప్యాకేజీ పంప్హౌస్ పనులను పరిశీలించారు. సీతారామ ప్రాజెక్ట్ అధికారులు, నిర్మాణ సంస్థ బాధ్యులతో మాట్లాడి పంప్హౌస్ పనుల పురోగతిని, పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయనే వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం సీతారామ పనుల తీరుపై మేఘా సంస్థ అధికారులతో సీతారాంపురం వద్ద సమీక్ష సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. విద్యుత్ స్టేషన్కు వెళ్లే రహదారిపై దుమ్ము లేవకుండా నీళ్లు చల్లించాలని సూచించారు. 8 ప్యాకేజీలపై సమగ్ర సమీక్ష పనుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జాప్యం ఉండొద్దని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నిర్ణీత కాలంలోనే పనులన్నీ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు 8ప్యాకేజీల పనులను రజత్కుమార్ సమగ్రంగా సమీక్షించారు. మొదటి ప్యాకేజీలో 75 శాతం పనులు పూర్తి కావచ్చాయని, రెండో ప్యాకేజీ పనులను వేగవంతం చేశామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. పనులపై రోజువారీ పర్యవేక్షణ చేయాలని ఎస్ఈ నాగేశ్వరరావును ఆదేశించారు. 3వ ప్యాకేజీ పనులు పురోగతిలో ఉన్నాయని, 4వ ప్యాకేజీలో మిషన్ భగీరథ పైపులైన్ల పనుల కారణంగా 60 శాతం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ఇసుక కొరత ఉందని, కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రెటరీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇసుక విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. మార్చి 22 నాటికి సీతారామ ప్రాజెక్టు పనులు ఒక దశకు వచ్చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, సీతారామ ప్రాజెక్ట్ ఎస్ఈలు వెంకటకృష్ణ, నాగేశ్వరరావు, ఈఈ బాబురావు, డీఈలు మహేశ్వరరావు, వెంకటేశ్వరరావు, తహసీల్దార్ భగవాన్రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఇతర అధికారులున్నారు. -
15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. -
‘కేసీఆర్కు భయం పట్టుకుంది’
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్లో గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎన్నికల సంఘం సీఈఓ రజత్కుమర్ను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన ఓ టీవీ చానల్, ఇంగ్లీష్ పత్రికలో భారీగా టీఆర్ఎస్ అభ్యర్థి కోసం ప్రకటనలు ఇస్తున్నారని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఈ ఉపఎన్నికలో పెద్ద ఎత్తున మద్యం, డబ్బు సరఫరా జరుగుతోందన్న విషయాన్ని రజత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్వర్రెడ్డిలు కోదాడలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెలిపామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన మంత్రులపై కేసులు నమోదు చెయాలని కోరామని వెల్లడించారు. కేసీఆర్ హుజూర్నగర్ సభలో ఎలాంటి విధానపరమైన ప్రకటనలు చేసినా చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం సీఈఓకు విజ్ఞప్తి చేశామని శశిధర్రెడ్డి తెలిపారు. హుజుర్ నగర్ ఉపఎన్నికలపై కేసీఆర్కు భయం పట్టుకుందని అందుకే తానే స్వయంగా ప్రచారానికి రావాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్ ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చెయాలంటే హుజూర్నగర్లో కాంగ్రెస్పార్టీని గెలిపించాలని కోరారు. -
మరికొద్ది గంటల్లో!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. 41 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17లోక్సభ స్థానాలతోపాటు దేశంలోని 542 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను గురువారం లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నా రు. నేడు జరగనున్న కౌంటింగ్కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కు మార్ ప్రకటించారు. బుధవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను వివరించా రు. ప్రశాంతంగా, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ని ర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. రా ష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు తొలిదశలో (ఏప్రిల్ 11న) పోలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ప్రారంభం రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 35 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల కలిపి లెక్కింపు కోసం 126 హాళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎన్నికల పరిశీలకుడు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లోక్సభ స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్లను లెక్కించనున్నారు. ప్రతి శాసనసభ స్థానం పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి ఒక హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది బరిలో ఉన్నందున అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలైన ఓట్లను రెండేసి హాళ్లలో లెక్కించనున్నారు. ఒక్కో హాల్లో 18 చొప్పున మొత్తం 36 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్న మల్కాజ్గిరి లోక్సభ స్థానంలోని మేడ్చల్, ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను లెక్కించడానికి 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సువిధ యాప్లో ఫలితాలు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ (ఈటీపీబీ)లను లెక్కించనున్నారు. అనంతరం ఉదయం 8.20 గంటలకు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఈవీఎంల రౌండ్లన్నీ పూర్తయిన తర్వాత ప్రతి శాసనసభస్థానం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాలను ర్యాండమ్ విధానంలో ఎంపిక చేసి, అక్కడ నమోదైన వీవీప్యాట్స్ ఓట్లను లెక్కించనున్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్స్ ఓట్లను సరిపోల్చి చూస్తారు. ఈవీఎం, వీవీప్యాట్స్లలోని ఓట్లలో తేడాలొస్తే వీవీప్యాట్స్ స్లిప్పుల కౌంటింగ్ను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రతి రౌండు పూర్తి కాగానే సువిధ అప్లికేషన్ ద్వారా ఫలితాలను రిటర్నింగ్ అధికారులు పోర్టల్లో నమోదు చేస్తారు. దీంతో ఓట్ల లెక్కింపు ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్పోర్టల్ (https://results.eci.gov.in) ద్వారా ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులు ప్రకటించిందని రజత్కుమార్ తెలిపారు. గురువారం మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. రిటర్నింగ్ అధికారే కింగ్! ఓట్ల కౌంటింగ్, రీ–కౌటింగ్కు సంబంధించిన ఏ విషయంలోనైనా నిర్ణయాధికారం స్థానిక రిటర్నింగ్ అధికారిదేనని రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి ఫలితాలను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు నిశ్శబ్ద సమయం ఉండనుంది. ఓట్ల లెక్కింపుపై అనుమానాలుంటే ఆ రెండు నిమిషాల్లోగా అభ్యర్థులు, వారి ఏజెంట్లు లిఖితపూర్వకంగా రీ–కౌంటింగ్ కోరాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారులు తమ విచక్షణ ఉపయోగించి రీ–కౌంటింగ్ జరపాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ విజ్ఞప్తిని తిరస్కరిస్తే మాత్రం ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారులు లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్కుమార్ స్పష్టం చేశారు. వీవీప్యాట్స్ ఓట్లు కీలకం! కొన్ని సందర్భాల్లో వీవీప్యాట్స్ ఓట్లు కీలకం కానున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంల మీద ఉండే ‘క్లోజ్’మీటను నొక్కడాన్ని ప్రిసైడింగ్ అధికారులు మరిచిపోతే, మళ్లీ క్లోజ్ మీటను నొక్కే వరకు అలాంటి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడం సాధ్యం కాదు. ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో సంబంధిత పోలింగ్ కేంద్రంలో పోలైన ఓట్లను సరిచూసుకున్న తర్వాత క్లోజ్ మీటను నొక్కి ఓట్లను లెక్కిస్తారు. ఒక వేళ పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల సంఖ్యలో తేడాలుంటే, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను కాదని వీవీప్యాట్స్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇప్పటి వరకు ఎక్కడా ఈవీ ఎం, వీవీప్యాట్స్ ఓట్ల మధ్య తేడాలు రాలేదని రజత్కుమార్ వెల్లడించారు. పోలింగ్ రోజు మాక్ పోల్ లో వేసిన ఓట్లను ఈవీఎం నుంచి డిలీట్ చేయడాన్ని పోలింగ్ సిబ్బంది మరిచిపోతే, వాస్తవ పోలింగ్ ఓట్లతో మాక్పోల్ ఓట్లు కలిసిపోనున్నాయి. ఇలాంటి సందర్భాల్లో సైతం వీవీప్యాట్స్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటామని రజత్కుమార్ వెల్లడించారు. తిరస్కరించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య మార్జిన్ ఓట్ల సంఖ్య కంటే ఎక్కువ ఉంటేనే మళ్లీ తిరస్కరించిన పోస్టల్ ఓట్లకు రీ–కౌంటింగ్ చేయనున్నారు. -
ఓట్లు లెక్కించేందుకు సర్వం సిద్ధం: సీఈవో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఈ నెల 23న ఓట్లు లెక్కించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 18 జిల్లాల్లోని 35 ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన 82 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 23న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇందుకు మొత్తంగా 1,841 టేబుళ్లు ఏర్పాటు చేయను న్నట్లు వివరించారు. 110 సెగ్మెంట్లలో ఒక్కో సెగ్మెంట్లో 15 (14+1) టేబుళ్లను, నిజామాబాద్లోని 7 సెగ్మెంట్లలో 19 (18+1) టేబుళ్లను, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మేడ్చల్, ఎల్బీనగర్లోని 2 సెగ్మెంట్లలో 29 (28+1) టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడు ఉంటారని చెప్పారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అదనపు లెక్కింపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్స్, ఇద్దరు కార్మికులు, ఒక డీఈవో ఉంటారని వివరించారు. వీరితోపాటు 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు ఉంటారని, మొత్తం 6,745 మంది లెక్కింపులో పాల్గొంటారని తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే పూర్తయిందని, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ర్యాండమ్గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్లలోని పేపర్ స్లిప్పులను కూడా లెక్కిస్తామని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల ఫలితాల ప్రకటన 3 గంటలు ఆలస్యం కావొచ్చని రజత్ కుమార్ తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికే ఓటు హక్కు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు స్థానిక సంస్థ ల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీలకే ఓటు హక్కు లభించనుం దని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. ప్రస్తుత జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం జూలై 5తో ముగియనుందని పేర్కొన్నారు. దీనికి నెల రోజులకు ముందుగా (మే 31న) ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండటంతో ఓటు హక్కు వారికే లభిస్తుందని తెలిపారు. ఈ మేరకు పాత ఓటర్ల జాబితాతోనే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం జారీ చేసింది. ఈ సందర్భంగా సీఈఓ విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం ఏదైనా నియోజకవర్గం ఖాళీ అయితే, ఖాళీ అయిన తేదీ నుంచి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ నియోజకవర్గాలు ఖాళీ అయి వరుసగా జూన్ 10, 16, 21 నాటికి ఆరు నెలల కాలం పూర్తవుతుందన్నారు. ఈ మూడు స్థానాలకు సంబంధించి న్యాయ స్థానాల్లో ఎలాంటి కేసులు లేకపోవడంతో ఆరు నెలల గడువులోగా ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు. దీంతో జూలై 5 వరకు పదవీ కాలం ఉన్న ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీలే ఓటు హక్కు పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితా లు మే 27న రానుండగా, గెలిచిన కొత్త సభ్యుల పదవీ కాలం జూలై 5 తర్వాత ప్రారంభం కానుండటంతో అంతకు ముందే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారికి ఓటు హక్కు కల్పించే ఆస్కారం లేదన్నారు. మిగతా స్థానాలకు త్వరలో ఎన్నికలు.. ఉమ్మడి వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని సీఈఓ తెలిపారు. రిటర్నింగ్ అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే స్థానిక సంస్థల ప్రతినిధులపై కోర్టు కేసులున్నా.. వారు ఓటేసేందుకు అర్హులేనన్నారు. ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సైతం త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. -
అసత్య ప్రచారాలు చేస్తే కేసులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల యంత్రాంగం పూర్తిగా నిబంధనల మేరకే నడుచుకుందని, దురుద్దేశాలతో, అవగాహన లేమితో కొందరు పనిగట్టుకుని అవాస్తవాలు వ్యాప్తి చేస్తున్నారని, పత్రికలు, టీవీలు కూడా నిజానిజాలు తెలుసుకోకుండా వాటిని ప్రచురించడంతో ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపు, పోలింగ్ శాతంపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్లో పోలింగ్ శాతం మొదట ప్రకటించిన దానికి, తుది ప్రకటనకు మధ్య వ్యత్యాసంపై కొందరు లేనిపోనివి మాట్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంచనా శాతం ప్రకటిస్తామని, తర్వాత అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి సమాచారం అందాక 17–ఏ ఫారం (ఓటర్లు ఓటు వేసేముందు సంతకం చేసే రిజిస్టర్)తో పోల్చి చూసుకుని, పోలింగ్ శాతం తుది వివరాలతో 17 సీ ఫారం నింపి ఒక కాపీని పోలింగ్ కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీల, అభ్యర్థుల ఏజెంట్లకు అందజేస్తామని, ఈ వివరాలనే మీడియాకు కూడా ఇచ్చామని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగేలా కొందరు సామాజిక మాధ్యమాల్లో ఈసీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ సరిహద్దుల్లో ఒక ప్రముఖ నేత ఇంట్లో దొరికిన ఈవీఎంలంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అది రాజస్తాన్కు చెందిన పదేళ్ల కిందటి వీడియో అని స్పష్టం చేశారు. నిజామాబాద్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నడిచిందని, చాలా పోలింగ్ కేంద్రాల్లో 6 గంటల వరకు పోలింగ్ జరిగిందన్నారు. జీపీఎస్తో ఈవీఎంల తరలింపు పోలింగ్ పూర్తయిన సాయంత్రం 5 గంటలకు అంచనా వివరాలు ఇస్తామని.. తర్వాతి రోజు మాత్రమే పోలింగ్ శాతాలపై స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని పేర్కొన్నారు. నిజామాబాద్ మినహా ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు అర్ధరాత్రి 12.04 గంటలు అయిందన్నారు. మొత్తం స్ట్రాంగ్ రూమ్లు సీల్ చేసే వరకు ఉదయం 5.30 గంటలు అయిందన్నారు. తాము ఎంతో కష్టపడి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్క మాటతో చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల తరలింపునకు జీపీఎస్ ట్రాకింగ్ కూడా ఉందన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి అంచె భద్రతలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా ఉండొచ్చన్నారు. పోలింగ్ ముగిసే ముందు ఫారం 17సీ కాపీలు పోలింగ్ ఏజెంట్లకు అందిస్తామని.. దానిపై వాళ్ల సంతకాలు సైతం ఉంటాయన్నారు. ఫారం 17 ఏ, ఫారం 17సీని సరిచూసుకున్న తర్వాత కూడా పోలింగ్ శాతంపై అనవసర రాద్ధాంతం చేయడం తగదన్నారు. రిసెప్షన్ సెంటర్కు వచ్చిన తర్వాత కూడా 17 సీ ఫారం పరిశీలిస్తామన్నారు. పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత కూడా ఎందుకు అనుమానిస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. స్ట్రాంగ్రూం నుంచి వీవీప్యాట్లు బయటకు తీసుకువచ్చే ముందు ఆ కాపీలను సరిచూస్తామన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఆరోపణలు చేసేటప్పుడు ఫారం–17సీ ఎందుకు సరిచూడరన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన కీసర స్ట్రాంగ్ రూమ్లో ఒక పార్టీ నేత ఫొటోపై కలెక్టర్ను వివరణ కోరామన్నారు. అతడిని అరెస్ట్ కూడా చేశామన్నారు. ఫొటోలు తీసుకున్న వ్యక్తిపై న్యాయవిచారణ జరుగుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా పనిచేస్తున్నట్టు స్పష్టంచేశారు. పోలింగ్ శాతాలతో పాటు పలుచోట్ల ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి తొలుత విడుదల చేసిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వచ్చిన శాతానికి 10 శాతం పెరగడంపై మీడియా ప్రశ్నించగా, సాయంత్రం చల్లగా ఉంటుందని ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని అనుకోవచ్చు కదా అని రజత్ కుమార్ సమాధానమిచ్చారు. అవి శిక్షణ ఈవీఎంలు.. జగిత్యాలలో ఆటోలో రవాణా చేసిన ఈవీఎంలను పోలింగ్ కోసం వాడలేదని.. కేటగిరీ–సీ కిందకు చెందిన వాటిని అధికారుల శిక్షణ, అవగాహన కోసం వాడినట్లు స్పష్టంచేశారు. మండల కేంద్రం నుంచి వాటిని జిల్లా కేంద్రానికి తరలిస్తున్నట్లు చెప్పారు. ఈవీఎంలు నాలుగు రకాలుంటాయన్నారు. మొదటి రకం పూర్తిగా ఓటింగ్కు వినియోగించేవని, ఓటింగ్ కొంతమేర జరిగిన తర్వాత సమస్యలొస్తే కొత్త ఈవీఎం వాడుతామని.. ఈ రెండింటికి మాత్రం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పటిష్టమైన భద్రతలో ఉంచుతామని వివరించారు. మాక్ పోలింగ్ నిర్వహించే సందర్భంలో లోపాలున్న వాటిని తొలగించి వేరు చేస్తామనీ, ఇవి మూడో రకం ఈవీఎంలని అన్నారు. వీటిని తయారీదారుకు తిప్పి పంపుతామన్నారు. ముందు జాగ్రత్తగా అదనంగా కొన్ని ఈవీఎంలను తెప్పించి రిజర్వులో ఉంచుతామనీ వీటిని నాలుగో రకం అంటామన్నారు. ఇవి మన రాష్ట్రంలో కానీ, అవసరమైన ఇతర రాష్ట్రాలకు తరలించడానికి సిద్ధంగా ఉంచుతామని చెప్పారు. అందువల్ల చివరి రెండు రకాల ఈవీఎంలను తరలిస్తున్న సందర్భాలను చూసి వాస్తవాలను తనిఖీ చేసుకోకుండా ఓట్లతో ఉన్న ఈవీఎంలను తరలిస్తున్నట్లు ప్రచారం కల్పిస్తే అహోరాత్రులు శ్రమిస్తున్న అధికార యంత్రాగం విశ్వసనీయత కోల్పోయే ప్రమాదముందని, సంబంధిత సమాచారంపై ఎప్పుడు వివరణ కావాలన్నా సీనియర్ అధికారులందరూ మీడియాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారనీ, వాస్తవాలను నిర్ధారించుకోవచ్చని సూచించారు. శిక్షణకు, ఓటర్ల అవగాహనకు ఉపయోగించేవాటిని, రిజర్వులో ఉంచిన వాటిని కూడా కేంద్ర గోదాముల్లో సాయుధ కాపలాతోనే ఉంచుతామని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లతో ఫలితాలు త్వరగా వస్తాయనేది అవాస్తవమన్నారు. ఓటింగ్ శాతంపై అనుమానం వద్దన్నారు. ఎన్నికలు జరిగాక వీడియో రికార్డులను పరిశీలకులు అన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారన్నారు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ప్రసారం చేసిన చానెల్ పై కేసులు బుక్ చేస్తామన్నారు. -
మీడియాపై కేసులు నమోదు చేస్తాం..
హైదరాబాద్: ప్రజాస్వామ్యంపై మనందరికీ నమ్మకం ఉండాలని, సోషల్ మీడియాలో పోలింగ్ పర్సంటేజీపై అసత్య ప్రచారం జరగడంపై ఈసీ ఆగ్రహంగా ఉందని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం సెక్రటేరియట్లో రజత్ కుమార్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ జరిగిన రోజే పోలింగ్ పర్సంటేజీ అంత కరెక్ట్గా తెలియదని, అంచనా వేసి మాత్రమే చెప్తామని అన్నారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎస్టిమేషన్ పోలింగ్ పర్సంటేజ్ ఎంత అని చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది..కాబట్టి తాము ఎస్టిమేషన్ పర్సంటేజ్ మాత్రమే చెప్తామని వెల్లడించారు. 17ఏ, 17సీ కాపీ ప్రతి పోలింగ్ ఏజెంట్కు ఇస్తాం.. పోలింగ్ అయిపోయాక పోలింగ్ ఏజెంట్ల సంతకం రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకుంటారని పేర్కొన్నారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలు,17ఏ, 17సీ కాపీలను సీల్ వేసి స్ట్రాంగ్రూంలో భద్రపరిచామని తెలిపారు. అసత్య ప్రచారం చేస్తోన్న సోషల్ మీడియాపై కేసులు కచ్చితంగా బుక్ చేస్తామని హెచ్చరికలు పంపారు. జగిత్యాలలో ఆటోలో తీసుకెళ్తున్న ఈవీఎం, శిక్షణలో ఉన్న వారి కోసం వాడారని స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం నాలుగు రకాల ఈవీఎంలు ఉన్నాయని, ఎ కేటగిరీ ఈవీఎంలు మాత్రమే పోలింగ్కు వాడుతున్నామని తెలిపారు. వంద మీటర్ల లోపు పోలింగ్ బూత్ల వద్దకు వాహనాల అనుమతి లేదని చెప్పారు. మాక్ పోలింగ్లో ఫెయిల్ అయిన ఈవీఎంలను సీ కేటగిరీ ఈవీఎంలుగా పరిగణిస్తామని, వాటిని వెంటనే కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని అన్నారు. కీసర స్ట్రాంగ్ రూంలో టీఆర్ఎస్ అభ్యర్థి వెళ్లిన సందర్భం వేరు.. స్ట్రాంగ్రూంలో ఈవీఎంలు పెట్టే ముందు అన్ని రాజకీయపార్టీల వారు పరిశీలిస్తారు.. ఆ సందర్భంలోనే ఆయన ఫోటో తీసుకున్నాడని చెప్పారు. పోల్ అయిన ఓట్లలో నోటా ఓట్లను తొలగించి పర్సంటేజీ లెక్కిస్తామని, పోలిటికల్ మోటివేషన్తోనే సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. -
ఇందూరు ఎన్నికలపై అనుమానాలు: అరవింద్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ ఎన్నికల తీరుపై అక్కడి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ను సోమవారం ఆయన సచివాలయంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. సమాచార హక్కు చట్టం కింద నిజామాబాద్ లోక్సభ పోలింగ్కు సంబంధించిన వివరాలను అందజేయాలని సీఈఓను కోరారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద తమ పార్టీ ప్రతినిధులను కాపలా పెట్టుకోవడానికి అనుమతించాలని కోరగా, సీఈఓ సానుకూలంగా స్పందించారు. సమావేశం అనంతరం అరవింద్ విలేకరులతో మాట్లాడారు. పోలింగ్ శాతంతో పాటు పలు అంశాలపై సమాచారం అందించాలని ఆర్టీఐ కింద సీఈఓకు దరఖాస్తు చేశామని తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారాన్ని అందజేస్తామని సీఈఓ హామీ ఇచ్చారని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని యంత్రాలు ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్కు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, అక్కడ ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని సీఈఓ హామీ ఇచ్చారని వెల్లడించారు. -
ఈవీఎంలకు ‘స్ట్రాంగ్’ భద్రత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో పోలింగ్ కోసం వినియోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఉంచామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ పేర్కొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్స్ల భద్రత, తరలింపు వంటి అంశాల్లో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కండ్లకోయ గ్రామంలో ఉన్న ఏఎంసీ గోదాంను రాష్ట్ర స్థాయిలో కేంద్ర గోదాంగా వినియోగిస్తున్నామన్నారు. ఇక్కడికి తీసుకువచ్చే, ఇక్కడి నుంచి తీసుకుపోయే ఈవీఎంల కదలికలు, ఇక్కడ ఉంచిన వాటికి భద్రత కల్పించడం వంటి విషయాలపై ఎప్పటికప్పడు రాజకీయ పార్టీలకు తగిన సమాచారం అందిస్తామన్నారు. ఈసీ ఆదేశాల మేరకు ఈ కింది నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కేటగిరి–ఏ: ఓట్లతో నిండిన ఈవీఎంలను పోలింగ్ ముగిసిన తరువాత నిబంధనల పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలి. కేటగిరి–బీ: కొన్ని ఓట్లు పోలైన తరువాత లోపాల కారణంగా తొలగించిన ఈవీఎంలను తగిన విధివిధానాలను పాటించిన తరువాత కేటగిరీ–ఏ ఈవీఎంతో పాటే, విడిగా భద్రపరచాలి. కేటగిరి–సీ: పోలింగ్ ప్రారంభానికి ముందే లోపాలు బయటపడి తొలగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో కాకుండా వేరే గదిలో భద్రపరచాలి. తరువాత తగిన విధివిధానాలు అనుసరించి వాటిని సంబంధిత తయారీదారుకు తిప్పి పంపాలి. కేటగిరి–డీ: ముందు జాగ్రత్త కోసం అదనంగా తెప్పించి, పోలింగ్కు అసలు ఉపయోగించకుండా సెక్టార్/జోనల్/ ఏరియా మేజిస్ట్రేట్ దగ్గర రిజర్వ్లో ఉన్న ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో కాకుండా విడిగా మరో గదిలో భద్రపరచాలి. మూడంచెల భద్రత... ఈవీఎంలను ఉంచిన ప్రదేశం చుట్టూ తొలి భద్రతావలయంగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీపీఎఫ్) రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. దాని తర్వాత భద్రతా వలయంగా రాష్ట్ర సాయుధ దళం కాపలా కాస్తుంది. ఆ రెండింటి చుట్టూ ఉన్న ప్రాంత వలయాన్ని జిల్లా ఎగ్జిక్యూటివ్ దళం కనిపెట్టుకుని ఉంటుంది. ఓట్లతో ఉన్న ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద కనీసం ఒక ప్లటూన్ ఉంటుంది. పరిశీలకులు లేదా జిల్లా ఎన్నికల అధికారులు లేదా పోలీస్ సూపరింటెండెంట్లు లేదా వారి ప్రతినిధులు లేదా ఇతర వ్యక్తులతో సహా ఎవరైనా తొలి భద్రతా వలయంలోకి వెళ్లిరావాలంటే దానికి తగిన నియమాలను తప్పకుండా పాటించాలి. రెండో (మధ్య) భద్రతా వలయం దాటే వారి పేరు, తేదీ, సమయం, వ్యవధి అన్నీ కేంద్ర బలగాలు నిర్వహించే లాగ్ బుక్లో వివరంగా పేర్కొనాలి. ఇటువంటి సందర్శనలను వీడియోగా చిత్రీకరించడానికి కేంద్ర బలగాలకు తగిన పరికరాలు ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్ సందర్శించాలనుకునే అభ్యర్థుల ఏజంట్లను సీసీటీవీ ద్వారా చూడటానికి అనుమతించవచ్చు. దీనిని కూడా లాగ్ బుక్లో నమోదు చేయాలి. స్ట్రాంగ్ రూమ్కు డబుల్ లాక్ పద్ధతి ఉండాలి. ఒక తాళం చెవి జిల్లా ఎన్నికల అధికారి వద్ద, మరొకటి సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద ఉండాలి. స్ట్రాంగ్ రూమ్ పక్కనే 24 గంటలూ ఒక కంట్రోల్ రూమ్ పని చేస్తుండాలి. ఒక పోలీస్ అధికారితో పాటూ, ఒక గెజిటెడ్ అధికారి నిరంతరం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండాలి. స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లడానికి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉండాలి. అగ్నిమాపక దళం తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి. జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ల భద్రతకు, ప్రొటోకాల్ అమలుకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యులు. రిటర్నింగ్ అధికారులు ప్రతిరోజూ స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణాన్ని అంతర్ వలయం (తొలి వలయం) వరకు ఉదయం, సాయంత్రం వెళ్లి లాగ్ బుక్ను, వీడియో చిత్రీకరణను పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలి. ఈవీఎంలు భద్రపరిచిన ప్రాంగణంలోకి ఏ అధికారి, మంత్రి లేదా మరే ఇతర రాజకీయ నాయకులకు చెందిన వాహనాలను అనుమతించ కూడదు. ఓట్ల లెక్కింపు జరిగే రోజున, అభ్యర్థులు, వారి ప్రతినిధులు, ఆర్ఓ, పరిశీలకుల సమక్షంలో వీడియో చిత్రీకరణతో స్ట్రాంగ్ రూమ్ను తెరవాలి. ఈవీఎంలను కౌంటింగ్ కోసం బయటికి తీయడం, అది ముగిసిన తరువాత తిరిగి వాటిని తీసుకొచ్చి అక్కడ భద్రపరిచే కార్యక్రమాన్నంతా పూర్తిగా వీడియో తీయాలి. కౌంటింగ్ ముగిసిన తరువాత నిబంధనల ప్రకారం ఈవీఎంలను (బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు), వీవీప్యాట్లను సీల్ వేసి భద్రపరచడానికి తిరిగి స్ట్రాంగ్ రూమ్లకు చేర్చాలి. అభ్యర్థులకు.. ఎన్నికల సంఘానికి చెందిన సీఈఓ, అదనపు సీఈఓ, డీఈసీ ఇన్చార్జీలు, సంబంధిత డీఈఓ, ఎస్పీ, సీఓపీ, ఆర్ఓ ఫోన్ నంబర్లు ఇవ్వాలి. ఈ నియమనిబంధనల ప్రతులను అభ్యర్థులందరికీ, డీఈఓలకు, ఆర్ఓలకు, కేంద్ర బలగాల కమాండెంట్కు అందచేయాలి. -
61 శాతం పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు గురువారం నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో 61% అంచనా పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం కచ్చితమైన పోలింగ్ గణాంకాలను వెల్లడిస్తామన్నారు. మే 23న లోక్సభ ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 16 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు, నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సమయం ముగిసే వరకు క్యూల్లో నిలబడిన ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సంఘం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా రీపోలింగ్ ఉండదు! నిజామాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 7.30 గంటల వరకు పోలింగ్ జరుగుతూనే ఉందని రజత్కుమార్ వెల్లడించారు. పోలింగ్ వేళలు ముగిసిన అనంతరం గురువారం రాత్రి ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 3 లక్షల మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది, భద్రతా బలగాలకు రజత్కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలను విజయవంతం చేసేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు అభినందనలు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నం కాలేదన్నారు. హింసా, దౌర్జన్యాలు, బూత్ల స్వాధీనం వంటి ఘటనలు జరగలేదన్నారు. ఒక పార్టీకి ఓటేస్తే మరో పార్టీకి పడిందంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న ఫొటోల విశ్వసనీయతను రజత్ కుమార్ ప్రశ్నించారు. ఈ ఫొటోలపై విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు. పోలింగ్పై భానుడి ప్రతాపం పోలింగ్ ఉదయంపూట జోరుగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.6%, 11 గంటలకు 22.8%, మధ్యాహ్నం ఒంటిగంట వరకు 38.80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత ఎండ తీవ్రత కారణంగా మందకొడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు 48.95% పోలింగ్ నమోదైంది. సాయంత్రం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత మళ్లీ పుంజుకుంది. సాయంత్రం 5 గంటల నాటికి 61 శాతానికి చేరింది. కొన్ని చోట్ల ఆలస్యంగా ప్రారంభం షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈవీఎంలు మొరాయించడంతో పలు కేంద్రాల్లో గంట నుంచి రెండు గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30–6.45 గంటల మధ్య మాక్పోలింగ్ నిర్వహించిన తర్వాత పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. మాక్పోలింగ్లోనే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో మొత్తం 64,512 బ్యాలెట్ యూనిట్లు, 34,635 కంట్రోల్ యూనిట్లు, 34,770 వీవీప్యాట్స్ వినియోగించగా, మాక్ పోలింగ్ సందర్భంగా 541 బ్యాలెట్ యూనిట్లు, 639 కంట్రోల్ యూనిట్లు, 843 వీవీప్యాట్స్ను మార్చాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు వాస్తవ పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా కొన్ని చోట్ల యంత్రాలు మొరాయించాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి ఈవీఎంల సమస్యలు తగ్గాయని రజత్కుమార్ పేర్కొన్నారు. బద్ధకించిన జంటనగరాలు ఓటేసేందుకు జంటనగరాల ప్రజలు మళ్లీ బద్దకించారు. సాయంత్రం 5 గంటలకు ప్రకటించిన పోలింగ్ శాతం అంచనాల ప్రకారం.. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో అత్యల్పంగా 44.99% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 39.49%, మల్కాజ్గిరి స్థానం పరిధిలో 49.21% పోలింగ్ నమోదైంది. మెదక్ లోక్సభ పరిధిలో అత్యధికంగా 68.60% పోలింగ్ జరిగింది. గ్రామీణ ప్రాంతాలతో కూడిన చేవెళ్ల లోక్సభలో 54.8% పోలింగ్ నమోదైంది. జంటనగరాల పరిధిలో అత్యల్ప ఓటింగ్ శాతం నమోదు కావడంపై సీఈఓ రజత్కుమార్ స్పందించారు. గురువారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత, బలమైన అభ్యర్థులు బరిలోలేకపోవటం, జాతీయస్థాయిలో రాజధాని అంశాలు ఎజెండాలో లేకపోవటం, విస్తృత ప్రచారానికి సమయం లేకపోవటం, నగరంలో ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు అందకపోవటం వంటి కారణాలతోనే పోలింగ్ తక్కువగా నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 85%, ఎమ్మెల్యే ఎన్నికల్లో 70–75% పోలింగ్ జరిగిందన్నారు. ప్రజలతో అనుసంధానమై ఉండే వ్యక్తిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారన్నారు. ఎంపీలతో ప్రజలకు నేరుగా అనుబంధం ఉండదని, దీంతో సాధారణంగా లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ తక్కువే ఉంటుందన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. సికింద్రాబాద్లో అత్యల్పంగా.. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో అత్యంత తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ నియోజకవర్గంలో మధ్య, దిగువ మధ్య తరగతి జనాలు ఎక్కువగా ఉండే అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో 30.19%, ముషీరాబాద్ నియోజకవర్గంలో 36.70% ఓటింగ్ నమోదైంది. సంపన్నుల కేంద్రమైన ఖైరతాబాద్ నియోజకవర్గంలో 38% మంది ఓటేశారు. ఇక హైదరాబాద్ లోక్సభ పరిధిలో యాకుత్పురా నియోజకవర్గంలో 32%, మలక్పేట నియోజకవర్గంలో 33.60% ఓటింగ్ నమోదైంది. ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా నివసించే గోషామహల్లో 45.70% ఓట్లు పోల్కావడం విశేషం. 220 కోట్లు విలువైన జప్తులు! మే 23న ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రజత్కుమార్ తెలిపారు. పోలింగ్ ముగియడంతో తనిఖీలు ఉండవన్నారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా మొత్తం రూ.74.56 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశామన్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో రూ.76 కోట్లు విలువైన జప్తులు కలిపితే ఈ మొత్తం రూ.220 కోట్లకు పెరుగుతుందన్నారు. 2014లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని రజత్కుమార్ స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూంలకు ఈవీఎంలు! పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన కలెక్షన్ సెంటర్కు తరలిస్తారని రజత్కుమార్ వెల్లడించారు. అక్కడ ఉండే సహాయ రిటర్నింగ్ అధికారి ఫారం–17సీ, ఈవీఎం, వీవీప్యాట్స్ను పరిశీలించి చూస్తారన్నారు. మొత్తం ఓట్లు, పోలైన ఓట్లను సరిచూసుకుంటారన్నారు. తర్వాత ఎన్నికల పరిశీలకుడు దీన్ని ధ్రువీకరిస్తూ సంతకం చేస్తారన్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను సంబంధిత లోక్సభ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రెండంచెల భద్రత ఉంటుందన్నారు. కేంద్ర సాయుధ బలగాలతో తొలి అంచె, రాష్ట్ర పోలీసు బలగాలతో రెండో అంచె బందోబస్తు ఏర్పాట్లు చేస్తామన్నారు. అక్కడ సీసీటీవీల నిఘా ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను కాపలాగా పెడతామని కోరుకుంటే, వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ముగిసిన తర్వాత 45 రోజుల వరకు ఈ భద్రత ఏర్పాట్లు కొనసాగుతాయన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత, వాటిని సవాలు చేస్తూ 45 రోజుల్లోగా న్యాయ స్థానంలో పిటిషన్ వేయడానికి అవకాశముందని, అందుకే వీటికి భద్రత కల్పిస్తామన్నారు. గిన్నిస్బుక్లో ఇందూరు ఎన్నికలు! నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు పోటీ చేసినా, అక్కడ పోలింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఇందుకు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. 185 మంది అభ్యర్థులకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం ప్రపంచరికార్డు అని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు కల్పించాలని ఆ సంస్థకు లేఖ రాశామన్నారు. నిజామా బాద్ పోలింగ్ సందర్భంగా 261 బ్యాలెట్ యూని ట్లు, 55 కంట్రోల్ యూనిట్లు, 87 వీవీప్యాట్స్ను మార్చాల్సి వచ్చిందన్నారు. -
‘రాజకీయ’ సినిమాలు ప్రసారం చేయొద్దు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నమూనా ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీకి.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ, అభ్యర్థికి అనుకూలంగా ఉండి, పోటీలో ఉన్న ప్రత్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపగల రాజకీయ కథాంశంతో ఉన్న సినిమాలు, జీవిత చరిత్రలు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసా రం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లు సీఈవో రజత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సర్టిఫైడ్ అంశాలతో కూడుకున్నవి అయినప్పటికీ ఒక అభ్యర్థికి ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పోటీలో సానుకూలంగా, తోడ్పాటుగా ఉన్న ఏ పోస్టర్, మరే ఇతర ప్రచార సామాగ్రినికానీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రదర్శించకూడదని కూడా చెప్పారు. -
ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు ఉండాల్సిందే
సాక్షి, హైదరాబాద్: దేశభవిష్యత్తును నిర్ణయించే.. 2019 లోక్సభ ఎన్నికల తొలివిడతకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 17ఎంపీ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలు సహా 20 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 91 లోక్సభ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని 16 స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నిజామాబాద్లో రికార్డు స్థాయిలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో.. అక్కడ పోలింగ్కు ముందు మాక్ పోలింగ్ నిర్వహణకు గంట సమయం అదనంగా పట్టనుంది. దీంతో ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 5 లోక్సభ స్థానాల పరిధిలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రంలోని అన్ని లోక్సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. ఐదు స్థానాల్లో బీఎస్పీ, చెరో రెండేసి స్థానాల్లో సీపీఐ, సీపీఎం అభ్యర్థులు, ఒక స్థానం నుంచి మజ్లిస్ పోటీ చేస్తున్నాయి. మొత్తం 443 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. అందులో 25 మంది మహిళా అభ్యర్థులున్నారు. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ మంచి ఊపు మీదుంది. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఆ పార్టీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో హైదరాబాద్ మినహా 16 స్థానాలను గెలుచుకుంటామని కేసీఆర్ చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకతతో పాటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ‘న్యాయ్’పథకంపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ గాలి మళ్లీ వీస్తుందని.. ఆయన ఇమేజ్, విధానాలు ఎన్నికల్లో కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. కాగా, హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి తన గెలుపు ఖాయమేనని మజ్లిస్ అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ధీమాతో ఉన్నారు. 2.97 కోట్ల మంది ఓటర్లు 17 లోక్సభ స్థానాల పరిధిలో మొత్తం 2,96,97,279 ఓటర్లుండగా అందులో 1,49,19,751 మంది పురుషులు, 1,47,76,024 మంది మహిళలు, 1504 మంది ఇతరులు కలిపి మంది సాధారణ ఓటర్లు ఉన్నారు. 11,320 మంది సర్వీసు ఓటర్లు కలిపి మొత్తం 2,97,08,599 మంది లోక్సభ ఎన్నికల్లో ఓటేయనున్నారు. ఓటర్లందరికీ ఫోటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేశామని సీఈఓ వెల్లడించారు. 48 లక్షల మంది కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేశామన్నారు. 77,365 బ్యాలెట్ యూనిట్లు, 41,051 కంట్రోల్ యూనిట్లు, 43,894 వీవీప్యాట్లను ఎన్నికల్లో వినియోగించబోతున్నారు. ఎన్నికలకు సర్వం సిద్ధం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ ప్రకటించారు. ఎన్నికల సామగ్రితో ఎన్నికల సిబ్బంది బుధవారం రాత్రి నాటికి రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వెల్లడించారు. గురువారం ఉదయం 5.30గంటలకు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు మాక్పోలింగ్ నిర్వహిస్తారని, ఎన్నికల ఏజెంట్లు తప్పనిసరిగా ఈ ప్రక్రియకు పాల్గొనాలన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల విధుల్లో 2.2లక్షల మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. 145 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలతో పాటు 55వేల రాష్ట్ర పోలీసు సిబ్బంది, హోంగార్డులు ఎన్నికల బందోబస్తు నిర్వహిస్తారన్నారు. ఎన్నికల సిబ్బంది, భద్రత దళాలు కలుపుకుని మొత్తం 3లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాలుపంచుకోనున్నారన్నారు. మావోయిస్టుల మందుపాతరకు.. ఛత్తీస్గఢ్లో ఓ బీజేపీ ఎమ్మెల్యేతో పాటు ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావంపై పోలీసుశాఖతో సమీక్ష నిర్వహించామన్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం పెద్దగా లేదని, ఆందోళనపడాల్సిన అవసరం లేదని పోలీసు శాఖ స్పష్టం చేసిందన్నారు. ఇందూరుపైనే అందరి దృష్టి! నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి అక్కడే ఉంది. అక్కడ ఎం–3 మోడల్ అధునాతన ఈవీఎంలను వినియోగిస్తున్నారు. 185 అభ్యర్థులు, ఒక నోటా ఆప్షన్కు బ్యాలెట్లో చోటు కల్పించడానికి ఒక్కో కంట్రోల్ యూనిట్కు 12 బ్యాలెట్ యూనిట్లతో పాటు వీవీ ప్యాట్ యంత్రాలను అనుసంధానం చేసి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. దేశ చరిత్రలో నాలుగుకు మించి బ్యాలెట్ల యూనిట్లను వాడడం ఇదే తొలిసారి. ఇంత పెద్ద సంఖ్యలో ఈవీఎం యంత్రాలను సిద్ధం చేయడానికి 600 మంది ఇంజనీర్లు, అధికారులు 6 రోజులుగా రాత్రింబవళ్లు శ్రమించారని రజత్ కుమార్ తెలిపారు. ఇక్కడ ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తాయా? లేదా? అన్నదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్లీజ్ వచ్చి ఓటేయండి! ఓటు ప్రజాస్వామ్య హక్కు అని, ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని రజత్కుమార్ పేర్కొన్నారు. ప్రతి పౌరుడు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, ఆత్మప్రబోధం మేరకు ఓటు హక్కును వినియోగించాలని పిలుపునిచ్చారు. కేవలం ఓటరు స్లిప్పుతో ఓటేయలేరు .. కేవలం ఓటరు స్లిప్పుతో వచ్చి ఓటర్లు ఓటేయలేరని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటేనే ఓటేసేందుకు అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పు కేవలం ఆహ్వానపత్రం మాత్రమేనని, అదే ఓటరు గుర్తింపుకార్డు కాదన్నారు. ఓటరు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా తెలపడమే ఓటరు స్లిప్పుల ఉద్దేశమన్నారు. ప్రతి ఓటరు తమ ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) లేదా కింద పేర్కొన్న 12 రకాల గుర్తింపు కార్డులను ఎన్నికల కేంద్రానికి తీసుకొచ్చి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన.. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఓటువేయలేరన్నారు. ప్రతి ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలన్నారు. వీటిలో ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలి ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి ఫోటో గుర్తింపు కార్డు బ్యాంకులు/తపాల కార్యాలయం జారీ చేసిన ఫోటో పాస్బుక్ , ఆర్జీఐ/ఎన్పీఆర్ జారీ చేసిన స్మార్ట్కార్డు ఉపాధి హామీ జాబ్ కార్డు , కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్స్రూ?న్స్ స్మార్ట్ కార్డు ఫోటో కలిగిన పింఛను డాక్యుమెంట్ , ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫోటో ఓటరు స్లిప్ ఎంపీలు/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు మీ పోలింగ్ కేంద్రం తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? ఈ కింది పేర్కొన్న ఏదైన ఓ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. 9223166166 నంబర్కు 'TS VOTE VOTER ID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే మీ మొబైల్ ఫోన్కు పోలింగ్ కేంద్రం చిరునామా రానుంది. (ఉదాహరణకు 'TS VOTE AB-C1234567'). – 1950 నంబర్కు 'ECI VOTERID NO' నమూనాలో ఎస్సెమ్మెస్ పంపితే పోలింగ్ కేంద్రం తెలుసుకోవచ్చు. (ECI ABC1234567) – స్మార్ట్ ఫోన్లో నా ఓట్ (Naa Vote) యాప్ను డౌన్లోడ్ చేసుని లొకేషన్ చెక్ చేసుకోవచ్చు. – 1950 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసిన తెలుసుకోవచ్చు. -
ఎగ్జిట్ పోల్స్పై నిషేధం
హైదరాబాద్: ఏప్రిల్ 11న జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్తో పాటూ , ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడం, వ్యాప్తి చేయడంపై చట్ట ప్రకారం ఆంక్షలున్నాయని, వాటిని నిక్కచ్చిగా పాటించాలని తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కి సంబంధించిన సెక్షన్ 126ఏ లోని సబ్ సెక్షన్(1),(2)ల కింద సంక్రమించిన అధికారాలను వినియోగించి ఎన్నికల కమిషన్(ఈసీ) ఏప్రిల్ 11న ఉదయం 7 నుంచి, మే 19న సాయంత్రం 6.30 గంటల వరకు ఈ ఆంక్షల్ని విధించిందని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ లేదా సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ ముగింపునకు నిర్ణయించిన సమయానికి ముందున్న 48 గంటల వ్యవధిలో, ఎటువంటి ఓపీనియన్ పోల్స్ ఫలితాలు లేదా మరే ఇతర పోల్ సర్వేలు, తదితర ఎన్నికల సమాచారం ప్రకటన, ప్రచురణ కూడా నిషిద్ధమని వివరించారు. -
నిజామాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు: సీఈఓ
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిజామాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సచివాలయంలో రజత్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాలో 11వ తేదీ జరగబోయే పోలింగ్లో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. ఇందులో సర్వీస్ ఓటర్లు 11 వేల 320, ఎన్నారై ఓటర్లు 11 వేల 731 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణాలో 34 వేల 604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్ కేంద్రాలకు సామగ్రి పంపిస్తామని అన్నారు. 48 గంటల ముందు ప్రచారం బంద్ ‘పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం బంద్ చెయ్యాలి. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మావోయిస్టు ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటలకు వరకు మాత్రమే ఓటు వేయడానికి వీలుంది. నిజామాబాద్లో మాత్రం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్లో పాల్గొనవచ్చు. 4169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పోలింగ్ కేంద్రాలలో వీడియో రికార్డ్ చేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాం. ఈ ఎన్నికల్లో కూడా విజయవంతంగా నిర్వహిస్తాం. ఫోటో ఓటర్ స్లిప్ పంపిణీలో కొంత ఇబ్బంది ఉంది. గత ఎన్నికల్లో సమస్య ఉంది కానీ ఈసారి అలాంటి సమస్య లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏవైనా ఐడీ కార్డులు చూపించి ఓటు వేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం ఓటర్ స్లిప్లు పంపిణీ చేశా’ మని రజత్ కుమార్ వెల్లడించారు. సోషల్ మీడియా వార్తలపై నిఘా ‘ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. 579 వార్తలు పెయిడ్ న్యూస్ కింద కేసులు బుక్ చేశాం. తెలంగాణాలో రూ.52 కోట్ల 62 లక్షల నగదు సీజ్ చేశాం. సీ-విజిల్ యాప్కు మంచి స్పందన వస్తోంది. 1435 కేసులు సి-విజిల్ ద్వారా బుక్ అయ్యాయి. అన్ని కేసులు తక్షణమే పరిష్కరిస్తున్నాం. కుల మతాల పేరు మీద ప్రచారం చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి. రేపు 5 గంటల నుంచి న్యూస్ ఛానల్లో ఎన్నికల ప్రచారం ప్రసారం చేయకూడదు. మద్యం కూడా బంద్ చెయ్యాలి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి స్థానికేతరులు ఉండకూడదు. నిజామాబాద్ పార్లమెంటు నియోజవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేశాక సెల్ఫీలు తీసుకుంటే చర్యలు ఉంటాయ’ని స్పష్టంగా పేర్కొన్నారు. అన్ని సంస్థలకు పోలింగ్ రోజు సెలవు ‘ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయి.గత ఎన్నికల్లో ఈవీఎంలలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈసారి బెల్ కంపెనీకి చెందిన లేటెస్ట్ యంత్రాలు వాడుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి వచ్చాను. చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు చేశాం. బ్యాలెట్ పేపర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్యాలెట్తో కౌంటింగ్ జరిపేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. రైతులతో అన్ని అంశాలపై చర్చించాం. వాళ్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు. లోకల్ బాడీ ఎన్నికలకు అనుమతి ఇచ్చారు. ఫలితాలు మాత్రం లోక్సభ ఎన్నికల తర్వాతే విడుదల చెయ్యాల’ని రజత్ కుమార్ చెప్పారు. ముగిసిన ప్రచారం తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఒక్క నిజామాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకే ఈసీ పర్మిషన్ ఇచ్చింది. నిజామాబాద్ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థులు 6 గంటల దాకా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంది. -
‘పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ తీసుకోకూడదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ సీఈఓ రజత్కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సెల్పీ తీసుకోకూడదన్నారు. అలా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపిస్తున్నాం. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 4,169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. 90 శాతం ఓటరు స్లిప్లు పంపిణీ చేశాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. పెయిడ్ న్యూస్ కింద 579 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో 52 కోట్ల 62 లక్షల రూపాయలు సీజ్ చేశాం. సీ విజిల్ యాప్కు మంచి స్పందన వస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలి లేదంటే తీసుకుంటామ’ని రజత్ కుమార్ తెలిపారు. -
11నే ‘ఇందూరు’ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 11న నిజామాబాద్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ స్పష్టం చేశారు. పసుపు, మొక్కజొన్న రైతులు మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో నిజామాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య 185కు పెరిగిపోయిన విషయం తెలిసిందే. తమకు ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవడానికి సరిపడా సమయం లభించలేదని, నిజామాబాద్ ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల బరిలో నిలిచిన రైతులు గత శుక్రవారం రజత్కుమార్కు విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన తన కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, రాజకీయాల పట్ల అవగాహన లేకపోవడం వల్లే గుర్తుల కేటాయింపుపై కొందరు అభ్యర్థులు ఆందోళన చెందారని తెలిపారు. తన నిజామాబాద్ పర్యటనలో భాగంగా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేశానని, వారూ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో పోలింగ్ సమయం సరిపోదనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థులు ఎంత మంది ఉన్నా పోలింగ్ నిర్వహించడానికి ఈవీఎంలకు అంతే సమయం పడుతుందని చెప్పారు. అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ సైతం నిర్వహించామని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంలను పరీక్షించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థుల సంఖ్య 50కి మించితే, గరిష్టంగా 50 ఓట్లు మాత్రమే వేసి మాక్ పోలింగ్ నిర్వహించాలని నిబంధనలు పేర్కొంటున్నాయని ఆయన తెలిపారు. ఇక నిజామాబాద్లో 185 అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో మాక్ పోలింగ్ కోసం ఒక గంట సమయం పట్టనుందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు ఈవీఎంలు సిద్ధం.. నిజామాబాద్ మినహా రాష్ట్రంలోని మిగిలిన 16 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని రజత్కుమార్ తెలిపారు. నిజామాబాద్ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎం యంత్రాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు. 2,209 కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లకు ప్రథమ స్థాయి తనిఖీలు పూర్తి చేశామని చెప్పారు. ఒక యంత్రానికి ఈ తనిఖీలు నిర్వహించడానికి మూడు గంటల సమయం పడుతుందని, 2,209 యం త్రాలకు తనిఖీల కోసం అధిక సమయం, సిబ్బంది అవసరమని తెలిపారు. తనిఖీల తర్వాత ఈవీఎంలలో కేండిడేట్ల సెట్టింగ్ ప్రక్రియకు మరో మూడున్నర గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. అన్ని యంత్రాలకు ఈ పక్రియలు పూర్తి చేశామని, వాటిని పంపిణీ కేంద్రాలకు రవాణా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. 9తో ప్రచారానికి తెర.. పోలింగ్ ముగింపునకు 48 గంటల ముందు అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను విరమించాల్సి ఉంటుందని రజత్కుమార్ తెలిపారు. ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచార కార్యక్రమాలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో సైతం ప్రచారం ఆపేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ వేదికగా టీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ చేసిన ఫిర్యాదును ఈసీ పరిశీలనకు పంపామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కొత్త ఓటర్లకు 95 శాతం ఫొటో గుర్తింపు కార్డులు జారీ చేశామన్నారు. హైదరాబాద్లో కొంత తక్కువ పంపిణీ జరిగిందన్నారు. సోమవారం నాటికి 100 శాతం ఫొటో గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. -
ఈసీఐదే తుది నిర్ణయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలింగ్ వాయిదాపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్ లోక్సభ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చిన రజత్కుమార్.. బరిలో ఉన్న రైతు అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలింగ్ను వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు కోరుతున్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘాని (ఈసీఐ)కి నివేదిస్తామని చెప్పారు. దీనిపై తుది నిర్ణయం వారిదేనని స్పష్టం చేశారు. గుర్తుల కేటాయింపు సక్రమంగా జరగలేదనీ, మొదటిసారి బరిలో ఉన్నామనీ, ఈ గుర్తులపై సరిగ్గా అవగాహన లేదని, గుర్తులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయనీ, పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయామని రైతు అభ్యర్థులు తమ దృష్టికి తెచ్చారన్నారు. ముందుగా బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరుపుతామని ప్రకటించారని, ఇప్పుడు మళ్లీ ఈవీఎంలతో నిర్వహిస్తున్నారనే అంశాలన్నీ కూడా చర్చకొచ్చాయని పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించేందుకు సమయం లేనందున వారం, పది రోజులు పోలింగ్ను వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అలాగే ఈవీఎంలను ముందుగా ఎల్ ఆకారంలో పెడతామని, మళ్లీ ఇప్పుడు డిజైన్ను మార్చారనే అంశంపై రైతు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. ఈ విషయాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పోలింగ్ వాయిదా వేయడంపై ఈసీఐ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 11న పోలింగ్ నిర్వహించాలని ప్రకటించిన మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్కుమార్ తెలిపారు. ప్రపంచంలోనే తొలి ఎన్నిక ఇది 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఈవీఎంలతో నిర్వహించడం దేశంలోనే కాకుండా, ప్రపంచంలో కూడా ఇది తొలి ఎన్నిక అవుతుందని రజత్కుమార్ పేర్కొన్నారు. దీన్ని ఓ సవాల్గా తీసుకున్నామని చెప్పారు. 27 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని వివరించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఈనెల 7లోపు అన్ని ఈవీఎంలను పంపిణీ కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. మాక్ పోలింగ్ నిర్వహించాం మాక్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించామని, వంద మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా ఓటు వేసి చూశారని, ఓటింగ్ సమయాన్ని కూడా పరిశీలించారని, మాక్ పోలింగ్పై అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. విలేకరుల సమావేశంలో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు, ఎన్నికల సంఘం అదనపు ఈసీఓ బుద్ధ్దప్రకాశ్, సంయుక్త సీఈఓ రవి కిరణ్, అదనపు డీజీపీ జితేందర్, ఎన్నికల పరిశీలకులు గౌరవ్ దాలియా, ఎన్నికల ప్రత్యేక అధికారి రాహుల్బొజ్జా తదితరులు పాల్గొన్నారు. -
నిజామాబాద్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి : ఈసీ
సాక్షి, నిజామాబాద్ : తొలివిడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 11న నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి కూడా ఎన్నిక నిర్వహిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 185 మంది అభ్యర్థులు పోటీకి దిగారని తెలిపారు. ఇంతమందికి ఈవీఎంలో ఎన్నికలు నిర్వహించడం చాలెంజింగ్ టాస్క్ అని పేర్కొన్నారు. అయినా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. ఈవీఎంల పరిశీలనలో 600 మంది ఇంజినీర్ల సహాయం తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన పూర్తి చేశామని.. 100 మంది అభ్యర్థుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించామన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని తెలిపారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తానని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ 4 వేల ఈవీఎంల పరిశీలన పూర్తయ్యిందని.. ఈనెల 7లోగా చెకింగ్ ప్రక్రియ పూర్తి చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి ఈవీఎంలను పంపుతామన్నారు. -
ఇందూరు ఎన్నికపై 2 ఆప్షన్లు!
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ బరిలో 185 మంది అభ్యర్థులున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికనిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం మల్లగుల్లాలు పడుతోంది. మొదట బ్యాలెట్ పేపర్పైనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్ కుమార్.. ఈవీఎంలను వినియోగించే ఐచ్ఛికాన్నీ పరిశీలిస్తున్నామన్నారు. తమ వద్ద రెండు ఆప్షన్లు ఉన్నాయని శుక్రవారం ఆయన వెల్లడించారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే అదనంగా కావాల్సిన కొత్త మోడల్ ఈవీఎంల సంఖ్యపై చర్చించామన్నారు. బీహెచ్ఈఎల్ రూపొందించిన ఎం–3 రకం ఈవీఎంలతో మాత్ర మే.. ఈ పరిస్థితుల్లో నిజామాబాద్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందని తెలిపారు. నిజామాబాద్ స్థానానికి 185 మంది పోటీ పడుతుండడంతో తొలుత బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని భావించామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించేందుకున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. కొత్తరకం ఈవీఎంలు ఎన్ని కావాలో తెలియజేయాలని ఈసీఐ కోరిందన్నారు. ఈవీఎంలు బయట నుంచి రావాల్సి ఉంటుందని, అవి వచ్చిన తర్వాత ప్రాథమిక పరీక్ష, ర్యాండమ్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ బ్యాలెట్ పేపర్తోనే నిర్వహించాలనుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బ్యాలెట్ పేపర్ అయితే పేరు, ఎన్నికల గుర్తు, పార్టీ పేరుకు చోటు కల్పించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. అదే విధంగా అవసరమైనన్ని బ్యాలెట్ బాక్సులు సమీకరించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త ఈవీఎంల అవసరాలపై నిజామాబాద్ కలెక్టర్ నుంచి నివేదిక అందిందని, అన్ని అంశాలను క్రోఢీకరించి ఈసీఐకి త్వరలో నివేదిక పంపిస్తామన్నారు. ఆ తర్వాతే ఈవీఎంలా? బ్యాలెటా? అనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. -
నిజామాబాద్ ఎన్నిక వాయిదా?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ లోక్సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల షెడ్యూల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ వెల్లడించారు. షెడ్యూల్ మేరకు నిజామాబాద్లో ఎన్నికల నిర్వహణకు ఉన్న సాధ్యాసాధ్యాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ స్థానానికి ఎన్నికలను షెడ్యూల్ మేరకే నిర్వహించాలా? లేదా ప్రత్యేకంగా ఆ ఒక్క స్థానానికి సంబంధించిన షెడ్యూల్ను పొడిగించాలా? అన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానిదే తుది నిర్ణయమన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. 185మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ, అవసరమైన బ్యాలెట్ బాక్సుల సమీకరణపై దృష్టిసారించామన్నారు. 185మంది అభ్యర్థుల పేర్లతో ఒకే బ్యాలెట్ పత్రాన్ని ముద్రించాలా? లేక నాలుగైదు బ్యాలెట్ పత్రాల్లో 185 మంది పేర్లను ముద్రించాలా? అన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సలహాలు తీసుకుంటామన్నారు. అధిక పరిమాణంలో బ్యాలెట్ పత్రాలు ఉండనుండడంతో వాటికి తగిన పరిమాణంలో బ్యాలెట్ బాక్కులను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. అ అంశాలపై సమీక్ష జరుపుతున్నామని, రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. 185 మంది అభ్యర్థులకు సరిపడే సంఖ్యలో ఎన్నికల గుర్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. కేసీఆర్పై ఫిర్యాదును పరిశీలిస్తున్నాం మంచిర్యాల జిల్లాకు చెందిన శరత్ అనే రైతుకు సంబంధించిన భూవివాదాన్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆ రైతుతో ఫ్లోన్లో మాట్లాడి.. కలెక్టర్ను రంగంలోకి దించి రైతుబంధు చెక్ ఇవ్వడంతోపాటు సమస్యను పరిష్కరించడంపై ఫిర్యాదులు అందాయని రజత్కుమార్ తెలిపారు. ఆ టెలిఫోన్ సంభాషణను విడుదల చేయడం కూడా రాజకీయ ప్రచారమేనని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ప్రచారం కోసం అధికార యంత్రాంగాన్ని రాజకీయ నేతలు వినియోగించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా పరిపాలనను పర్యవేక్షించవచ్చని, రాజకీయ అవసరాల కోసం అధికారాన్ని వినియోగించకూడదన్నారు. సీఎంతో పాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్పై అందిన ఫిర్యాదులను పరిశీలన కోసం ఎన్నికల ప్రవర్తన నియమావళి కమిటీకి పంపించామన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి సైతం తీసుకువెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఒక వేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తేలితే ఉల్లంఘించిన వారితో పాటు అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ షురూ
సాక్షి, హైదరాబాద్: ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం పొందిన కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో గుర్తింపు (ఎపిక్) కార్డులతో పాటు ఫొటో ఓటరు స్లిప్పులు, ఓటరు గైడుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికి తిరిగి వీటిని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. గురువారం నాటికి రాష్ట్రంలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పుల పంపిణీ ఉధృతం కానుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్కుమార్ తెలిపారు. ఇంతకు ముందే ఓటరుగా నమోదు చేసుకుని ఎపిక్ కార్డులు తీసుకోనివారు సమీపంలోని మీ–సేవ కేంద్రం వద్ద తగిన రుసుం చెల్లించి పొందవచ్చని తెలిపారు. ఓటు వేయడానికి ముందు పోలింగ్ కేంద్రంలో ఓటరు గుర్తింపు నిర్ధారణకు కేవలం ఓటరు స్లిప్పులు చూపితే సరిపోదని, ఓటరు గుర్తింపు కార్డు లేదా ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపాలని తెలిపారు. ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులు 1.పాస్పోర్టు 2. డ్రైవింగ్ లైసెన్స్ 3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వ రంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగుల గుర్తింపు కార్డులు 4. బ్యాంకులు, పోస్టాఫీస్లు ఫొటోతో జారీ చేసిన పాస్ పుస్తకాలు 5. పాన్కార్డు 6. ఎన్పీఆర్ కింద రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్కార్డు 7.ఉపాధి హామీ జాబ్ కార్డు 8. ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన స్మార్ట్కార్డు 9. ఫొటో జత చేసి ఉన్న పింఛన్ పత్రాలు 10. ఎంపీ/ఎమ్మెల్యే/ఎంఎల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం 11. ఆధార్ కార్డు -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవగా శుక్రవారం నాటికి 220 నామినేషన్లు దాఖలయ్యాయి. శని, ఆదివారం వరుస సెలవుల తర్వాత సోమవారం చివరిరోజు నామినేషన్ల స్వీకరణ జరగ్గా ఏకంగా 570 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 795కు పెరిగింది. చివరిరోజు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 182 నామినేషన్లు రావడంతో ఈ స్థానానికి మొత్తం నామినేషన్ల సంఖ్య 245కు పెరిగింది. మంగళవారం నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అభ్యర్థులు సరైన ఫారం–ఏ, బీలతోపాటు ఫారం–26లోని అన్ని ఖాళీలను పూరిస్తేనే నామినేషన్లను ఆమోదిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థితోపాటు మరో ముగ్గురు వ్యక్తులనే అనుమతిస్తామన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థి తనతోపాటు తనను ప్రతిపాదించిన వ్యక్తి, ఎన్నికల ఏజెంట్, మరోవ్యక్తిని వెంట తెచ్చుకోవచ్చన్నారు. అన్ని రకాల పత్రాలతో అభ్యర్థులు పరిశీలన కార్యక్రమానికి హాజరు కావాలన్నారు. ఈ నెల 28తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఫలితాలను మే 23న ప్రకటించనున్నారు. నిజామాబాద్లో పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిజామాబాద్ లోక్సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలు కావడంతో అక్కడ ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఒక బ్యాలెట్ యూనిట్లో 16 మంది అభ్యర్థులకు అవకా శం కల్పించవచ్చని, పాత మోడల్ ఈవీఎంలకు గరిష్టంగా 6 బ్యాలెట్ యూనిట్లనే అనుసంధానించేందుకు అవకాశముందన్నారు. దీంతో అభ్యర్థుల సంఖ్య 95కు మించితే పాత రకం ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించలేమన్నారు. కొత్త రకం ఈవీఎంలకు 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానించే వీలుం దని, దీంతో 383 మంది అభ్యర్థులు పోటీ చేసినా ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడానికి అవకాశముంటుందన్నారు. అయితే ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో వినియోగించిన కొత్త మోడల్ ఈవీఎంలను లోక్సభ ఎన్నికల్లో వాడలేకపోతున్నామన్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో పేపర్ బ్యాలెట్తో ఎన్ని కలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు వద్దు... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రగతి భవన్లో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని అధికార టీఆర్ఎస్కు లేఖ రాసినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని, ప్రభుత్వ భవనాలకు వర్తించే ఎన్నికల నిబంధనలను అమలు చేయాలని ఎన్నికల సంఘం కోరిందన్నారు. నిజామాబాద్ స్థానానికి నామినేషన్లు వేయడానికి వచ్చిన రైతులను రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి బయటకు పంపించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అక్కడ ఓ వీఐపీ (సిట్టింగ్ ఎంపీ కవిత) నామినేషన్ వేయడానికి రావడంతో ఈ ఘటన జరిగిందని రజత్ కుమార్ తెలిపారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద రైతులు గూమికూడి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారని, అప్పుడే అక్కడికి వీఐపీ నామినేషన్ వేసేందుకు రావడంతో ఆమెకు మొదట అవకాశం కల్పించారని, రైతులను పక్కకు పంపించారని తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇందులో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఏమీ లేదన్నారు. నిజామాబాద్ సభలో ముఖ్యమంత్రి ‘హిందువు’పదాన్ని వినియోగించారని వచ్చిన ఫిర్యాదును పరిశీలించామని, అందులో సైతం ఎలాంటి ఉల్లంఘన ఉన్నట్లు తేలలేదన్నారు. తెలంగాణ ఏమైనా పాకిస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందా రాదా అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమకు విదేశాల్లో ఉన్న ఆస్తులను సైతం ప్రకటించాల్సిందేనని, లేకుంటే తీవ్రమైన తప్పిదం చేసినట్లు అవుతుందన్నారు. -
నేడు మండలి ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు నేడు ఎన్నికలు జరగనున్నాయి. మెదక్–నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రులు/ ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్– కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఏడుగురు, వరంగల్– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ తొలి ప్రాధాన్య త ఓటును వినియోగించుకుంటేనే ఓటు చెల్లుబాటు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. తొలి ప్రాధాన్యత ఓటు వినియోగించుకోకుండా, మిగిలిన ప్రాధాన్యత ఓట్లు వేస్తే ఓటు చెల్లుబాటు కాదని పేర్కొన్నాయి. ఈ నెల 26న ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. నేడు మండలి ఓటర్లకు సెలవు మండలి ఎన్నికల్లో శుక్రవారం ఓటేయనున్న ఓటర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సెలవు ప్రకటించింది. మండలి ఓటు హక్కు కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటు హక్కు కలిగిన ప్రైవేటు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు సీఈవో రజత్ కుమార్ సూచించారు. ఓటు వేయడానికి వీలు కల్పించేలా పనివేళలు సడలించి సర్దుబాటు చేయాలని కోరారు. కాగా, మండలి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఫొటో ఓటరు గుర్తింపు కార్డులను పోలింగ్ అధికారులకు చూపించాలని ఓటర్లకు ఆయన సూచించారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే ప్రత్యామ్నాయంగా ఈ కింది 9 రకాల గుర్తింపు ధ్రువీకరణ పత్రాలు/కార్డుల్లో ఏదైనా ఒక దాన్ని చూపించి ఓటు వేయొచ్చని తెలిపారు. ఓటర్కార్డుకు ప్రత్యామ్నాయాలు.. పాస్పోర్టు; డ్రైవింగ్ లైసెన్స్; పాన్కార్డు; ఉపాధ్యాయులు/పట్టభద్రులు పనిచేసే విద్యా సంస్థల వారు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; యూనివర్సిటీ జారీ చేసిన డిగ్రీ/డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికెట్; అధీకృత అధికారి జారీ చేసిన అంగవైకల్య ధ్రువీకరణ పత్రం; కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రైవేటు పారిశ్రామిక సంస్థలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు కార్డులు; ఆధార్ కార్డు; ఎంపీలు/ ఎమ్మెల్యేలు/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు. -
ఆలోచించి పోస్ట్ చేయండి..
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన 53 పోస్టులపై సుమోటోగా చర్యలు ప్రారంభించామని, వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచార కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ప్రైవేటు కంపెనీ సేవలను ఎన్నికల సంఘం వినియోగించుకుంటోందని చెప్పారు. లోక్సభ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే సమాచారాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించి ముందస్తు అనుమతి పొందాలని పార్టీలకు సూచించారు. నామినేషన్ల దాఖలులో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుతో పాటు ఈవీఎంలు, వీవీ ప్యాట్, ఓటర్ల జాబితా తదితర అంశాల పట్ల ప్రతినిధులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. నామినేషన్ల పత్రాల సమర్పణలో జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే తిరస్కరణకు గురవుతాయన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు లౌడ్ స్పీకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార వాహనాలను వినియోగించరాదన్నారు. ప్లాస్టిక్, పాలిథీన్ సామగ్రిని వాడొద్దని విజ్ఞప్తి చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ నియామకాల కోసం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను సడలిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చినా, లోక్సభ ఎన్నికలు రావడంతో మళ్లీ అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో సక్రమంగా నిర్వహించడంలో పార్టీలన్నీ సహకరించాలని కోరారు. ‘హిందువు’పదంపై ఫిర్యాదు ఎన్నికల ప్రచారంలో ‘హిందువు’అనే పదాన్ని ఓ రాజకీయ నేత ప్రయోగించడంపై ఫిర్యాదు అందిందని రజత్కుమార్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ మంగళవారం జరిపిన ఎన్నికల ప్రచార ప్రసంగంలో.. బీజేపీ హిందూ మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించిన విషయం తెలిసిందే. ఏపీకి చెందిన సీనియర్ నేతను ఉద్దేశించి ఓ పత్రికలో తీవ్రమైన పదజాలంతో వార్త రావడంపై ఓ రాజకీయ పార్టీ నేత ఈ సమావేశంలో తమ దృష్టికి తెచ్చారని, ఈ వార్తను ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించి చర్యలు చేపట్టామని రజత్కుమార్ తెలిపారు. ప్రార్థనా స్థలాల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కుల, మతాల పేరుతో ఓట్లను అభ్యర్థించి గెలిచారని ఎవరైనా హైకోర్టులో ఎన్నికల పిటిషన్ వేస్తే అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు. సీ–విజిల్ యాప్లో ఫిర్యాదుదారులు అప్లోడ్ చేసే వీడియోలను ఎన్నికల పిటిషన్ల విచారణకు వినియోగిస్తామన్నారు. మెట్రో రైలు కొత్త మార్గాన్ని గవర్నర్ ప్రారంభించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి రాదన్నారు. అందులో నిజం లేదు.. ఎన్నికల సందర్భంగా పట్టుబడిన నగదులో 90 శాతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూ.127 కోట్లు పట్టు బడితే అందులో రూ.29.07 కోట్లను మాత్ర మే సరైన లెక్కలు చూపిన వారికి ఇచ్చామన్నారు. సీ–విజిల్ యాప్నకు ఇప్పటి వరకు 325 ఫిర్యాదులు అందాయని, అందులో మూడే పెండింగ్లో ఉన్నాయన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక నిర్వహించిన తనిఖీల్లో రూ.11.02 కోట్ల డబ్బు సీజ్ చేశామ న్నారు. లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం 145 కేంద్ర బలగాలను రాష్ట్రానికి కేంద్రం కేటాయించిందన్నారు. హ్యాకింగ్కు గురికాకుండా ఈవీఎంలు ఎలా స్వీయ రక్షణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్న అంశంపై రాజకీయ నేతలకు అదనపు సీఈవో బుద్ధప్రకాశ్ జ్యోతి వివరించారు. ఓటర్లకు, దివ్యాంగులకు రవాణా సౌకర్యం వివరాలను తెలిపే ‘నా ఓటు’అనే యాప్, ఓటు వివరాలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకునేందుకు 9223166166 నంబర్ సేవలు అందిస్తున్నట్లు జాయింట్ సీఈవో అమ్రపాలి తెలిపారు. మద్యం తయారీ కేంద్రా లు, విక్రయ కేంద్రాలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాట్లతో పటిష్టంగా నిఘా ఉంచామని, 340 సంచార బృందాలతో నిఘా కట్టుదట్టం చేసినట్లు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. -
హిందువులను అవమానించారంటూ.. కేసీఆర్పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం కేసీఆర్పై తెలంగాణ ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్(వీహెచ్పీ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ను కోరింది. ఆ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. (16మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గి రాజేస్త) అంతేకాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డును కూడా కించపరిచారని, జాతీయ సమగ్రతకు భంగం కలిగేలే మాట్లాడిన కేసీఆర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ బృందం రజత్ కుమార్కు విజ్ఞప్తి చేసింది. లిఖితపూర్వ ఫిర్యాదుతో పాటు, కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా సమర్పించింది. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు వీహెచ్పీ ఇచ్చిన ఫిర్యాదుపై రజత్ కుమార్ స్పందించారు. కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్పీ బృందానికి హామీ ఇచ్చారు. రజత్ కుమార్ను కలిసిన బృందంలో వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, ముఖేష్ సీనియర్ న్యాయవాది కరుణాసాగర్, గిరిధర్, వీహెచ్పీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హిందువులను అవమానించారంటూ.. కేసీఆర్పై ఫిర్యాదు
-
అలా చేయకుంటే నామినేషన్ తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ప్రతీ కాలమ్ ఫీల్ చెయ్యాలని, లేదంటే నామినేషన్ తిరస్కరణ అవుతుందని రాష్ట్రం ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. ఫామ్ 26( విదేశీ ఆస్తులపై) కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ రోజు నుంచి ( మర్చి 18) అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రాల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. కోడ్ ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. పార్టీ ప్రచార సభల్లో ప్లెక్సీలు, బ్యానర్లు పెట్టరాదని, ఒకవేళ బ్యానర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. స్కూల్ విద్యార్థులను ప్రచారానికి వాడుకోవద్దన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని, ఆ రోజుల్లో ( 21న హోలీ, 23న నాల్గొ శనివారం, 24 ఆదివారం) నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు. -
ఒక్క రోజే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటరుగా ఇంకా పేరు నమోదు చేసుకోలేదా? ఓటర్ల జాబితాలో పేరు గల్లంతైందా? కొత్త ప్రాంతానికి నివాసం మారారా? ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నారా? అయి తే ఓటరుగా నమోదు కావడానికి వెంటనే దరఖాస్తు చేసుకోండి. లోక్సభ ఎన్నికల దృష్ట్యా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం కింద దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని పోలింగ్ బూత్ల వద్ద బూత్ స్థాయి అధికారులు(బీఎల్ఓ) ఓటరు నమోదు దరఖాస్తుల(ఫారం–6)తో ప్రజలకు అందుబా టులో ఉంటారని వెల్లడించారు. ఓటరు నమోదు కోసం ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల పై గురువారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా దరఖాస్తులొచ్చాయని తెలిపారు. చివరి రోజు శుక్రవారం వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి కొత్త ఓటర్లతో ఈ నెల 25న అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వెల్లడించారు. బెల్టు షాపులు మూత రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేస్తున్నామని సీఈఓ రజత్కుమార్ తెలిపారు. ‘‘అక్రమ మద్యం విక్రయించే బెల్టు షాపులను సంపూర్ణంగా మూసివేయాలని ఆదేశించాం. మద్యం దుకాణాలు కచ్చితమైన సమయ పాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏ పార్టీ అభ్యర్థి అయినా కులం, మతం పేరుతో ఓట్లను అభ్యర్థిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎన్నికల కోడ్ అమలుకు 432 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 188 వీడియో బృందాలు, గ్రామీణ ప్రాంతాల్లో 430 నిఘా బృందాలు, 95 ఎన్నికల వ్యయ పరిశీలన బృందాలు ఏర్పాటు చేశాం’’అని వివరించారు. 2014 ఎన్నికల సందర్భంగా తెలంగాణ పరిధిలో 1,649 కేసులు నమోదయ్యాయని, వాటి దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు శాఖను ఆదేశించామని వెల్లడించారు. ఇప్పటి వరకు 71 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయన్నారు. ఎన్నికల కేసులను ఎత్తివేయడం జరగదని స్పష్టంచేశారు. 2018లో 1,932 ఎన్నికల కేసులు నమోదయ్యాయని వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో టీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తి వద్ద రూ.17 కోట్ల అక్రమ నగదు పట్టుబడిందని, అయితే అధికార పార్టీతో కుమ్మక్కైన అధికారులు పట్టుబడిన నగదును తక్కువ చేసి చూపించారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను రజత్కుమార్ తోసిపుచ్చారు. ఆదాయ పన్ను అధికారులతో పాటు పంచనామా నిర్వహించిన అధికారులను పిలిపించి విచారించానని, కేవలం రూ.51 లక్షలు మాత్రమే లభించినట్లు తేలిందని వెల్లడించారు. ఏప్రిల్ 5లోగా కార్డుల పంపిణీ... కొత్త ఓటర్లకు ఉచితంగా ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేస్తామని రజత్కుమార్ తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీలోగా ఓటరు గుర్తింపు కార్డులు, ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తిచేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 17 లక్షల మందికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు. పాత ఓటరు గుర్తింపు కార్డులు కలిగినవారు మాత్రం రూ.100 సేవా రుసుం చెల్లించి మీ–సేవా కేంద్రాల నుంచి కొత్త ఓటరు గుర్తింపు కార్డులు పొందవచ్చని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటరు గుర్తింపు కార్డుల జారీకి మీ–సేవ కేంద్రాలు రూ.25 రుసుం వసూలు చేయాలని నిర్ణయించామని, అయితే కార్డుల తయారీ వ్యయం పెరగడంతో సేవా రుసుంను రూ.200కు పెంచాలని మీ–సేవ డైరెక్టర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓటర్లపై అధిక భారం పడకుండా రూ.100కు ఈ కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్పై ఫిర్యాదు అందింది... టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత నందమూరి తారకరామారావు నిజ జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’సినిమాపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు తన కార్యాలయానికి ఫిర్యాదు అందిం దని రజత్కుమార్ తెలిపారు. ఈ ఫిర్యా దుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. -
‘ లక్ష్మీస్ ఎన్టీఆర్’పై ఈసీదే నిర్ణయం..
సాక్షి, హైదరాబాద్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ సినిమాపై ఢిల్లీలో ఫిర్యాదు చేశారని, ఆయన తెలిపారు. సీఈవో రజత్ కుమార్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఆర్టికల్స్, న్యూస్ ఐటమ్స్ ప్రచారం చేయకూడదె, చూపకూడదు. అలాగే కులం, భాష ప్రాతిపదికగా ఓటు అడగకూడదు. గత ఎన్నికల్లో 26 లక్షలమంది కొత్తగా ఓటు నమోదు చేసుకుంటే వారికి ఉచితంగా గుర్తింపు కార్డు ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా 3 లక్షలమంది నమోదు చేసుకున్నారు. ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వారికి కూడా ఉచితంగా ఓటర్ కార్డులు ఇస్తాం. మూడు రోజులుగా ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నాం. నాలుగున్నర లక్షల పోస్టర్లను తొలగించాం. సి విజిల్ యాప్లో ఫిర్యాదు చేస్తే ఆర్వోలు చర్య తీసుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు తొలగించాం. ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశాం. 18న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తాం. 33 జిల్లాలకు డీఈవోలను నియమించాం. నగదు, మద్యం పంపిణీపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పుడు కూడా ప్రత్యేక నిఘా ఉంటుంది. అనధికారికంగా నడిచే బెల్ట్ షాపులు నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. లిక్కర్ షాపులు సమయాపాలన పాటించాలి. 2014లో 1649 కేసులు నమోదు అయ్యాయి. అందులో మూడు కేసులులపై ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇక 2018లో 922 కేసుల నమోదు కాగా, 71 కేసులపై చర్యలు తీసుకున్నాం.’ అని తెలిపారు. కాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిలిపివేయాలంటూ టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడును ఆ సినిమాలో కించపరిచేలా చూపించారని, ఆ ప్రభావం ఓటింగ్పై పడే అవకాశం ఉందని అన్నారు. తొలివిడత పోలింగ్ పూర్తయ్యేవరకూ సినిమా విడుదలను వాయిదా వేయాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు రాంగోపాల్ వర్మ ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. -
ఓటరు నమోదుకు నాలుగు రోజులే!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈ నెల 15లోగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. గడువులోగా పేరు నమోదు చేసుకున్న వారు ఏప్రిల్ 11న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందొచ్చని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ గడువు ఈ నెల 25తో ముగియనుండగా దానికి 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకున్న అందరికీ ఓటు హక్కు కల్పిస్తామని వివరించారు. ఆ తరువాత వారంపాటు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరిస్తే ఈ నెల 25 వరకు కలెక్టర్కు అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మాత్రం ఈ నెల 25 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో రజత్ కుమార్ సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 14న ఈవీఎంల పరిశీలనకు, 25న ఓటర్ల జాబితాల పరిశీలనకు కేంద్ర ఎన్నికల సంఘం బృందాలు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఎన్నికల కోడ్లో భాగంగా బహిరంగ మద్యపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ హెచ్చరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు, వాటిపై తీసుకునే చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ భవనాలు, ఇతరత్రా వాటిపై ఉన్న ప్రకటనలను తొలగించాలని ఇప్పటికే ఆదేశించామన్నారు. వెబ్సైట్లలోని ప్రభుత్వ ప్రకటనలపై ఐటీశాఖ నుంచి నివేదిక కోరామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన సదుపాయాలతోపాటు అత్యవసర వైద్య సదుపాయం కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేస్తామన్నారు. సీఈఓతో జరిగిన భేటీలో కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్రెడ్డి, నిరంజన్, బీజేపీ నేత గట్టు రామచంద్రరావు, ఎంఐఎం నేత సయ్యద్ ఎహెసాన్ జాఫ్రీ, బీఎస్పీ నేతలు పాల్గొన్నారు. 25 వరకు నామినేషన్ల స్వీకరణ... లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరించనున్నామని రజత్ కుమార్ తెలిపారు. ఈ వ్యవధిలో సెలవు రోజులైన హోలీ, ఆదివారం మాత్రం నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. కొందరు ఎన్నికల సిబ్బంది ఇంకా విధుల్లో చేరలేదని, వారు వెంటనే బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతపై అన్ని రాష్ట్రాల అధికారులతో సమన్వయం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని, సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండేలా ప్రతిపాదించినట్లు రజత్ తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి రూ. 50 వేల కంటే ఎక్కువ నగదును పెట్టుకోరాదని, ఆధారాలు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందన్నారు. కాగా, ఎన్నికల సిబ్బందిపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషితో రజత్ కుమార్ సోమవారం సమావేశమయ్యారు. అన్ని జిలాల్లో రిటర్నింగ్ అధికారులు ఉన్నారని, అయితే కొన్ని ఏఆర్ఓ స్థానాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాగే మిగతా రాష్ట్రాలకు పరిశీలకులుగా పంపాల్సిన ఐఎఎస్ అధికారుల జాబితాపైనా చర్చించారు. బీజేపీ జేబు సంస్థగా ఈసీ: కాంగ్రెస్ మొదటి విడతలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని ఆరోపించారు. సీఈఓతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రంజాన్ మాసంలో పశ్చిమ బెంగాల్లో ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండటంతో అక్కడ గణనీయ సంఖ్యలో ఉన్న ముస్లిం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టం కానుందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయని, అధికార టీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సుమోటోగా కేసులు నమోదు చేసే అధికారం ఉన్నప్పటికీ ఈసీ ఎందుకు దృష్టిసారించడం లేదన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తనకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ స్లిప్ రాలేదని, ఇది కుట్ర పూరితంగా జరిగిందన్నారు. రాష్ట్రంలో ఓట్ల నమోదు, తొలగింపు విషయంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలసి కుట్ర చేస్తున్నాయన్నారు. -
18న ఎన్నికల నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : ఏప్రిల్ 11న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్కుమార్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం సీఈఓ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. షెడ్యూల్ వచ్చిన మరుక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, వెబ్సైట్లు, ప్రభుత్వ సంబంధిత ఆస్తుల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధుల ఫొటోలను తొలగించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటనల్లో ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల ఫొటోలు ఉండరాదన్నారు. అలాగే ప్రజాప్రతినిధులు, మంత్రులు అధికారిక వాహనాలు వాడొద్దని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను వినియోగిస్తున్నామని, అవసరమైన మిషన్లను ఎన్నికల నాటికి అందుబాటులో ఉంచుతామన్నారు. పోలింగ్ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అని, వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసిన కార్డును తీసుకెళ్లొచ్చన్నారు. ఈసారి ఎన్నికల్లో ట్రక్ గుర్తును తొలగించినట్లు వెల్లడించారు. ఈసారి తొలిదశ (ఏప్రిల్ 11న) పోలింగ్ జరిగిన రాష్ట్రాలకు మాత్రం ఫలితాల కోసం ఏకంగా 42 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. అభ్యర్థి ప్రచార ఖర్చు రూ.70 లక్షలు... పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రచార కార్యక్రమానికి గరిష్టంగా రూ.70 లక్షల వరకు ఖర్చు చేయవచ్చన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసేందుకు రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే రూ.12,500 చొప్పున డిపాజిట్ చేయాలన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల పరిశీలకులను నియమిస్తామని, వారి వివరాలను స్థానికంగా ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే ఓటరు తుది జాబితా ప్రకటించామని, నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే నాటికి సప్లిమెంట్ ఓటరు జాబితాను ప్రకటిస్తామన్నారు. ఎన్నికలు జరిగే పార్లమెంట్ స్థానాలివే... రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆదిలాబాద్ (ఎస్టీ), పెద్దపల్లి (ఎస్సీ), కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి, వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ), ఖమ్మం పార్లమెంట్ స్థానాలున్నాయి. కంట్రోల్ రూమ్ ఏర్పాటు... ప్రతి జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఈఓ తెలిపారు. ఇది నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్నికల కోడ్, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై కాల్ సెంటర్ నంబర్ 1950కి ఫోన్ చేసి తెలపొచ్చన్నారు. 040– 23453044, 3038, 3039 ఫోన్ నంబర్లకు ఫిర్యాదులను ఫోన్ ద్వారా లేదా ఫ్యాక్స్ చేయొచ్చని వివరించారు. నిర్ణీత గడువులోగా ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎమ్మెల్సీ ఎన్నికలు... పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని రజత్కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వాటిపై ప్రభావం చూపే అవకాశం ఉందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిమిత ఓటర్లతో ఉంటాయని, అయినా ఎన్నికల సంఘం నిర్ణయించిన ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
మార్చి 18నుంచి నామినేషన్ల స్వీకరణ : రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 11న పోలింగ్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. మార్చి 25వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలించి, 28న ఉపసంహరణకు గడువు ఇస్తామని చెప్పారు. ఎన్నికల ఫలితాలను మే 23న ప్రకటిస్తామని వెల్లడించారు. నామినేషన్లు సమర్పించేందుకు ఐదుగురు మించి రావద్దని ఆదేశించారు. 24 గంటల్లోగా ఓటర్లను ప్రభావితం చేసే బ్యానర్లు, నాయకుల ఫోటోలు తొలగించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వేల సంఖ్యల్లో ఓట్లు గల్లంతయ్యాయి : దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : ఓట్ల గల్లంతుపై రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి రజత్ కుమార్కు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, రాంచదర్రావు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని దత్తాత్రేయ తెలిపారు. మల్కాజ్గిరిలో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నామన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చొరవ చూపాలని కోరారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. విజయ సంకల్ప దివస్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపై దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్లో కార్యక్రమం చేసుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. -
ఈవీఎంల హ్యాక్ అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని సీఈవో రజత్కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఇక్కడ ‘లోక్సభ జనరల్ ఎలక్షన్స్– మీడియా మానిటరింగ్ అండ్ మీడియా మేనేజ్మెంట్’అనే అంశంపై నిర్వహించిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈసీ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి అంశాలకే యంత్రాంగం పరిమితమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ నియమించే ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ పరిధిలోకి రారని, నేరుగా ఈసీకే వారు నివేదికలు అందజేస్తారని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా ఎన్నికల అధికారులు దానకిషోర్(హైదరాబాద్), రోనాల్డ్రాస్(మహబూబ్నగర్), డీఎస్ లోకేష్కుమార్(రంగారెడ్డి), అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ సీఈవోలు ఆమ్రపాలి, రవికిరణ్, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి వివరించారు. వీవీ ప్యాట్ స్లిప్స్కు ఐదేళ్ల భద్రత: రోనాల్డ్ రాస్ వీవీప్యాట్ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరిచే పద్ధతి ఉందని మహబూబ్నగర్ డీఈవో రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈవీఎంల సాంకేతికత, వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోక్సభ ఎన్నికలకు కొత్తగా వచ్చే ఎం3 ఈవీఎంలు సాంకేతికంగా పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్ రోజున క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే సదుపాయం కల్పించే క్రమంలో అర్ధరాత్రి 12 దాటితే ఎం3 ఈవీఎం క్లోజింగ్ బటన్ ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని, దీనిపై ఈసీ బహిరంగ సవాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్లో విద్యావంతులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా ఆశించిన మేరకు పోలింగ్ నమోదు కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోగస్ ఓట్ల నమోదుకు సంబంధించి విచారణ అంశాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. -
ఓటు నమోదుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం వచ్చే నెల 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక బూత్స్థాయి అధికారులు(బీఎల్వో) పోలింగ్ బూత్ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2019లో తమ పేర్లు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకూ అవకాశం కల్పించింది. ఇందుకోసం స్థానిక పోలింగ్ బూత్కు సంబంధించిన ఓట రు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిబిరాలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్కుమార్ తెలిపారు. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తిచేసి బీఎల్వోకు సమర్పించాలని అన్నారు. ఈ శిబిరాల వద్ద ఫారం–6, 7, 8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్స్థాయి ఏజెంట్లను శిబిరాల వద్దకు పంపించాలని విజ్ఞప్తి చేశా రు. ఓటరు నమోదుకు సంబంధించి ఫిర్యాదులు, అనుమానాలుంటే 1950 నంబర్కు సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను లోక్సభ ఎన్నికల్లో వినియోగించనున్నారు. -
ఒకే ఇంట్లో 50కిపైగా ఓట్లు..
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు, ఇతర అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేృతృత్వంలో పార్టీ నేతల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో ఓటర్ జాబితా పారదర్శకత ఉండాలని ఈసీని కోరారు. ఒకే ఇంటిలో 50కిపైగా ఓట్లు ఉన్న ఇళ్ల వివరాలను ఈసీకి అందజేశామని, తమ ఫిర్యాదు మీద విచారణ జరుపుతామని రజత్కుమార్ భరోసా ఇచ్చారని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను రజత్కుమార్ దృష్టికి తీసుకొచ్చామని, బోగస్, డూప్లికేట్ ఓట్లు, డబుల్ ఓట్లపై ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ విషయంలో ఈసీ ఎవరిని బాధ్యులను చేయకుండా ఎలా ఉందని ప్రశ్నించినట్టు తెలిపారు. కొత్త ఓట్ల నమోదులో బోగస్ ఓట్ల నమోదు జరిగిందని, డిసెంబర్లో బోగస్ ఓట్ల వివరాలు ఇచ్చినా కూడా ఇంతవరకు విచారణ చెయ్యలేదని, ఆ ఓట్లను తొలగించలేదని తెలిపారు. గత ఎన్నికల్లో ఓటరు స్లిప్స్ పంపిణీ కూడా సరిగా జరగలేదన్నారు. వీవీప్యాట్లు వచ్చాక పోలింగ్ సమయం ఎక్కువ అవసరమన్నారు. పోలింగ్ తేదీలు కూడా సెలవు దినాలలో కాకుండా వారం మధ్యలో పెట్టాలని కోరామన్నారు. -
లోక్సభ ఎన్నికలపై సీఈఓ రజత్కుమార్ సమావేశం
-
వీవీప్యాట్లు లెక్కించవచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలు 35 వేలకుపైగా పోలింగ్ కేంద్రాల్లో జరిగాయని, అందులో దాదాపు 200 పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులు సరైన అవగాహన లేకుండా ఈవీఎంలను వినియోగించి పొర పాట్లు చేశారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్కుమార్ తెలిపారు. మాక్ పోల్ సందర్భంగా వేసిన ఓట్లను తొలగించే మీటను నొక్కకుండానే పోలింగ్ ప్రారంభించడంతో వాస్తవంగా పోలైన ఓట్ల సంఖ్య, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లసంఖ్య మధ్య వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఈ సందర్భం గా నెలకొనే అనుమానాలను నివృత్తి చేసేందుకు వీవీ ప్యాట్ రసీదులను లెక్కించవచ్చన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతలో భాగం గా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధ, గురువారాల్లో జిల్లా ఎన్నికల అధికారు(డీఈవో)లైన కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు రిటర్నింగ్ అధికారులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శిక్షణ అనంతరం ఆర్వోలకు పరీక్షలు నిర్వహించామని, పాసైతేనే లోక్సభ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఈ పరీక్షల్లో విఫలమైన అధికారులను ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శిక్షణ తరగతులకు పంపిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణ, ఎన్నికల ఖర్చుల అధ్యయనం, నామినేషన్లను భర్తీ చేసే విధానం, వికలాంగులకు కల్పించాల్సిన ఏర్పాట్లు, ఓటు చేసే విధానం తదితర అన్ని అంశాలపై డీఈవోలకు, ఆర్వోలకు శిక్షణనిచ్చినట్లు ఆయన వివరించారు. ఎన్నికల్లో డీఈవోలు, ఆర్వోల పాత్ర అనే అంశంపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఖాళీగా ఉన్న డీఈవోలు, ఆర్వోలను భర్తీ చేసే కార్యక్రమం కొనసాగుతోందని, ఇప్పుడున్న కొంతమంది ఆర్వోలను మార్చనున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని రజత్కుమార్ తెలిపారు. అన్ని టెక్ని కల్ విషయాలపై అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయపరమైన సమస్యలను కూడా చర్చించినట్లు తెలిపారు. సీ– విజిల్ యాప్, 1950 కాల్సెంటర్ కూడా ఉపయోగిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పా రు. శాంతిభద్రతల విషయంలో లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్తామన్నారు. కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సమీక్ష లోక్సభ ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో జరుగుతున్న ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ఆరా తీశారు. ఏపీ పర్యటన ముగించుకుని మంగళవారం హైదరాబాద్కు చేరుకుని ఇక్కడే రాత్రి బస చేశారు. బుధవారం ఉదయం సీఎస్ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్ రెడ్డిలతో సమావేశమై లోక్సభ ఎన్నికల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఖాళీలున్న చోట్లలో జిల్లా ఎన్నికల అధికారుల నియామకం, అవసరమైన చోట్లలో బదిలీలు, రిటర్నింగ్ అధికారులకు శిక్షణను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సీఎస్ ఎస్కే జోషితో సీఈవో రజత్కుమార్ సచివాలయంలో సమావేశమై చర్చించారు. ఆ కలెక్టర్ అనుకోకుండా పొరపాటు చేశారు ‘శాసనసభ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్లు తీవ్రంగా కష్టపడ్డారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఒమర్ జలీల్ సైతం బాగా కష్టపడి పనిచేశారు. అయితే, ఆయన పొరపాటుగా ఈవీఎం యంత్రాలను తెరిచి చిక్కుల్లోపడ్డారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ పనిచేయలేదు. పొరపాటుగా ఈవీఎంలను తెరిచి హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఆయన్ను సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. న్యాయస్థానం ఆదేశాలు ఉల్లంఘించడంతో కఠిన చర్యలు తీసుకోకతప్పలేదు’అని రజత్కుమార్ పేర్కొన్నారు. 27.31 లక్షల దరఖాస్తులు... ఓటర్ల జాబితా సవరణ కింద దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 4తో ముగిసిందని, గడువులోగా 27.31 లక్షల దరఖాస్తులొచ్చాయని రజత్కుమార్ అన్నారు. ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులను పరిశీలించగా, అందులో 7 లక్షల దరఖాస్తులు తొలిసారిగా ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారే ఉన్నారన్నారు. మిగిలిన పెండింగ్ దరఖాస్తులను సైతం పరిష్కరిస్తే తొలిసారిగా ఓటేయనున్న యువ ఓటర్ల సంఖ్య 12 లక్షల నుంచి 13 లక్షల వరకు పెరిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం
హైదరాబాద్: ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయ డం అసాధ్యమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) రజత్కుమార్ స్పష్టంచేశారు. సాంకేతికంగా ఎంతో కట్టుదిట్టమైన భద్రతతో ఈవీఎంలను రూపొందించారన్నారు. అణుబాంబు వేసినా ఈవీఎంలు భద్రంగా ఉంటా యని తెలిపారు. బుధవారం హోటల్ టూరిజం ప్లాజాలో ఎన్నికల ప్రక్రియ విధానంపై ‘రేడియో జాకీలకు’అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రజత్కుమార్ మాట్లాడుతూ.. ప్రజలు రేడియో కార్యక్రమాలను ఆదరిస్తున్నారని, దీంతో రేడియో జాకీలుగా విధులు నిర్వహిస్తున్నవారు ఓటర్లను చైతన్యపరిచి ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఓటుహక్కు ను వినియోగించుకునేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటరుగా ఎలా నమోదు కావాలి.. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల్లో తప్పులు ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవాలి వంటి పలు అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కోరారు. అర్బన్లో పోలింగ్ తక్కువ.. హైదరాబాద్లో పోలింగ్ శాతం తగ్గిందని, దానిని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రజత్ కుమార్ చెప్పారు. నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో 76 శాతం పోలింగ్ నమోదు అయిందని, తెలంగాణలో మాత్రం 73.4 శాతమే నమోదు అయిందన్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ పోలింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ముషారఫ్ ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరును రేడియో జాకీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీఈఓలు అమ్రపాలి, రవికిరణ్ పాల్గొన్నారు. -
బోగస్..సీరియస్
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం మాజీ చీఫ్, ప్రస్తుత ఉన్నతాధికారులను నాంపల్లి నియోజకవర్గ ఓటర్లుగా పేర్కొంటూ రిజిస్టర్ చేయించడం, నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పొందడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశామని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి సోమవారం ‘సాక్షి’కి తెలిపారు. గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారీ స్థాయిలో నకిలీ ఓట్లు రిజిస్టర్ అయ్యాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. నాంపల్లి సహా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు సైతం చేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వీలున్నంత వరకు నకిలీ ఓటర్లను తొలగించింది. అయితే నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఫిరోజ్ఖాన్ జనవరి 25న నకిలీ ఓటర్లకు సంబంధించి ఉదాహరణలు అంటూ రెండు పేర్లను బయటపెట్టారు. ఆ నియోజకవర్గంలోని ఓవైసీ నగర్లోని చిరునామా నుంచి మాజీ సీఈసీ ఓమ్ ప్రకాష్ రావత్, ప్రస్తుతం ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ పేర్లు, ఫొటోలతో నమోదై ఉన్నాయంటూ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారాలుగా డబ్ల్యూఆర్హెచ్ 2400372, డబ్ల్యూఆర్హెచ్ 2400380 నెంబర్లతో ఓటర్ స్లిప్పుల్ని సైతం ఆయన ప్రదర్శించారు. దీంతో ఈ విషయం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర విచారణకు ఆదేశించింది. నగరానికి సంబంధించిన ఓటరు జాబితాలు, నమోదు అంశాలను జీహెచ్ఎంసీ పర్యవేక్షిస్తుంది. ఈ నేపథ్యంలోనే అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆ అధికారుల్ని ఆదేశించింది. దీంతో జీహెచ్ఎంసీ మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ శనివారం సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీలోని 419, 465, 471 సెక్షన్లతో పాటు ఆర్పీ యాక్ట్లోని సెక్షన్ 31, ఐటీ యాక్ట్లోని సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీ అడ్రస్ గుర్తింపుపై దృష్టి... జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ రెండు పేర్లు నమోదుకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు వచ్చినట్లు గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలోనే సీసీఎస్ పోలీసులు తమ కేసులో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) యాక్ట్ను చేర్చారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం ఈ దరఖాస్తు ఏ ఐపీ అడ్రస్ నుంచి అప్లోడ్ అయిందో తెలుసుకోవడంపై దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగంలో అనేక మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ దరఖాస్తు పరిశీలన, ఓటర్ జాబితాలో పేర్లు చేర్చడంలో వీరి నిర్లక్ష్యం ఏమైనా ఉందా? అనే కోణం పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. సదరు వ్యక్తులు దురుద్దేశంతో, ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేసినట్లు భావిస్తున్నామని మెహదీపట్నం ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మహ్మద్ ఖాజా ఇంకెషాఫ్ అలీ అన్నారు. -
‘మనకెందుకు ఈవీఎంలు ’
సాక్షి, హైదరాబాద్ : ట్యాపరింగ్తోనే 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఆరోపణలపై ఈసీ సమాధానం చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వతంత్ర సంస్థ అయినా ఈసీపైనే ప్రజలకు అనుమానం రావడం దురదృష్టకరమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలే బ్యాలెట్ పేపర్తో ఎన్నికలకు వెళ్తుంటే మనకెందుకు ఈవీఎంలు అని ప్రశ్నించారు. ఈవీఎంల ద్వారా ఎన్నికలకు వెళితే..ఓటు ఎవరికి వేశానో అనే అనుమానాలు ఓటర్ ఉన్నాయని.. ఇది బ్యాలట్ పేపర్తోనే నివృత్తి అవుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పోలింగ్కు, కౌటింగ్కు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. దీనిపై తాము వీవీ ప్యాడ్ల లెక్కింపుకు డిమాండ్ చేసినా ఈసీ పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల అధికారి రజత్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బ్యాలట్తో ఎన్నికలు నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. -
సీఈసీ రజత్కుమార్ మాట ఇచ్చి తప్పారు : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, చత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఫలితాలపై అనుమానాలున్న చోట వీవీ ప్యాట్లు లెక్కించారని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని అన్నారు. కౌంటింగ్కు, పోలింగ్కు మధ్య భారీ తేడా ఉన్న కారణంగానే తాము వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కచోట వీవీప్యాట్లు లెక్కించలేదని వాపోయారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల సవరణ చేయకుండా ఈసీ ఎన్నికలు వెళ్లిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను ‘ఫ్రీ అండ్ ఫేర్’గా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే, 10వేల మెజారిటీతో ఫలితం వెల్లడైన చోట వీవీప్యాట్లు లెక్కించాలని అన్నారు. ఓట్లను సవరిస్తామని హైకోర్టులో చెప్పిన సీఈసీ రజత్కుమార్ మాటతప్పారని విమర్శించారు. -
ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్కు వద్ద నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ నంది ఎల్లయ్య, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, మాజీ మంత్రులుమర్రి శశిధర్ రెడ్డి, డీకే అరుణ, హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డీకే అరుణ మాట్లాడుతూ.. అసెంబ్లీని రద్దు చేసి సీఎం కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం చూస్తే ఎన్నికల కమిషన్, టీఆర్ఎస్ కుమ్మక్కైన విషయం స్పష్టమైందని అన్నారు. తమతో చేతులు కలపడం వల్లే సీఎం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరకు వెళ్లి ధన్యవాదాలు తెలిపారని ఆరోపించారు. ‘ఓట్ల గల్లంతుపై ప్రతిపక్షాలు మొత్తుకున్నా ఎన్నికల సంఘం పట్టించుకోలేదు.. తీరా ఎన్నికలు అయినా తర్వాత రజత్ కుమార్ క్షపణలు చెప్పారు. ఎన్నికల్లో కూడా పోలింగ్కు, కౌంటింగ్కు మధ్య ఓట్ల తేడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలో పేపర్ బ్యాలెట్తోనే ఎన్నికలు నిర్వహించాలి. ఫలితాలకు ముందే ఇన్ని సీట్లు గెలుస్తామంటూ ప్రకటించుకున్న టీఆర్ఎస్ అదేవిధంగా అన్ని సీట్లను గెలవడం పట్ల అందరికి అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదు : కోదండరామ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ సొంత పనులకు వాడుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులే టీఆర్ఎస్కు ఓటు వేయాలని డబ్బులు పంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల గల్లంతుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు వెళ్లారు.. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాను సవరించుకుంటామని ఎన్నికల సంఘం చెప్పింది.. అయినా అసెంబ్లీ ఎన్నికలో 22 లక్షల ఓట్లు ఎందుకు గల్లంతయ్యాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీవీప్యాట్లను తీసుకవచ్చారు. అభ్యర్థులకు అనుమానాలు ఉన్నచోట వాటిని లెక్కించాల్సింది.. ఈ విషయంలో ఈసీ రజత్ కుమార్ వ్యవహార శైలిపై అందరికి అనుమానాలు నెలకొన్నాయన్నారు. రజత్ కుమార్పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో అవకతవకలను అరికట్టాల్సింది ఎన్నికల సంఘం.. అలాంటిది వారే కంచే చేను మేసినట్లు ప్రవర్తించడం సరికాదని విమర్శించారు. ఎన్నికల సంఘం మీద ఇప్పటి వరకు ఇంతటి తీవ్ర ఆరోపణలు ఎన్నడూ రాలేదని అన్నారు. -
‘పార్లమెంట్ ఎన్నికలకు కూడా అవే ఈవీఎంలు’
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్టోరల్ రోల్ ఎలా ఉంది.. ఎప్పటి వరకూ పూర్తి అవుతుందనే అంశం గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించినట్లు.. వాటి వాడకం గురించి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాల గురించి అధికారులతో చర్చించానన్నారు. ఫిబ్రవరి 22 నాటికి తుది ఓటర్ లిస్ట్ను ప్రచురిస్తామని ప్రకటించారు. అసెంబ్లీకి వాడిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు వాడతామన్నారు. -
ఆ ఓటర్లు ఇంకా బతికే ఉన్నారా?
సాక్షి, హైదరాబాద్: ఒకే ఇంట్లో 30 మందికి మించి ఓటర్లున్నారా? ఓటరు జాబితాలో పేర్లున్న 100 ఏళ్ల ఓటర్లలో బతికున్నవారెంతమంది? ఇంటి నంబరు లేని ఓటర్లు ఎవరెవరు? ఒకే విధమైన పేరు, తండ్రి పేరు, వయస్సు, ఫొటోలున్న డూప్లికేట్ ఓటర్లు ఎంత మందున్నారు? అన్న అంశంపై ఎన్నికల సంఘం లోతుగా పరిశీలన జరుపుతోంది. బోగస్ ఓటర్ల ఏరివేతలో భాగంగా పైన పేర్కొన్న నాలుగు రకాల అనుమానాస్పద ఓటర్ల వివరాలతో నివేదికలు రూపొందించి బూత్ స్థాయి అధికారుల(బీఎల్ఓ)కు అందజేయనుంది. బీఎల్ఓలు క్షేత్ర స్థాయికి వెళ్లి ఈ నివేదికల్లో పొందుపరిచిన ఓటర్ల గురించిన వివరాలపై విచారణ జరపనున్నారు. ఓటర్ల జాబితాలో లక్షల సంఖ్యలో ఇలాంటి బోగస్ ఓటర్లున్నారని ఆరోపిస్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికలకు ముందు ఆధారాలతో సహా హైకోర్టులో కేసువేసింది. దీంతో ఎన్నికల సంఘం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనాల్సి వచ్చింది. శాసనసభ ఎన్నికల పోలింగ్ రోజు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం చెలరేగింది. ఏకంగా ఓటర్ల జాబితా నుంచి 22 లక్షల మంది అర్హుల ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెలరోజులైనా ఇంకా ఓటర్ల జాబితాలో లోపాలపై చర్చ జరుగుతుండటంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా ఓటర్ల జాబితా రూపొందించాలని నిర్ణయించింది. 2019 జనవరి 1 అర్హత తేదీగా ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగానే.. ఈ ఏరివేతకు పూనుకుంది. ఒకవేళ బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్లు అని తేలితే సంబంధిత ఓటర్లను వచ్చే ఏడాది ప్రకటించనున్న ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని సిఫారసు చేయనున్నారు. బీఎల్వోలకు లోపాల చిట్టా! ఓటర్ల జాబితాలో ఇంటినంబరు ఉండాల్సిన చోట ‘నో’, ‘న్యూ’, ‘ఓల్డ్’వంటి పదాలతో వేల సంఖ్యలో ఓటర్ల పేర్లున్నాయి. కనీసం మూడంకెలులేని బోగస్ ఇంటి నంబర్లతో సైతం పెద్ద సంఖ్య లో ఓటర్లున్నారు. ఇంటి నంబర్ను పేర్కొనకుండా ఖాళీగా ఉంచడం/సున్నా రాయడం/ఒకే అంకె ఇంటి నంబరున్న ఓటర్లు వేలలోనే ఉన్నారు. దీనిపై ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫిర్యాదులొచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకే ఇంటి నంబరుతో 30, అం తకు మించిన సంఖ్యలో ఓటర్లుంటే వారి జాబితాలను ఎన్నికల సం ఘం సిద్ధం చేస్తోంది. 18 ఏళ్ల లోపు, 100 ఏళ్లు మించిన వయస్సు గల ఓటర్లు సైతం వేల సంఖ్యలో ఉన్నట్లు గుర్తించింది. చనిపోయినవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ కుటుంబ సభ్యులెవరూ దరఖాస్తు చేయడం లేదు. దీంతో ఓటర్లు చనిపోయి దశా బ్దాలు గడుస్తున్నా వారి పేర్లు ఇంకా ఓటర్ల జాబితాలో కొనసాగుతు న్నాయి. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఒకే ప్రాంతం/వేర్వేరు ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటర్ల జాబితాలో పేర్లు కలిగి ఉన్నారు. ఓటర్ల జాబితా వెబ్సైట్లో శోధించిన కొద్దీ ఒకే విధమైన వోటర్ ఐడీ, పేరు, వయస్సు, లింగం, చిరునామా, ఫొటోలు కలిగిన ఓటర్లు ఉన్నట్లు బయటపడుతున్నారు. ఈఆర్వో నెట్ సాఫ్ట్వేర్ ఆధారంగా ఈ నివేదికలను ఎన్నికల సంఘం తయారు చేస్తోంది. ఇంటి నంబరు ఆధారంగా.. నేషనల్ ఓటరు సర్వీస్ పోర్టల్ (https://electoralsearch.in)లో ఇంటి నంబర్ ఆధారంగా శోధించే సదుపాయం ఉండేది. శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సదుపాయాన్ని తీసేశారు. కేవలం ఓటరు పేరుతో మాత్రమే శోధించే అవకాశముంది. అయితే భారీ స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో మళ్లీ ఇంటి నంబరు ఆధారంగా ఓటర్లను శోధించేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సీఈఓ రజత్కుమార్ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడన్నా సక్కగవుతదా? తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్ ప్రోగ్రాం (నెర్పార్) కింద 35,00,700 బోగస్ ఓటర్లను తొలగించారు. 2016లో చేపట్టిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ (ఐఆర్ఈఆర్) కార్యక్రమం కింద మళ్లీ 24,20,244 ఓటర్లను తీసేశారు. జనవరి 2015 నాటికి రాష్ట్ర ఓటర్ల జాబితాలో 2.84 కోట్ల మంది ఓటర్లుండగా, ఈ రెండు కార్యక్రమాల కింద ఏకంగా 59,20,944 ఓటర్లను తొలగించారు. దీనికి అదనంగా వార్షిక ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కింద గత నాలుగేళ్లలో ప్రతి ఏటా లక్ష నుంచి రెండు లక్షల బోగస్ ఓటర్లను తొలగించారు. బోగస్, చిరునామా మారి, చనిపోయిన ఓటర్లను మాత్రమే తొలగించామని సీఈఓ రజత్కుమార్ తెలిపారు. పెద్ద సంఖ్యలో అర్హులైన ఓటర్లను తొలగించి, బోగస్ ఓటర్లను జాబితాలో ఉంచారని ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 60 లక్షలకు పైగా బోగస్ ఓటర్లను తొలగించినట్లు ఎన్నికల సంఘం పేర్కొంటున్నా ఓటర్ల జాబితాలో ఇంకా బోగస్ ఓట్లున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కీలకంగా మారింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న ఓటర్ల జాబితాలో మళ్లీ అవే పొరపాట్లు పునరావృతమైతే ఆ తర్వాత జరగనున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం మరోసారి అభాసుపాలు కాకతప్పదని విమర్శలు వస్తున్నాయి. -
ప్రియమైన మీకు..
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యకమంలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) డాక్టర్ రజత్కుమార్.. రాష్ట్రంలోని కోటీ 10 లక్షల కుటుంబాలకు లేఖలు రాయనున్నారు. కొత్త ఓటర్ల నమోదు(ఫారం–6), ప్రవాసుల ఓటర్ల నమోదు(ఫారం–6ఏ), చనిపోయిన, శాశ్వతంగా చిరునామా మారిన ఓటర్ల తొలగింపు(ఫారం–7), ఓటర్ల జాబితాలో పేరు సవరణ(ఫారం–8), అదే అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చిరునామా మార్పు(ఫారం–8ఏ) కోసం ఏం చేయాలి? ఏ ఫారాలు సమర్పించాలి? అన్న అంశాల పట్ల ఈ లేఖల ద్వారా అవగాహన కల్పించనున్నారు. తిరుగు చిరునామా కలిగిన ఓ పోస్టు కార్డును ఈ లేఖకు జత చేసి పంపించనున్నారు. ఓటర్ల జాబితాపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలను ఈ పోస్టు కార్డుపై రాసి పంపించాలని ఆహ్వానించనున్నారు. ఈ విషయాన్ని సీఈఓ రజత్కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఓటర్ల నమోదుపై చైతన్యపరిచేందుకు పౌరులకు బల్క్ ఎస్సెమ్మెస్లు పంపించనున్నట్టు చెప్పారు. ‘‘2019 జనవరి 1ని అర్హత తేదీగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నాం. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. వచ్చే లోక్సభ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం. లోక్సభ ఎన్నికల కోసం మరో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించని పక్షంలో ఫిబ్రవరి 22న ప్రచురించనున్న తుది ఓటర్ల జాబితా నుంచి ఒక్క ఓటరును కూడా తొలగించడానికి వీలుండదు. అందువల్ల బోగస్, చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 వరకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి’’అని ఆయన సూచించారు. గత నెల 26న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టగా.. కొత్త ఓటర్ల నమోదు కోసం 8,64,128, ప్రవాసుల ఓటర్ల నమోదుకు 1123, ఓట్ల తొలగింపునకు 10,130, ఓటరు పేరు సవరణ కోసం 57,348, ఉన్న నియోజకవర్గం పరిధిలోనే చిరునామా మార్పునకు 22,098 దరఖాస్తులు కలిపి ఇప్పటివరకు మొత్తం 9,54,827 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. 95 శాతం ఓట్ల తొలగింపు కరెక్టే... శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు గల్లంతైనట్లు విమర్శలొచ్చిన నేపథ్యంలో, ఓట్లు గల్లంతైనట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపించామని రజత్కుమార్ వెల్లడించారు. 2015లో చేపట్టిన నేషనల్ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ అండ్ అథెంటిఫికేషన్(ఎన్ఈఆర్పీఏపీ) కార్యక్రమం కింద ఆ ఓట్లను తొలగించినట్లు తేలిందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 6,30,652, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 28,70,048 ఓటర్లు కలిపి మొత్తం 35,00,700 మంది ఓటర్లను ఈ కార్యక్రమం కింద తొలగించారని తెలిపారు. మేడ్చల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని విచారణ జరపగా.. ఇక్కడ తొలగించిన 7.4లక్షల ఓట్లలో 6.8లక్షల ఓట్లను సరిగ్గానే తొలగించారని.. కేవలం 60వేల ఓట్లను మాత్రమే తప్పుగా తొలగించినట్లు నిర్ధారణ జరిగిందని వివరించారు. మేడ్చల్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా తొలగించిన ఓట్లపై విచారణ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2015లో ఎన్ఈఆర్పీఏపీ కింద ఓట్లు తొలగించిన తర్వాత 2016, 2017, 2018లో ఓటర్ల జాబితా సవరణ నిర్వహించామని, గతేడాది మూడు సార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించినా 2015లో ఓటు కోల్పోయిన వ్యక్తులు మళ్లీ ఓటరుగా నమోదు కాకపోవడం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడానికి ఓ కారణమని రజత్కుమార్ వివరించారు. 2016లో నిర్వహించిన ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్(ఐఆర్ఈఆర్) కింద రాష్ట్రంలో మరోసారి 24 లక్షల ఓట్లను తొలగించారని, అయితే ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలపై జీహెచ్ఎంసీ పరిధిలోని ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు నోటిసులు జారీ చేశామని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ నెలాఖరు వరకు ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు... రెండు ఉపాధ్యాయ, ఓ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈనెల 31 వరకు ఆయా నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రజత్కుమార్ తెలిపారు. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ పట్టభద్రులు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1,42,958 మంది ఓటర్లు, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్/వరంగల్–ఖమ్మం –నల్లగొండ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో 3,38,44 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. -
తొలగించిన ఓటర్లు వీరే!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పందించారు. 2015, 2017లో తొలగించిన ఓటర్ల పేర్లతో జాబితాలను జిల్లా ఎన్నికల అధికారులకు (డీఈఓ) అందజేశారు. ఈ పేర్లను సీఈఓ అధికారిక వెబ్సైట్లో సైతం పొందుపరిచినట్లు వెల్లడించారు. తొలగించిన ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉన్నా యో లేవో ఓటర్లు చూసుకోవాలని.. ఒక వేళ పేరు తొలగించినట్లు గుర్తిస్తే ఓటరు నమోదు కోసం స్థానిక బీఎల్ఓను సంప్రదించాలని రజత్కుమార్ సూచించారు. 2019 జనవరి 1 అర్హత తేదీగా చేపట్టిన తాజా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మం గళవారం గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారోద్యమాన్ని నిర్వహి స్తున్నామని, ఇందుకు సహకరించాలని రాజకీయ పార్టీలకు కోరారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరిగే చోట్లలో 23న ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఆ రోజు పోలింగ్ కేంద్రా ల వద్ద బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఓటర్ల జాబితాతో అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులతో పాటు ము సాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తారని వెల్లడించారు. ఓటర్ల నమోదు కార్యక్రమం పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొం దించేందుకు కృషి చేయాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. 18–19 ఏళ్ల వయస్సున్న యువతీ యువకులతో పాటు మహిళలు, వికలాంగులు, పట్టణ ఓటర్లు, ట్రాన్స్జెండర్లు ఓటరు నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధి లోని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రజత్కుమార్ ప్రకటించారు. ఆ చర్యలివే.. - ఈ నెల 9–11, 23–25 వరకు సాయంత్రం 4–7 గంటల వరకు బీఎల్ఓలు పోలింగ్ కేంద్రాల వద్ద కూర్చొని ఓటర్ల నమోదు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. ప్రత్యేక ప్రచారోద్యమం నిర్వహించనున్న జనవరి 20వ తేదీన బీఎల్ఓలు పూర్తి రోజు పోలింగ్ కేంద్రం వద్ద అందుబాటులో ఉంటారు. - జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల కార్యాలయాల వద్ద ఓటర్లకు సహకరించేందుకు ఓ కంప్యూటర్ ఆపరేటర్ను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తుల పంపిణీతో పాటు ఓటరు నమోదుకు సంబంధించిన స్థితిగతులను ఆ కంప్యూటర్ ఆపరేటర్ దరఖాస్తుదారులకు తెలియజేస్తారు. - జనవరి 8 నుంచి 25 వరకు నగరంలోని ప్రముఖ మాల్స్ వద్ద ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణ కోసం డ్రాప్ బాక్కులను ఏర్పాటు చేయనున్నారు. - ఈఆర్వోలు తమ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలను సందర్శించి అక్కడ చదువుతున్న యువతను ఓటరు నమోదులో పాల్గొనేలా చైతన్యపరుస్తారు. కళాశాలల ప్రిన్స్పాల్కు తగిన సంఖ్యలో ఓటరు నమోదు దరఖాస్తులు అందించడంతో పాటు కళాశాలలో డ్రాప్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. జాబితా సవరణ గడువు పెంచండి అధికారులందరూ పంచాయతీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని, ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం షెడ్యూల్ను పొడిగించాలని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. గత మూడేళ్లల్లో పలు దఫాలుగా లక్షల ఓట్లను అడ్డగోలుగా తొలగించారని, ఓట్లు కోల్పోయిన వారందరికీ మళ్లీ ఓటరు జాబితాలో స్థానం కల్పించాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఓటింగ్ శాతం పడిపోవడానికి కారణాలు తెలపాలని సీఈఓను కోరినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓట్లను అడ్డగోలుగా తొలగించిన బీఎల్ఓలను బాధ్యులు చేయాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతు కావడంతో టీఆర్ఎస్ పార్టీకి రావాల్సిన మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ నేత గట్టు రాంచందర్ రావు పేర్కొన్నారు. -
రేపటి నుంచి కొత్త ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓటర్ల జాబితా వార్షిక ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం నుంచి పునఃప్రారంభించనుంది. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులు ఓటరు నమోదుకు అర్హులు కానున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించనుందని, అందులో పేర్లు ఉన్నాయో లేవో పరిశీలించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సూచించింది. ఒకవేళ పేర్లు గల్లంతైతే మళ్లీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నెల 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ఈ దరఖాస్తులు, అభ్యంతరాలను పరిశీలించి ఫిబ్రవరి 11 నాటికి పరిష్కరించనుంది. ఫిబ్రవరి 18 నాటికి ఓటర్ల జాబితాలో మార్పుచేర్పులు చేయడంతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఫిబ్రవరి 22న తుది ఓటర్ల జాబితాను ఈసీ ప్రకటించనుంది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఇదే జాబితాను వినియోగించనుంది. లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ నెల 26న ప్రకటించనున్న ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించి చూసుకోవాలని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు కావడంతో ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది ఓట్లు గల్లంతుకావడం, ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఓటర్లకు క్షమాపణ చెప్పడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా చేపట్టనున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. మూసాయిదా జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి http://ceotelangana.nic.in వెబ్సైట్ లేదా 9223166166/51969 నంబర్లకు ‘ TS< SPACE>VOTEVOTERID NO’ నమూనాలో ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. -
రాష్ట్రంలో అవినీతి ప్రజ్వరిల్లుతోంది : జయప్రకాష్ నారాయణ
సాక్షి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అవినీతి ప్రజ్వరిల్లుతుందని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఎలాంటి సిఫార్సు లేకుండా నేరుగా పనులు చేయించుకునే వ్యవస్థ ఎప్పుడు వస్తుందోనని ఆశాబావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎ౦తో నమ్మకంతో ప్రభుత్వాలను ఎన్నుకుంటుంటే ఎన్నో పన్నులు కడుతున్నా ఎ౦దుకు మళ్లీ ఎదైనా పనులు చేపించుకోవాలనుకున్నప్పుడు లంచాలు ఇవ్వాల్సి వస్తుందని మండిపడ్డారు. భారత పార్లమెంట్లో అన్ని పార్టీలు కలసి దారుణమైన చట్టాలు తీసుకు వచ్చాయని, లంచం ఇస్తే ఏడు ఏళ్ళ శిక్ష కనీసం మూడేళ్ళు... అదే లంచం తీసుకున్న వాడికి ఎలాంటి కేసు ఉండదు అనే చట్టం తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగాల్సిన పనులు గడువులోపల ఆ పని జరిగేలా చట్ట బద్ద౦ చెయ్యాలని చెప్పారు. వీటన్నిటిని అధికమించాలంటే నిజమైన ప్రతిపత్తికల లోకాయుక్త రావాలి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తికల ఎవ్వరినైనా నిలదీసి శిక్షించగల లోకాయుక్త కావాలని ఆయన తెలిపారు. తెలగాణ ప్రజల్ని ఒక్కటే కోరుతున్న లంచం వేధింపులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఎర్పడితే ఎమి లాభం లేదని అన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతవ్వడం పై ఈసీ రజత్ కుమార్ క్షమాపణ చెప్పడం సరియైంది కాదని అన్నారు. ఓట్లు గల్లంతుపై ఎన్ని ఉద్యమాలు చేసినా ఫలితం లేకపోతోందని, దీనిపై పోస్టాఫీసులను నోడల్ ఎజన్సీలుగా ఏర్పాటు చేసి ఓటర్లు ఎప్పుడైనా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసీది ఘోరమైన తప్పిదమేని జయప్రకాశ్ ఆరోపించారు. -
‘బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమం ప్రారంభిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి దారి తీసిన పరిస్థితులు, ఎన్నికల్లో వ్యవహరించిన తీరుపై గాంధీభవన్లో సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం టీపీసీసీ నేత దాసోజు శ్రవణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో 22 లక్షలు ఓట్లు నిర్ధాక్షణంగా తొలగించిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రధాన అధికారి(ఈసీ) రజత్ కుమార్, ఇతర అధికారులు టీఆర్ఎస్ పార్టీకి పేరోల్ క్రింద ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వచ్చే పార్టమెంట్ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని అని వెల్లడించారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ద్వారా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతామని తెలిపారు. మొన్న జరిగిన ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు కుమ్మకైయి పోలింగ్ ఏజెంట్లను కూడా సెంటర్లోకి రానివ్వకుండా అధికార పార్టీకి సహకరించారని ఆయన ఆరోపించారు. నర్సాపూర్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 8.8 శాతం ఉన్న పోలింగ్ సాయంత్రం 5 గంటలకు 70 శాతం దాటిందని, ఆపై తెల్లారా 90 శాతంగా ఈసీ ప్రకటించని ఈ సందర్భంగా ప్రస్తావించారు. చిప్లు, ట్యాంపరింగ్ సమాచారం సేకరించి సరియైన సమయంలో వాటి గురించి బయట పెడుతామన్నారు. బ్రింగ్ బ్యాక్ పేపర్ బ్యాలెట్ ఉద్యమాన్ని హైదరాబాద్ నుంచే ప్రారంభిస్తామని, ఈ విషయం పై హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా పోరాడుతామని దాసోజ్ చెప్పారు. ఇది మిషన్ మాండేటరీ తప్ప పీపుల్స్ మాండేటరీ కాదన్నారు. రాష్ట్రంలో 40 నుంచి 50 నియోజకవర్గాల్లో ప్రజలు, టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రచారానకి రాకుండా అడ్డుకున్నా వాళ్లే వేలాది ఓట్ల మోజారిటీతో గెలిస్తే ఇక ఏం చెప్పాలో మాకు అర్థం కావడం లేదని దాసోజ్ చెప్పారు. -
ఒంటి గంటకల్లా పూర్తి ఫలితాలు : రజత్కుమార్
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుడనున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 43 కేంద్రాల్లో కౌంటింగ్ ఉంటుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 14 కౌంటింగ్ టేబుల్స్ ఉంటాయన్న రజత్ కుమార్... మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం ఒంటి వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. శేరిలింగంపల్లిలో అత్యధికంగా 42 రౌండ్లు, బెల్లంపల్లిలో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు. అక్కడ మాత్రమే వీవీప్యాట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తామని రజత్కుమార్ తెలిపారు. అన్ని చోట్ల వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం కుదరని, కేవలం అత్యవసరమైన చోట్ల మాత్రమే ఇందుకు అనుమతినిస్తామని పేర్కొన్నారు. ప్రతీ రౌండు పూర్తైన తర్వాత అభ్యర్థులకు చూపించే ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పూర్తి పారదర్శకంగా కౌంటింగ్ కొనసాగేందుకు లైవ్ రిపోర్టింగ్ చేసుకునేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు వద్దు ఎలక్షన్ ఏజెంట్లకు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి ఉంటుందని రజత్ కుమార్ తెలిపారు. అయితే ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేదాకా బయటికి వెళ్లకూడదని చెప్పారు. మొబైలు ఫోన్లు, కాలిక్యులేటర్లు తీసుకువస్తే నేరంగా పరిగణిస్తామని, పెన్నులు మాత్రం తెచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక మీడియా పాయింట్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. విలేకరులు కూడా కౌంటింగ్ కేంద్రం లోపలికి రావచ్చని పేర్కొన్నారు. -
ఎక్కడా రీ పోలింగ్ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని, ఎక్కడా రీ పోలింగ్ నిర్వహించడానికి సిఫారసు చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర శాసనసభకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 73.20 శాతం పోలింగ్ నమోదైందని, 2014 శాసనసభ ఎన్నికల (69.5 శాతం)తో పోలిస్తే ఈసారి పోలింగ్ పెరిగిందని రజత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఓటర్ల స్పందన ఆరోగ్యకరంగా ఉందని, పోలింగ్ శాతం పెంచినందుకు అందరికీ ఫుల్ థ్యాంక్స్ అని పేర్కొన్నారు. కార్వాన్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ప్రిసైడింగ్ అధికారులు స్థానిక రిటర్నింగ్ అధికారికి సమర్పించిన పత్రాల్లో కొన్ని తొలుత కనిపించలేదని, కాసేపు వెతికాక లభించాయన్నారు. ఆ పత్రాలెక్కడా పోలేదని, వేరే పత్రాల్లో కలసిపోయినట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో కార్వాన్లో రీ పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదని నిర్ణయించామన్నారు. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం సైతం సమ్మతి తెలిపిందన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన నియోజకవర్గాలవారీ పోలింగ్ శాతాన్ని శనివారం రాత్రి హైదరాబాద్లో ఆయన విలేకరులకు విడుదల చేసి మాట్లాడారు. కార్వాన్లో రీ పోలింగ్ నిర్వహించాలని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన డిమాండ్లను ఆయన తోసిపుచ్చారు. కాగా, ఎక్కడా రీ–పోలింగ్ నిర్వహించకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలింగ్ ప్రకటనపై ఆలస్యం ఎందుకంటే.. పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన తుది నివేదిక తనకు అందేసరికి శనివారం తెల్లవారుజామున 3.40 గంటలు అయిందని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే సరికి శుక్రవారం సాయంత్రం 6 గంటలైందని, ఆ తర్వాత ప్రిసైడింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలతోపాటు పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన రెండు నివేదికలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించే సరికి రాత్రి 7.30 గంటలైందన్నారు. రిటర్నింగ్ అధికారులు ఒక్కో ప్రిసైడింగ్ అధికారి నుంచి నివేదికలు స్వీకరించి పరిశీలించి, అవి సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకునేందుకు ఎక్కువ సమయం పట్టిందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 300 పోలింగ్ కేంద్రాలున్నాయని, మేడ్చెల్లో అత్యధికంగా 514 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులు 75 కాలమ్ల నివేదికను తయారు చేసి తమకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అందుకే పోలింగ్ శాతాలను వెల్లడించడంలో ఆలస్యమైందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పార్టీల కాపలా.. కట్టుదిట్టమైన భద్రత, సీసీటీవీ కెమెరాల నిఘాలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరిచామని రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో వినియోగించిన, వినియోగించని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర రాజకీయ పార్టీల ప్రతినిధులు కాపలా ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తామన్నారు. ఈవీఎంల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాజకీయ పార్టీల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వచ్చాయని, వారిని ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ మేరకు అనుమతించాలని కోరుతూ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశిస్తామన్నారు. ఎన్నికల్లో గెలుపుపై ధీమా లేని అభ్యర్థులే తరుచుగా ఈవీఎంల విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారని రజత్ కుమార్ వ్యాఖ్యానించారు. -
73.2% రికార్డు పోలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 73.20% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన పోలింగ్కు సంబంధించిన పూర్తి పోలింగ్ శాతాల వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ శనివారం రాత్రి ప్రకటించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 67.7% పోలింగ్ జరిగిందని శుక్రవారం రాత్రి ప్రాథమిక అంచనాలను ప్రకటించారు. కాగా.. 2014 శాసనసభ ఎన్నికల్లో నమోదైన 69.5% పోలింగ్తో పోల్చితే ఈసారి ఎన్నికల్లో 3.7% పోలింగ్ పెరిగింది. అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65% నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆలేరు (91.33%), మునుగోడు (91.07%), నర్సాపూర్, భువనగిరి (చెరో 90.53%), నర్సంపేట (90.06%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. చార్మినార్లో అత్యల్పంగా 40.18% పోలింగ్ జరగ్గా ఆ తర్వాతి స్థానాల్లో 41.24 శాతంతో యాకుత్పురా, 42.74 శాతంతో మలక్పేట, 44.02 శాతంతో నాంపల్లి, 45.61 శాతంతో జూబ్లీహిల్స్, 46.11 శాతంతో చాంద్రాయణగుట్ట, 49.05 శాతంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే 90.95% పోలింగ్తో యాదాద్రి–భువనగిరి జిల్లా తొలిస్థానంలో నిలవగా 48.89% ఓటింగ్తో హైదరాబాద్ జిల్లా చివరన నిలిచింది. అత్యల్ప ఓటింగ్ స్థానాలన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి . 103 స్థానాల్లో పెరిగిన ఓటింగ్ ! 2014 శాసనసభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరిగిన ఎన్నికల్లో 103 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది. గతంతో పోల్చితే కేవలం 16 స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ పెరగగా, జీహెచ్ఎంసీతో పాటు ఇతర మరి కొన్ని పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గింది. దేవరకద్ర నియోజకవర్గంలో అత్యధికంగా 99.74% మహిళలు ఓటేసి రికార్డు సృష్టించారు. ఇక్కడ పురుషుల పోలింగ్ శాతం కేవలం 69.32 మాత్రమే కావడం గమనార్హం. మధిరలో పురుషలు అత్యధికంగా 92.54% ఓటేయగా, ఇక్కడి మహిళలు కూడా పురుషులతో పోటాపోటీగా 90.8% ఓట్లు వేయడంతో రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గంగా మధిర నిలిచింది. పురుషులతో పోలిస్తే మహిళలు 44 నియోజకవర్గాల్లో అధికసంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. 32 స్థానాల్లో పురుషులు 85% ఓటు హక్కు వినియోగించుకోగా, 39 చోట్లలో మహిళలు పోలింగ్ 85% కన్నా అధికంగా జరిగింది. అదేవిధంగా ఇతరులు (ట్రాన్స్జెండర్లు) ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోని కేవలం 55 నియోజకవర్గాల్లో వీరు మాత్రమే ఓటు వేయగా, రెండు చోట్ల వారి ఓట్లు లేవు. మిగిలిన 62 స్థానాల్లో ఓటు నమోదు చేసుకున్నప్పటికీ ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు రాలేదు. బహదూర్పుర, బోథ్, మానకొండూరు, నియోజకవర్గాల్లో ట్రాన్స్జెండర్లు 100% ఓటు వేయడం గమనార్హం. -
పోలింగ్ శాతంపై ఈసీ అధికారిక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి శుక్రవారం జరిగిన ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతంతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్ నమోదయిందని ఆయన వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా పోలింగ్ నమోదైనట్టు చెప్పారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 శాతం నమోదవగా ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల పోలింగ్ 72.54 శాతం కాగా.. మహిళల పోలింగ్ 73.88 గా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో పురుషుల ఓటింగ్ శాతం కంటే మహిళల ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా (85.97 శాతం) పోలింగ్ నమోదవగా.. చార్మినార్ నియోజకవర్గంలో అత్యల్పంగా (40.18 శాతం) పోలింగ్ నమోదయిందన్నారు. జిల్లాల వారిగా ఓటింగ్ శాతం ఆదిలాబాద్- 83.37 కరీంనగర్- 78.20 మంచిర్యాల- 78.72 పెద్దపల్లి - 80.58 కామారెడ్డి- 83.05 నిర్మల్ - 81.22 నిజామాబాద్- 76.22 జగిత్యాల- 77.89 రాజన్న సిరిసిల్ల- 80.49 సంగారెడ్డి- 81.94 మెదక్- 88.24 సిద్దిపేట- 84.26 రంగారెడ్డి- 61.29 వికారాబాద్- 76.87 మేడ్చల్, మల్కాజ్గిరి- 55.85 మహబూబ్నగర్- 79.42 నాగర్ కర్నూలు- 82.04 వనపర్తి- 81.65 జోగులాంబ- 82.87 నల్గొండ- 86.82 సూర్యాపేట- 86.63 యాదాద్రి భువనగిరి- 90.95 జనగామ- 87.39 మహబూబాబాద్- 89.68 వరంగల్ అర్బన్- 71.18 జయశంకర్ భూపాలపల్లి- 82.31 భద్రాద్రి కొత్తగూడెం- 82.46 ఖమ్మం- 85.99 వరంగల్ గ్రామీణం- 89.68 హైదరాబాద్- 48.89 -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చిత మైన గణాంకాలను శనివారం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్కుమార్ పేర్కొన్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని లైన్లలో నిలబడిన ఓటర్లకు అదనపు సమయంలో ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు. గంట ఆలస్యంగా ప్రారంభం... షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 4 లేదా 5 గంటల వరకు పోలింగ్ జరగా ల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును పరీక్షించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. మాక్ పోలింగ్లో ఈవీ ఎంలతోపాటు ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా... చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగైదు చోట్ల స్వల్ప ఘర్షణలతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం6 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్ అధికారులు, 37,556 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 1,50,023 మం ది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన అనంత రం పోలింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మ« ధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. భారీగా ఓట్లు గల్లంతు! ఓటర్ల జాబితాలో అడ్డగోలుగా పేర్లను తొలగించడంతో శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది పౌరు లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. ఓటర్ల జాబితాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి 2015లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్ఈఆర్) కార్యక్రమంలో భాగంగా బోగస్ ఓటర్ల పేరుతో దాదాపు 20 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల పేర్ల తొలగింపులో పొరపాట్లు జరిగాయని సీఈఓ రజత్కుమార్ అంగీకరించారు. ఓటు హక్కు వియోగించుకున్న ప్రముఖులు -
పొరపాటైంది.. క్షమించండి!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించనందున ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన లక్షల మందికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ క్షమాపణలు కోరారు. ఓటు కోల్పోయామన్న బాధను చాలా మంది తనకే స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారన్నారు. 2015లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్ఈఆర్) కార్యక్రమంలో పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండానే ఓట్లను తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరించారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా పలుమార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామని, అయితే వీరెవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఓటేయలేకపోయారన్నారు. రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని, జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని ప్రచారోద్యమం సైతం నిర్వహించామన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశించామన్నారు. వ్యక్తిగతంగా గుత్తా జ్వాలకు క్షమాపణలు తెలియజేశారు. ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయిన వారు మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. 2014లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 67 శాతం వరకు నమోదైందన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో దాదాపు 2లక్షల మంది అధికారులు, సిబ్బంది, 50 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రీ–పోలింగ్ ఉండకపోవచ్చు ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రానందున.. రీ–పోలింగ్కు అవకాశం ఉండకపోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య గోదాములకు తరలిస్తున్నామన్నారు. గోదాముల్లో 24గంటల విద్యుత్ సరఫరాతో పాటు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు (రూ.117.2కోట్లు, మద్యం (5.4లక్షల లీటర్లు), ఇతర కానుకలు (రూ.9.2కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు మాదక ద్రవ్యాలు) పట్టుబడ్డాయన్నారు. దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.138 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 4292 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ.. పరిష్కరించామన్నారు. చాలా వరకు మానవ తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని రజత్కుమార్ పేర్కొన్నారు. పనిచేయని ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను సాధ్యమైనంత త్వరగా మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్ను ప్రారంభించామని రజత్ కుమార్ తెలిపారు. -
పల్లెకు తరలిన పట్నం!
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో ఓట్ల పండుగకు పట్నంవాసులు భారీగా తరలివెళ్లారు. నగరం, జిల్లా కేంద్రాలు, ఆయా పట్టణాల నుంచి భారీగా వాహనాలు రోడ్డు మీదకు రావడంతో రద్దీ నెలకొంది. తెలంగాణలోని అన్ని టోల్గేట్ల వద్ద వాహనాలు భారీగా బారులుతీరాయి. వరుస సెలవులు కావడంతో కొందరు ముందే వెళ్లినప్పటికీ, శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్తోపాటు సొంతవాహనాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి. స్పందించిన ఈసీ.. నిజామాబాద్, బెంగళూరు, విజయవాడ, వరంగల్ వెళ్లే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో మొత్తం 13 టోల్గేట్లు ఉన్నాయి. కరీంనగర్ రాజీవ్ రహదారిపై 3, నార్కట్పల్లి– గుంటూరు మధ్యలో మరో 2 టోల్గేట్లు ఉన్నాయి. వరుస సెలవులు రావడంతో నగరం నుంచి జిల్లాలకు వాహనాలు పోటెత్తాయి. ఉదయం 9 నుంచి 11 గంటలకల్లా టోల్గేట్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. విషయం ఎన్నికల సంఘానికి చేరడంతో సీఈవో రజత్కుమార్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. వెంటనే జోషి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఎన్హెచ్ఏఐ అధికారులు టోల్గేట్ల వద్ద రద్దీని నియంత్రించారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా చేశారు. ఆర్టీసీలో ఎడతెగని రద్దీ.. ప్రజలు ఓట్లేసేందుకు భారీగా సొంతూళ్లకు కదలడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్లు కిటకిటలాడాయి. గురువారం అర్ధరాత్రి మొదలైన రద్దీ శుక్రవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగడం గమనార్హం. గురువారంరాత్రి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు అధికంగా ప్రజలు తరలివెళ్లారు. దీంతో జేబీఎస్ రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బస్సులులేవని కొందరు ఆందోళనకు దిగారు. శుక్రవారం మాత్రం వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండకు అధికంగా ప్రయాణించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు బస్సులు వేయడంతో ప్రయాణికులు శాంతించారు. పోలింగ్ సమయాల్లో ఈ స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు వ్యాఖ్యానించారు. గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా 1,200 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘానికి దాదాపు 2,000 బస్సుల వరకు పంపారు. రోజూ బస్సుల్లో 98 లక్షల మంది ప్రయాణం సాగిస్తారు. గురువారం అదనంగా 80,000 మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఇదే రద్దీ కొనసాగకపోవడం గమనార్హం. ఒకరోజు ఆదాయం రూ.12 కోట్లు కాగా, గురు, శుక్రవారాల్లో దాదాపు రూ.కోటి వరకు అదనంగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటికి వెళ్లాలన్న నగరవాసుల అవసరాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. కిక్కిరిసిన రైళ్లు! తెలంగాణలో వివిధ జిల్లాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి ఉదయంపూట బయల్దేరిన రైళ్లు కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయకపోవడంతో గురువారంరాత్రి, శుక్రవారం ఉదయం రైళ్లు రద్దీగా కిటకిటలాడాయి. చార్జీలు పంచిన నేతలు, ప్రత్యేక వాహనాలు హైదరాబాద్, జిల్లాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వాళ్లందరికీ నేతలు బస్చార్జీలు పంచారు. మరికొందరు అల్వాల్, బాలానగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి తమ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చాలా ముందస్తుగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేతలు ప్రజలను సొంతూళ్లకు తరలించారు. -
పోలింగ్కు సర్వం సిద్ధం: ఈసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు శుక్రవారం జరగనున్న తొలి సాధారణ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ సాగేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్ కుమార్ నేతృత్వంలో పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. సీసీటీవీలు, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. మల్కాజిగిరిలో 42 మంది.. బాన్సువాడలో ఆరుగురే ఈ ఎన్నికల్లో 1,39,05,811 మంది మహిళా ఓటర్లు, 1,41,56,182 మంది పురుష ఓటర్లు, 2,691 మంది ఇతర ఓటర్లు కలిపి మొత్తం 2,80,64,684 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడు స్థానాలు సహా మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలో 1,681 మంది పురుష, 139 మంది మహిళలు కలిపి మొత్తం 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి 119, కాంగ్రెస్ నుంచి 99, బీజేపీ నుంచి 118, సీపీఐ నుంచి 03, ఎన్సీపీ నుంచి 22, బీఎస్పీ నుంచి 107, టీడీసీ నుంచి 13, ఎంఐఎం నుంచి 8 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారికి అదనంగా రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల నుంచి 631 మంది, 674 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 25 స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండగా మిగిలిన చోట్లలో ప్రధానంగా అధికార టీఆర్ఎస్, విపక్షాల ప్రజాకూటమి అభ్యర్థుల మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి అతితక్కువగా ఆరుగురు మాత్రం బరిలో నిలిచారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 శాసనసభ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈసీ పోలింగ్ నిర్వహించనుంది. 55,329 ఈవీఎంలు సిద్ధం... పోలింగ్ కోసం ఎన్నికల సంఘం 55,329 ఈవీఎంలు, 39,763 కంట్రోల్ యూనిట్లు, 42,751 వీవీప్యాట్లను ఏర్పాటు చేసింది. 1,50,023 మంది పోలింగ్ అధికారులను నియమించింది. దీంతోపాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా భద్రత కోసం భారీగా పోలీసులను మోహరించింది. 30 వేల మంది రాష్ట్ర పోలీసులు, 18,860 మంది పొరుగు రాష్ట్రాల పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. 32,574 పాత పోలింగ్ కేంద్రాలు, 241 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 32,815 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 3,478 పోలింగ్ కేంద్రాల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించనుంది. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ట్యాబ్స్, ల్యాప్టాప్లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటేసేందుకు లైనులో నిలబడి ఉండే ఓటర్లందరికీ ఓటేసేందుకు అవకాశం కల్పించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైన్లలో నిలబడి ఉండే వ్యక్తులకు పోలింగ్ అధికారులు టోకెన్లు ఇవ్వనున్నారు. పోలింగ్ సమయం ముగిశాక పోలింగ్ కేంద్రానికి చేరుకునే వ్యక్తులకు ఓటేసేందుకు అవకాశముండదు. ఈ నెల 11న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనుండగా మొత్తం ఎన్నికల ప్రక్రియ 13వ తేదీతో ముగియనుంది. పటిష్ట బందోబస్తు, నిఘా ఏర్పాట్లు... పోలింగ్ రోజు ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో 446 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 448 స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, 126 సహాయ వ్యయ పరిశీలకులు, 224 వీడియో నిఘా బృందాలు, 133 వీడియో పరిశీలక బృందాలు, 123 అకౌంటింగ్ బృందాలు నిరంతరం పని చేయనున్నా యి. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన 68 మం ది సాధారణ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు శాసనసభ ఎన్నికల్లో 4,57,809 మంది దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు విని యోగించుకునేలా ఎన్నికల సంఘం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 60,012 మంది అంధ ఓటర్ల కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో ఓట రు గుర్తింపు కార్డులు, ఓటరు స్లిప్పులను జారీ చేసింది. 2,52,790 మంది ఇతర వికలాంగుల ను ఇళ్ల నుంచి పోలింగ్ కేంద్రాలను తరలించడానికి ఆటోలను వినియోగిస్తోంది. పోలింగ్ కేం ద్రాల వద్ద ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచడంతోపాటు పోలింగ్ కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద ర్యాంపులను ఏర్పాటు చేసింది. -
ఓటరు కార్డు లేకున్నా.. ఇవుంటే చాలు!
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ బూత్ల వారీగా ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. అదేవిధంగా తెలంగాణ ఎన్నికలకు సర్వంసిద్దమని వివరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతీ ఓటరు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారని వివరించారు. ఓటరు గర్తింపు కార్డు లేని వారు12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశాన్ని కల్పించామన్నారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో పలు అంశాలపై ఆయన చర్చించారు. ఓటరు కార్డు లేదని, ఓటరు స్లిప్పులు రాలేదని ఓటర్లు గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 12 రకాల ఇతర ఫోటో గుర్తింపు కార్డులతో ఓటు వేయవచ్చని ఆయన తెలిపారు. వీటిలో ఏదో ఒకటి తమ వెంట తీసుకెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులు.. పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్పుస్తకాలు పాన్ కార్డు ఆధార్కార్డు ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డ్ కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్ స్లిప్ ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ఎన్పీఆర్కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డ్ -
135 కోట్లు సీజ్.. 250 కేసులు నమోదు
సాక్షి, హైదరాబాద్: పోలింగ్ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్ కుమార్ తెలిపారు. ఓటరు ఐడీకార్డులేనివారు.. ప్రభుత్వం గుర్తించిన 12 గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చని పేర్నొన్నారు. ఇప్పటికే వంద శాతం ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. గురువారం ఎన్నికల పోలింగ్, బందోబస్తు, పోలింగ్ కేంద్రాలు తదితర అంశాలపై రజత్ కుమార్ మీడియా సమావేశంలో చర్చించారు. మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరుగుతుందని, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలవరకు పోలింగ్ జరుగుతుందన్నారు. నగదు, మద్యం పంపిణీపై చాలా ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. ఇప్పటివరకు 135 కోట్లు సీజ్ చేశామని, 250 కేసులు నమోదు చేశామని తెలిపారు. 446 పోలింగ్ పర్యవేక్షణ బృందాలు సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కొత్తగా 20 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. గుర్తింపు కార్డులు ఇవే.. పాస్పోర్ట్, డ్రైౖవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్పుస్తకాలు, పాన్కార్డు, ఆధార్కార్డు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్కార్డ్, కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, ఫొటోతో ఉన్న పెన్షన్ ధ్రువీకరణ పత్రం, ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్ స్లిప్, ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, ఎన్పీఆర్కింద ఆర్జీఐ జారీ చేసిన స్మార్ట్కార్డ్. -
ఇక ప్రచారంఆపండి: సీఈఓ
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిందని, బుధవారం సాయంత్రం నుంచి బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్ తెలిపారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4.30 గంటల నుంచి, మిగిలిన చోట్లలో సాయంత్రం 5 గంటల నుంచి 48 గంటలు నిషేధం అమల్లో ఉంటుందన్నారు. ఈ నిషేధిత సమయంలో బహిరంగ సభల నిర్వహణ, ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టీవీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయటం, అలాగే ఎలక్ట్రానిక్ ప్రచార సాధనాల్లో ఒపీనియన్ సర్వేలు, ఇతరత్రా ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను ప్రసారం చేయటం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని వెల్లడించారు. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా వినోదానికి సంబంధించిన కచేరీలు, స్టేజ్ కార్యక్రమాల వంటివి కూడా అనుమతించబోమన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి చట్ట ప్రకారం రెండేళ్ళ వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా ఈ రెండూ విధించే అవకాశముందని వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సీఈఓ జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
ఎన్నికల జప్తులో ఆల్టైమ్ రికార్డ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పట్టుబడిన నగదు, మద్యం ఆల్టైమ్ రికార్డు సృష్టిస్తోంది. పోలింగ్కు కేవలం 48 గంటలు మిగిలి ఉండగా, పట్టుబడిన నగదు, మద్యం, బహుమతుల పేరిట పంపిణీ చేయడానికి ఉద్దేశించిన వస్తువుల విలువ రూ.129.46 కోట్లకు చేరుకుంది. పోలీస్, ఆదాయపు పన్ను, ఎక్సైజ్ అధికారుల నిఘా పటిష్టంగా ఉండడంతో వారి కన్నుగప్పడం ఉల్లంఘనులకు కష్టమవుతున్నదని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు రూ.109.67 కోట్లకు చేరుకోగా, రూ.10.87 కోట్ల విలువచేసే 5.13 లక్షల లీటర్ల మద్యాన్ని పోలీసు, ఇతర నిఘా బృందాలు జప్తు చేశాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల కింద ఇప్పటివరకు 275 ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే, అత్యధికంగా రూ.8.92 కోట్ల విలువ చేసే బంగారు, వెండి, గంజాయి, గుట్కా, పొగాకు వంటివి రవాణా సందర్భంగా కానీ, భద్రపరచిన ప్రదేశాల నుంచీ కానీ జప్తు చేశారు. వీటిలో అభ్యర్థులు లేదా పార్టీలు పంచడానికి తీసుకెళ్తున్న రూ.1.63 లక్షల విలువ చేసే 1.18 కిలోల వెండి, 39.8 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. అభ్యర్థులను ప్రలోభపెట్టేవాటిలో నగదు, మద్యం ప్రధాన పాత్ర పోషిస్తున్నందున వాటి కదలికలే ఎక్కువగా నమోదవుతున్నాయి. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతరాయం కలిగించే అవకాశముందన్న కారణంతో అనుమానితులందరినీ చట్ట ప్రకారం ముందుగానే అధీనంలోకి తీసుకోవడం జరిగిందనీ, ఎన్నడూ లేనంతగా నాన్–బెయిలబుల్ వారంట్లు జారీచేయడం జరిగిందనీ, ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి 2,204 చోట్ల నాకాబందీ, చెక్పోస్ట్లు, నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 17,779 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా 96,561 మందిని బైండోవర్ చేయడం, 8,688 ఆయుధాలను డిపాజిట్ చేసుకోవడం, 18 ఆయుధాల లైసెన్సుల రద్దు, 1,042 ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కేసుల నమోదు, 11,806 నాన్ బెయిలబుల్ వారంట్లను జారీ చేయడం జరిగిందని తెలిపారు. గోడలు పాడుచేయడంవంటి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 2,77,775 కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరిగిందని రజత్కుమార్ తెలిపారు. -
మూగబోయిన మైకులు.. అమల్లోకి ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్ : రెండు నెలలకు పైగా నేతల ప్రచార హోరుతో వేడెక్కిన తెలంగాణ.. ఎన్నికల ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. 119 నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన 1,821 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2 కోట్ల 80 లక్షల, 64 వేల ఓటర్లు తమ తీర్పుతో తేల్చనున్నారు. సంక్షేమ పథకాలు తమ అభివృద్ధే నినాదంగా అధికార పార్టీ టీఆర్ఎస్ బరిలోకి దిగగా.. కేసీఆర్ను గద్దే దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో మహాకూటమి ప్రచారం సాగించింది. గులాభి అధినేత కేసీఆర్ గజ్వేల్లోనే ప్రచారం ప్రాంభించి అక్కడే ముగించగా.. మహాకూటమి ఆలంపూర్లో ప్రారంభించి.. కోదాడ బహిరంగ సభతో ముగించింది. ప్రచార పర్వం ముగియడంతో.. ఎన్నికల కమిషన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు లేదా భారీ జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ హెచ్చరించారు. బహిరంగ సభలు, ఎన్నికల ఊరేగింపులు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం నిర్వహించడం.. మొబైల్స్ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్ సర్వేలు వెల్లడించడం నిషిద్దమని స్పష్టం చేశారు. మావోయిస్ట్ ప్రభావిత 13 నియోజక వర్గాలు.. సిర్పూర్, చెన్నూర్(ఎస్సీ), బెల్లంపల్లి(ఎస్సీ), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్టీ), మంథని, భూపాలపల్లి, ములుగు(ఎస్టీ), పినపాక(ఎస్టీ), ఎల్లందు (ఎస్టీ), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్టీ), భద్రాచలం (ఎస్టీ)లలో ఓ గంట ముందు నుంచే నిషేధం విధించమన్నారు. పోలింగ్ జరిగే ప్రాంతాలల్లో వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాలకు కూడా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మొత్తం ఓటర్లు 2,80,64,684 మహిళా ఓటర్లు 1,39,05,811, పురుష ఓటర్లు 1,41,56,182 119 నియోజకవర్గాలు, బరిలో 1,821 మంది అభ్యర్థులు అత్యధికంగా మల్కాజ్గిరి నుంచి 42 మంది అభ్యర్థులు అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఆరుగురు అభ్యర్థులు ఎన్నికల విధుల్లో సుమారు 30వేల మంది పోలీసులు ఈవీఎంలు-55,329, వీవీప్యాట్స్-42, 751, 39,763 కంట్రోల్ యూనిట్లు పెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి 5,75,541 మంది ఓటర్లు చిన్న నియోజకవర్గం భద్రాచలం: 1,37,319 మంది ఓటర్లు -
ష్.. అంతా గప్చుప్ !
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు బుధవారంతో ముగియనుంది. రాష్ట్రంలోని 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలతో, మిగిలిన 106 చోట్లలో సాయంత్రం 5 గంటలతో ప్రచార కార్యకలాపాలు ముగియనున్నాయి. గత నెల 12న రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగిపోయిన మైకులు మూగబోనున్నాయి. ర్యాలీలు, బహిరంగ సభలకు ఫుల్స్టాప్ పడనుంది. పోలింగ్ ముగింపు సమయానికి సరిగ్గా 48 గంటల ముందు అంతటా ప్రశాంతత నెలకొని ఉండాలని స్పష్టమైన నిబంధనలుండటమే ఇందుకు కారణం. బుధవారం సాయంత్రం తర్వాత అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించడం నిషిద్ధమని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ మంగళవారం స్పష్టం చేశారు. సిర్పూర్, చెన్నూర్(ఎస్.సి), బెల్లంపల్లి(ఎస్.సి), మంచిర్యాల్, అసిఫాబాద్ (ఎస్.టి), మంథని, భూపాలపల్లి, ములుగు (ఎస్.టి), పినపాక(ఎస్.టి), ఎల్లందు (ఎస్.టి), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఎస్.టి), భద్రాచలం (ఎస్.టి)ల్లో బుధవారం సాయంత్రం 4 గంటల నుండి నిషేధం అమల్లోకి వస్తుందన్నారు. మిగతా నియోజక వర్గాల్లో సాయంత్రం 5 గంటల నుండి నిషేధం అమలవుతుందన్నారు. ఈ సమయంలో బహిరంగ సభల నిర్వహణ, దానిని ఉద్దేశించి మాట్లాడటం, పాల్గొనడం లేదా ఎన్నికల ఊరేగింపులు తీయడం, సినిమాలు, టివీలు లేదా ఇతర పరికరాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారం చేయడం, అలాగే ఎలక్ట్రానిక్ ప్రచారసాధనాలలో ఒపీనియన్ సర్వేల నిర్వహణ, ఇతరత్రా ఎన్నికల సంబంధిత ప్రచార కార్యక్రమాలను ప్రసారంచేయడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు.పోలింగ్ జరిగే ఏ ప్రాంతంలో కూడా వినోదానికి సంబంధించిన కచ్చేరీలు, స్టేజ్ కార్యక్రమాలవంటి వాటికి కూడా అనుమతించేది లేదన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించినవారికి చట్ట ప్రకారం రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశముందని ఆయన వివరించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 126 కింద ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. -
రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి: రజత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : పోలీసులు అదుపులో ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. మంగళవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ దృష్య్టా రేవంత్ నిరసనలకు పిలుపునిచ్చినారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా.. పోలీసులు ముందుస్తుగా మంగళవారం తెల్లవారుజామున ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ అరెస్ట్పై రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలపడం.. ఆయన అభిమానులు కొంత మంది ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో దిగివచ్చిన అధికారులు వెంటనే విడుదల చేయాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. రేవంత్ అరెస్ట్పై హైకోర్ట్ సీరియస్.. రేవంత్ రెడ్డి అరెస్ట్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ఆచూకీ కోసం దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. ఎక్కడ ఉన్నారో వివరాలు ఇవ్వాలంటూ వికారాబాద్ ఎస్పీని ఆదేశించింది. ఏ ఆధారాలతో రేవంత్ను అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీనికి అల్లర్లు జరగవచ్చనే ఇంటలిజెన్స్ నివేదికతోనే రేవంత్ను అదుపులోకి తీసుకున్నామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమాధానమిచ్చారు. దీంతో నివేదిక కాపీని కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు న్యూఢిల్లీ : రేవంత్ రెడ్డి అరెస్టుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ సీనియర్నేత కపిల్ సిబల్ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ను అక్రమంగా తెల్లవారుజామున 3 గంటలకు అరెస్ట్ చేశారని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా పోలీసులు చెప్పలేదన్నారు. ఎన్నికల వేళ భయాందోళనకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా చేసిన ప్రసంగంపై కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసిన ప్రసంగానికి నోటీసులు ఇవ్వాలని, ఎన్నికలు ఉన్న చోట బీజేపీ అధికార దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎన్నికల్లో ధన ప్రవాహం పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ధనప్రవాహం పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.76 కోట్లు సీజ్ చేయగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ.112 కోట్లు పట్టుబడ్డాయి. డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా ఆగడంలేదు, ప్రజల్లో మార్పు వస్తేనే అడ్డుకట్ట సాధ్యమవుతుంది’అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు. ‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతోపాటు ప్రచారక్రమంలో రాజకీయపార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. సీ–విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షణాల్లో పరిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు 6,858 కేసులు నమోదుకాగా 4,967 కేసులు పరిష్కరించాం’అని వివరించారు. సోమవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మీడియాసభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా రావడంతో ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నామని, సాధారణంగా ఎన్నికల ఏర్పాట్లు ఏడాది ముందు నుంచే మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలపై డిక్లరేషన్ తీసుకున్నాం... ఓటర్లజాబితా, ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఎన్నికల ఏర్పాట్లు వంటివి చేపట్టినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు విపరీతంగా పెరుగుతోందని, అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల ఖర్చుపై పరిమితి లేదన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై అఫిడవిట్ కోరామని, డిక్లరేషన్ సైతం తీసుకున్నామని చెప్పారు. మేనిఫెస్టోలోని హామీల అమలుపై చాలెంజ్ చేయొచ్చన్నారు. ఓటరు జాబితాలో 4.32 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, 3.8 లక్షల ఓటర్లు చనిపోవడంతో వారి ఓట్లను తొలగించామని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దు తరువాత ఆర్నెళ్లలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీంతో పార్టీలు, అభ్యర్థుల అఫిడవిట్లు తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ లోతైన విశ్లేషణ చేసే అవకాశం ఉండదన్నారు. ఎన్నికలు, ఫలితాలపై ఇప్పట్నుంచే బెట్టింగ్ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని, పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలు సున్నితమైనవిగా గుర్తించామని, కొడంగల్లో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ఆదేశించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులను పెయిడ్ న్యూస్ కింద బుక్ చేశామని, విచారణలో నిజమని తేలితే ఆ ఖర్చును అభ్యర్థుల ఖాతాలో వేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదు... ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదని, తటస్థంగా వ్యవహరిస్తుందని రజత్కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చామని, ఓటు ఎవరికి వేశామనేది వీవీప్యాట్లో స్పష్టమవుతుందని, ఎవరైనా చాలెంజ్ చేసినప్పుడు దీని ఆధారంగా నిర్ధారిస్తామన్నారు. ప్రచారపర్వంలో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై సి విజిల్ ద్వారా నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారని, ఇందులో 1.41 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 5.70 లక్షలు, అతి తక్కువగా భద్రాద్రి నియోజకవర్గంలో 1.37 లక్షల ఓట్లు ఉన్నాయన్నారు. భద్రాద్రిలోని పలు గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో ఓట్లు తగ్గినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో 4.57 లక్షల మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వారి కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అధికంగా మల్కాజ్గిరిలో 42 మంది, తక్కువగా బాన్సువాడలో ఆరుగురు పోటీలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 32,700 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈసారి 36.5 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఏడోతేదీ సాయంత్రం 5.30 గంటల తర్వాత విడుదల చేయొచ్చన్నారు. -
ఓటేయకపోతే ప్రశ్నించలేరు!
సాక్షి, హైదరాబాద్: ఓటు వేయడంలో నిర్లిప్తత ప్రదర్శించే యువత రేపు ప్రభుత్వం తమ ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని ఎలా ప్రశ్నించగలదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫ్యాప్సీ) సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఒక సదస్సులో మాట్లాడారు. ‘అక్కడి దాకా ఎందుకు... ఓటువేయని వాణిజ్య, వ్యాపార వర్గాలవారు నైతికంగా ప్రభుత్వాల నుండి సానుకూల విధానాలను ఎలా ఆశించగలరో చెప్పండి’అని ప్రశ్నించారు. ‘ఒక ఉత్తరాది రాష్ట్రంలో ఒక అభ్యర్థి కేవలం ఒక్క ఓటు తేడాతో గెలిచి, తరువాత కేంద్రమంత్రి కూడా అయ్యారు. అంటే, ఈ దేశ ప్రజల తలరాతను రాసే నిర్ణయాలు తీసుకునే యంత్రాంగంలో ఒక భాగమయ్యారు. ఒక్క ఓటు కూడా విలువైనదే. అందుకే యువతీయువకులను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను ... అన్నివర్గాలను తప్పనిసరిగా ఓటేయండని ప్రాధేయపడుతున్నాం. కుంటిసాకులు చెప్పి పట్టణ, నగరాల్లోని ఎగువ మధ్య తరగతివారు, చదువుకున్నవారు, సంపన్న వర్గాలవారు ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పరిణామం కాదు. మీరు వేసే ఓటు అందరి బాగు కోసం ఉద్దేశించినది. యువతగా భవిష్యత్తులో ఎక్కువపాత్ర మీదే కదా, మీ నుంచే కొత్త తరం నాయకులు, ఆదర్శ నాయకులు పుట్టుకు రావాలి కదా !’’అని అన్నారు. ‘‘మీలో ఎంత మందికి ఓటు ఉంది, చేతులెత్తండి.’’అన్నప్పుడు కొద్దిమంది మాత్రమే చేతులెత్తడంతో ఆయన కొంత నిరుత్సాహపడ్డారు. జనవరిలో ఓటు నమోదు చేసుకోవచ్చు... ‘కొత్తవారికి ఓటు హక్కు నమోదు చేయడానికి ఎంతో కృషి చేశాం. ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. గడువులు కూడా పొడిగిస్తూ ఎన్నోసార్లు అవకాశం కల్పించాం. ఫరవాలేదు. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. వచ్చే జనవరిలో ఓటర్ల జాబితా సవరణ జరిగినప్పుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదుకండి. గత సెప్టెంబర్ 6 నుంచి నవంబర్ 19వ తేదీల మధ్య దాదాపు 20 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. వీరు రేపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలరు కూడా. ప్రజాస్వామ్యం పదికాలాలపాటు పరిఢవిల్లాలంటే ఇటువంటి మార్పు, ఈ చైతన్యం పెద్దఎత్తున రావాలి.’’అని రజత్కుమార్ ఉద్బోధించారు. పోటీలో ఉన్న అభ్యర్థులెవరూ నచ్చకపోతే ‘నోటా’బటన్ అయినా నొక్కితే, మీ నియోజకవర్గ అభ్యర్థికి మెజారిటీ తగ్గి, తన మీద ప్రజల విశ్వాసం తగ్గిపోతున్నదని తెలుసుకుని జాగ్రత్తపడతారని, బాధ్యతగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. అభ్యర్థుల్లో కూడా మంచివారిని వడగట్టడం కోసం, వారెటువంటివారో ఓటర్లు తెలుసుకోవడం కోసం నేరచరిత్ర ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా పత్రికల్లో, వార్తా చానల్లో ఒకటికి మూడుసార్లు బాగా కనిపించేలా ప్రకటనలు ఇవ్వాలని ఆదేశించామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు సి.ఎ.అరుణ్ లుహరుకా, ఉపాధ్యక్షుడు రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఓటేయండి.. లేదా ఉన్నవారితో వేయించండి
సాక్షి, హైదరాబాద్: ‘మీ ఓటుకోసం డబ్బిస్తున్నారా, అక్కడికక్కడే తిరస్కరించండి. మీకు ఓటు లేదా...మీరు ఎలాగూ ఓటేసే మహత్తర అవకాశం పోగొట్టుకుంటున్నారు కదా, ఓటుండీ వేయకుండా ఉన్న కనీసం మరో ఐదుమంది వెంటపడి వారి చేత ఓటు వేయించండి. మీ నేతలు మీ మాట వినాలనుకుంటే..ఓటు వేయండి. ఎక్కువ మంది వెళ్లి ఓటేస్తేనే... వారు మీ అవసరాలేమిటో శ్రద్ధగా తెలుసుకోగలుగుతారు. పెద్ద చదువులు చదివి పెద్ద నగరాల్లో ఉంటూ ఓ అరగంట వెచ్చించి ఓటు వేయకపోతే ఏమ వుతుందో తెలుసా...ప్రజాస్వామ్యం బక్కచిక్కిపోతుంది. పోటీలో ఉన్న ఏ అభ్యర్థీ లేదా ఏ రాజకీయ పార్టీ మీకు నచ్చలేదా... వెళ్లి కనీసం ‘నోటా’నొక్కి రండి. గెలిచిన అభ్యర్థి మెజారిటీ తగ్గినందుకు తలదించుకుంటాడు’’ ఇవీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ భావోద్రేకంతో పలికిన పలుకులు. ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన ఆర్థిక కమిటీ, ఉస్మానియా పట్టభద్రుల సంఘం శనివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన ‘ఓటర్ల చైతన్య కార్యక్రమం’’ఇందుకు వేదికయింది.ముఖ్య అతిథి గా హాజరైన రజత్కుమార్ ప్రజాస్వామ్య క్రతువులో ప్రతీ పౌరుడూ పాల్గొనాలనీ, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగును ఓటింగ్కు ప్రోత్స హించాలనీ చెబుతూ...‘‘ఎవరయినా డబ్బిస్తే, అక్కడికక్కడే వద్దని చెప్పేయండి’’అం టూ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మీరు గమని స్తున్నారో లేదో తెలి యదు. ఎన్నికల్లో డబ్బు, మాఫియాలను లేకుండా చేయడానికి మేము అహోరాత్రాలు కష్టపడుతున్నాం. సమైక్య రాష్ట్రంలోనే మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగిసేలోగా పట్టుబడిన నగదు కంటే ఇప్పుడు కేవలం తెలంగాణలో పోలింగ్కు ఇంకా ఐదురోజులుండగానే చిక్కిన మొత్తం రు.104 కోట్లు, అంటే అప్పటికంటే రు.28కోట్లు అధికం. పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోండి. డబ్బు, మాఫియాలు ఎలా చెలరేగుతున్నాయో చూడండి.. కారణం ...మా శ్రమకు మీ సహకారం , మీ పాత్ర తోడు కాకపోవడమే.’’అని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేస్తేనే నేతలు మీ మాట వింటారు ‘‘ఓటర్లు ఎంత ఎక్కువ సంఖ్యలో వెళ్లి ఓటు వేస్తే నేతలు మీ మాట అంతగా వింటారు. వినక తప్పదు. వారు కోరుకునేది కూడా మీ మనసులను గెలవాలనే. అలాగే ఓటు వేసేముందు మీరు గందరగోళం పడకుండా, ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి వీలుగా 48 గంటలు అన్ని రకాల ప్రచారాలు ఆపేయిస్తాం. మీరు కులం, డబ్బు వంటి అంశాలు కాకుండా అభ్యర్థులు, రాజకీయపార్టీల విధానాలు, హామీలు, విశ్వసనీయత ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి’’అని చెప్పారు. మన ఎన్నికల కమిషన్కు నీరాజనాలు ‘‘సంతోషించాల్సిన విషయం, ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే అక్షరాస్యత తక్కువగా ఉండే మారుమూల పల్లెల్లో 80–90% ఓటింగ్ నమోదవుతుంటే, హైదరాబాద్, ముంబయి, ఢిల్లీ వంటి నగరాల్లో సగటున 50–55% ఉంటున్నది. ఇది ఎన్నికల చిత్రం. కానీ బయట దేశాల్లో మన ప్రజాస్వామ్యానికి ఎక్కడలేని గుర్తింపుంది. ఎన్నికల కమిషన్ విశ్వసనీయతకు ప్రపంచం నీరాజనాలర్పిస్తోంది. మన ఎన్నికల నిర్వహణ విధానం తమకూ చూపాలని బ్రెజిల్ తదితర దేశాలు మనకు ఆహ్వానిస్తున్నాయి.మన ఈవిఎంలు, వీవీప్యాట్లను చూసి అమెరికా, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు ఆశ్చర్యపోతున్నాయి.అక్కడ ఇటువంటి యంత్రాలకు చట్టసమ్మతి లేదు. ఇక ఈసారి దివ్యాంగులకు చక్కని సౌకర్యాలు కల్పించాం’’ అని అన్నారు. హామీలకు ఆధారాలు కోరాం.. మేనిఫెస్టోల్లో ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో ఆధారసహితంగా సమాచారం సమర్పించాలని కోరాం. ఓటర్ల జాబితా తయారీ స్ధాయినుండే బోగస్ ఓటర్లను తొలగించడం వంటి ప్రక్షాళన పనులు చేపట్టాం. బూత్ల దగ్గర కూడా అక్రమాలు జరగకుండా పారదర్శకంగా నిర్వహించడానికి కెమెరాలు పెట్టి, ప్రత్యక్ష ప్రసారలు చేపట్టాం. ఇవే కాదు ఇంకా చాలా చర్యలు తీసుకుంటున్నాం ’అని వివరంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక కమిటీ అధ్యక్షుడు బి. ప్రభాశంకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాస రావు, ఉస్మానియా పట్టభద్రుల సంఘం అధ్యక్షుడు డా.డి.గంగాధర్ రావు, కన్వీనర్ అశ్విన్ మార్గం పాల్గొన్నారు. -
ప్రకటనలకు ఈసీ అనుమతి తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శాటిలైట్/కేబుల్ టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా వంటి ప్రచార సాధనాల్లో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, స్టార్ క్యాంపైనర్లు, వారి తరఫున ఇతరులు ఇచ్చే ప్రకటనల ప్రచురణకు, ప్రసారాలకు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి పొందాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మీడియా సంస్థలు కూడా రాజకీయ ప్రకటనలను ప్రచురించడం లేదా ప్రసారం చేసే ముందు సర్టిఫికెట్ ఉందో లేదో సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే కేబుల్ నెట్వర్క్ (రెగ్యులేషన్) చట్టం ప్రకారం ప్రచురణ, ప్రసార సామగ్రిని జప్తు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీని రాష్ట్ర, జిల్లా స్థాయి ల్లో ఏర్పాటు చేశామన్నారు. ఇది చెల్లింపు వార్తలకు సంబంధించిన ఫిర్యాదులను కూడా పరిశీలించి ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపుతుందన్నారు. చర్య ల నిమిత్తం తగు సిఫార్సులు చేస్తుందన్నారు. మీడియా నిబంధనల అమలు విషయంలో కూడా ఎన్ని కల కమిషన్కు సహకరిస్తుందన్నారు. రాజకీయ ప్రకటనలు ప్రచురించేటప్పుడు ‘అడ్వర్టైజ్మెంట్ లేదా ప్రకటన’ అని తప్పనిసరిగా ప్రచు రించాలని లేదా ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
మా ప్రాధాన్యతలు ఇవే: రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఓటింగ్ రోజైన డిసెంబరు 7వ తేదీన, దేశ రక్షణ, భద్రతకు సంబంధించిన సంస్థలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ సెలవు పాటించేల్సిందేననీ, ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, సంస్థలకు, విద్యాలయాలకు సెలవు ప్రకటించామని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన సీఈఓ, ప్రముఖులతో గురువారం సైబరాబాద్లో జరిపిన ఇష్టాగోష్ఠి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘దేశం, ప్రజాస్వామ్యం.. వీటిదే మొదటి ప్రాధాన్యతగా ఉండాలనీ, మీరంతా మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలి’’ అని ఉద్బోధించారు. విదేశీ ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా అక్కడి వారి పనివేళలను అనుసరించడం, అలాగే కీలకమైన వ్యాపారపరమైన కార్యకలాపాలు కూడా నిర్వర్తించాల్సి ఉన్నందున, ఉద్యోగులు అన్ని సెలవు రోజుల్లో కూడా పనిచేయాల్సి ఉంటుందనీ, అందువల్ల రోజంతా పూర్తిగా సెలవు ప్రకటించకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్.సి.ఎస్.సి) ప్రతినిధులు కోరినప్పడు డా. రజత్ కుమార్ పైవిధంగా స్పందించారు. అయితే పౌరులుగా తమ బాధ్యత నెరవేరుస్తామని, తమ వద్ద పనిచేసే వారందరూ ఓటు వేసి రావడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు, విధి నిర్వహణ వేళల సడలింపు వంటి చర్యలు తీసుకుంటామని వారు గట్టి హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి చెప్పిన విషయాలతో ఏకీభవిస్తూ అక్కడ హాజరైన వారందరూ చేతులెత్తి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఎంతో ప్రగతి శీలకంగా ఆలోచించే వారు మీ రంగంలో ఉన్నారు. దేశం ముందుకు పోతున్నకొద్దీ మీరు కూడా వ్యవస్థలో భాగస్వాములు కావాలి. ఓటు వేయడంలో మన బాధ్యతను మరిచి - అమెరికా, జపాన్, సింగపూర్లతో పోలిస్తే మన వ్యవస్థ ఘోరంగా ఉందనడం సరికాదనీ, మనం ఓటు వేయకపోతే జరిగే దుష్పరిణామాలకు మొత్తం దేశ ప్రజలందరూ కొన్ని సంవత్సరాలపాటు బాధపడాల్సి వస్తుందని డా.రజత్ కుమార్ హెచ్చరించారు. అలాగే ఐటీ కంపెనీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న వారి సూచనలను ప్రస్తావిస్తూ దేశంలో ప్రతి పౌరుడూ తను ఉంటున్న ఇంటి నుంచీ 500 మీటర్ల దూరం దాటి వెళ్ళే అవసరం లేకుండా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు వారి సూచన పాటించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేసారు. మరి కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను దుర్వినియోగం చేయడం సాధ్యంకాదనీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, దేశ చట్ట పరిమితులకు లోబడి, పేరెన్నికగన్న ప్రభుత్వ సంస్థలు వాటిని తయారు చేశాయనీ, ప్రతి స్థాయిలో వాటిని పలు రకాలుగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సమక్షంలోనే పరీక్షించడం జరుగుతున్నదని ఆయన వివరించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ ప్రారంభ ఉపన్యాసం చేసి అందర్నీ ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్, జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమీషనర్ హరి చందన, కార్మిక విభాగం జాయింట్ కమీషనర్ ఆర్. చంద్రశేఖర్, ఎస్.సి.ఎస్.సి కార్యదర్శి, ఇన్ఫోపీర్స్ సీఈఓ భరణీ కుమార్ ఆరోల్, రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేశ్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లు, సిబ్బంది సన్నద్ధత పట్ల కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఢిల్లీ నుంచి పాల్గొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ ఒ.పి.రావత్ ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రజత్కుమార్ను అభినందించారు. అవసరమయినప్పుడు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసాతోపాటు తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా, జరిగేలా చూడాల న్నారు. అక్రమంగా డబ్బు, మద్యం, మత్తుపదార్థాలు రవాణా కాకుండా చూడాలని, ఓటర్ల అక్రమ తరలింపుపై నిఘా ఉంచాలని రావత్ ఆదేశించారు. ఇదే అంశంపై రజత్కుమార్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఇప్పటికే పటిష్టమైన నిఘా ఉంచామని, తీవ్రవాదుల కార్యకలాపాలు, మద్యం, డబ్బు తదితరాల రవాణాను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, ఈ విషయంలో పొరుగు రాష్ట్రాల అధికారుల నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి పూర్తి సంసిద్ధతతో ఉన్నామన్నారు. శాంతిభద్రతల నిర్వహణలో ముఖ్యంగా నక్సలైట్ల విషయంలో పోలీసుశాఖ అప్రమత్తంగా ఉందని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి చెప్పారు. -
ఆ సీల్డ్ కవర్లో ముఖ్య వివరాలే ఉండొచ్చు
సాక్షి, హైదరాబాద్: కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి ఇంట్లో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ నుంచి ఒక సీల్డ్ కవర్ నివేదిక అందిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్ వెల్లడించారు. అయితే అందులో ఏముందో తానింకా చూడలేదని, దీనిపై వివరాలు మీడియాకు పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ‘సీల్డ్ కవర్ వచ్చింది కాబట్టి అందులో ఏదో ముఖ్యమైన వివరాలే ఉండొచ్చు. లేకుంటే సీల్డ్ కవర్ ఎందుకొస్తుంది..’అని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం రజత్కుమార్ మీడియాతో మాట్లాడారు. మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లు.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ముందుగానే మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటున్నారని వాటిని గుర్తించి ధ్వంసం చేయాలని సీఈఓ ఆదేశించారు. పోలింగ్కు ఒకట్రెండు రోజుల ముందు మద్యం పంపిణీ యోచనలో ఉన్నట్లు సమాచారం ఉందని, దీనిపై ఎక్సైజ్ శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఇక ఇప్పటివరకు నగదు, మద్యం, గంజాయి సహా మొత్తం సీజ్ విలువ రూ.104.41 కోట్లకు చేరిందన్నారు. అందులో నగదు రూ.87.98 కోట్లు ఉందన్నారు. మద్యం విలువ రూ.8.86 కోట్లుగా పేర్కొన్నారు. సీజ్ చేసిన నగదులో రాజకీయ పార్టీలవి కొంత మొత్తమే ఉన్నట్లు నిర్ధారించామని, అందులో అధికార పార్టీ నుంచే అధికంగా ఉందన్నారు. పట్టుబడిన వాటిలో కొందరు ఆధారాలు చూపించి, నగదును వెనక్కి తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే కొంత సొమ్ము మూలాలు తెలియడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో పరిస్థితిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి కూడా సహకారం తీసుకుంటామని చెప్పారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో కొన్ని చోట్ల నక్సలైట్లు, ఇతరత్రా సమస్యలున్నందున ప్రత్యేకంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. అధికారులు, పార్టీలకు ఆ జాబితాలు నకిలీ ఓటర్లు ఓటు హక్కు వినియోగించకుండా అబ్సెన్టి, షిప్టెడ్, డూప్లికెట్ కింద ఒక జాబితాను తయారు చేసి పోలింగ్ అధికారులకు, రాజకీయ పార్టీలకు అందివ్వనున్నట్లు సీఈఓ చెప్పారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరెవరు పోటీలో ఉన్నారనే అభ్యర్థుల జాబితాను సీఈవో వెబ్సైట్లో పెడతామని తెలిపారు. కొందరు అభ్యర్థులు ఈసీ నిబంధనలకు అనుగుణంగా పాస్ఫొటోలు సమర్పించనందునే కొంత ఆలస్యమైందని చెప్పారు. పెరిగిన అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు బ్యాలట్ యూనిట్లు (బీయూ) 4,570 బెంగళూరు నుంచి వస్తున్నాయన్నారు. అభ్యర్థుల వారీగా బీయూలో మీటలను సెట్ చేస్తామన్నారు. ఈవీఎం బ్యాలెట్ ముద్రణ కూడా పూర్తవుతుందన్నారు. వచ్చే ఒకటో తేదీ వరకు ఈ ప్రకియను ముగిస్తామన్నారు. మంత్రి హరీశ్పై చర్యలు తీసుకుంటాం ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా ఈసీ ఆదేశాలకు అనుగుణంగా మంత్రి హరీశ్రావుపై ప్రజాప్రతినిధ్య చట్టం ప్రకారం సెక్షన్ 125 ప్రకారం చర్యలు తీసుకుంటామని రజత్కుమార్ చెప్పారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఒకే పార్టీకి హోర్డింగ్స్కి అవకాశం కల్పిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని, అయితే అందరికీ అవకాశమివ్వాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలిచ్చినట్లు వెల్లడించారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది మీడియాకు స్వేచ్ఛ ఉందని, కొన్ని విషయాల్లో నియంత్రించడం సరికాదని రజత్కుమార్ అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉందని, అయితే సర్వే చేసుకుని ఎవరికెన్ని సీట్లు అనేది మాత్రం పబ్లిష్ చేసుకోవచ్చునని తెలిపారు. దీనిపై మీడియాకు స్వేచ్ఛ ఉందన్నారు. దివ్యాంగుల కోసం చేసిన ఏర్పాట్లపై ఈసీ నుంచి వచ్చిన యాక్సెసబుల్ అబ్జర్వర్స్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామని కితాబిచ్చారన్నారు. గోషామహల్ బీఎల్ఎఫ్ అభ్యర్థి మిస్సింగ్పై పోలీసుల నుంచి నివేదిక కోరామని తెలిపారు. ఓటర్లు స్లిప్పుల వెనుక గూగుల్ మ్యాప్ ఓటరు స్లిప్పుల పంపిణీ మొదలైందని, వాటి వెనక భాగంలో పోలింగ్ కేంద్రానికి దారిచూపే గూగుల్ మ్యాప్ కూడా ఉంటుందని సీఈఓ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం వచ్చే నెల 2 వరకు పంపిణీ చేయాల్సి ఉందని, అయితే అంతకంటే ముందే ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొత్తం నమోదైన 2.80 కోట్ల ఓటర్లలో 19 లక్షల మంది కొత్తగా నమోదు చేసుకున్నారని వివరించారు. ఇందులో దాదాపు 7.5 లక్షల మంది ఓటర్లు 18 నుంచి 19 ఏళ్ల వయస్సు ఉన్నవారేనన్నారు. బూత్ లెవెల్ స్థాయి అధికారులపై అనేక ఫిర్యాదులు అందినప్పటికీ, ఓటరు నమోదు ప్రక్రియ సంతృప్తికరంగానే ముగిసిందని చెప్పారు.