
సాక్షి, బెంగళూర్: లింగాయత్లకు మతపరమైన మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన వీరశైవ లింగాయత్ నేతలు అన్నంత పని చేశారు. లింగాయత్ నేతల ప్రదర్శనను అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో కర్ణాటకలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ వీరశైవ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.
లింగాయత్ సామాజికవర్గాన్ని ప్రత్యేక మతంగా గుర్తిస్తూ.. వారికి మైనారిటీ హోదా కల్పించాలన్న నాగమోహన్ దాస్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు కూడా పంపింది.
లింగాయత్లకు మాత్రమే ప్రత్యేక మైనారిటీ హోదా కల్పిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని మొదటి నుంచి వీరశైవ లింగాయత్ స్వాములు హెచ్చరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆ వర్గ వారి అసమ్మతిని చల్లార్చేందుకు లింగాయత్లో భాగంగా వీరశైవ లింగాయత్లను కూడా గుర్తించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. 12వ శతాబ్దానికి చెందిన వీరశైవ మతస్థాపకుడు బవసన్న అనుచరులే లింగాయత్లు, వీరశైవ లింగాయత్లు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. కర్ణాటక జనాభాలో లింగాయత్లు 17శాతం మంది ఉన్నారు. వీరికి మైనారిటీ హోదా ఇవ్వాలన్న అంశం చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment