
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంత్రివర్గ విస్తరణకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఈ నెల 20న మంత్రివర్గ విస్తరణ చేపడతామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. ‘విధానసౌధలోని కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఉదయం 10 గంటలకు బీజేపీ శాసన సభాపక్ష భేటీ జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ ఉంటుంది’ అని యడియూరప్ప చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను బట్టి మొత్తం 34 మందిని మంత్రులుగా నియమించేందుకు వీలుంది. అయితే యెడ్డీ తన తొలి కేబినెట్లో 13 మంది మంత్రులను మాత్రమే తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మిగతా ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా జూలై 26న ప్రమాణస్వీకారం చేసిన యడియూరప్ప ఇప్పటివరకూ కేబినెట్లోకి ఎవ్వరినీ తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment