
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ప్రజలు ఐదేళ్లు పాలించమని తీర్పు చెబితే సీఎం కేసీఆర్ వారి ఆకాంక్షలకు విరుద్ధంగా ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని, ఇది ఆయన వైఫల్యమేనని తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ విమర్శించారు. సోమవారం ఆయన సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ వాదులపై దాడులు చేసిన మహేందర్రెడ్డి, కడియం శ్రీహరి, తీగల కృష్ణారెడ్డి లాంటి వాళ్లను కేసీఆర్ టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. కేజీ టు పీజీ విద్య మాటలకే పరిమితమైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల పాఠశాలలను ఈ ప్రభుత్వం మూసివేసిందన్నారు. మహాకూటమిలో కాంగ్రెస్, ఉదమ్యకారుల అభిమానాన్ని చూరగొనేందుకు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలన్నారు. అధికారం దక్కాలంటే ఆ పార్టీ కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. 1969 ఉద్యమకారులకు ఉచిత ఆరోగ్య బీమా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు జిల్లా కేంద్రం, హైదరాబాద్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పోటీచేసే చోట తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న నాయకులను అభ్యర్థులుగా ప్రకటించాలన్నారు.