
సాక్షి, వైఎస్సార్ జిల్లా : ఆరు నెలల్లో అభివృద్ధి అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిస్తారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని.. తాము అమలుచేసే నవరత్నాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా రామాపురం మండల కేంద్రంలో జాతీయ రహదారిలోని మూడు రోడ్ల కూడలిలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని శ్రీకాంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధికి నడకలు నేర్పినది వైఎస్సార్ అని వ్యాఖ్యానించారు. ఆయన బాటలోనే సీఎం వైఎస్ జగన్ కూడా నడుస్తారని పేర్కొన్నారు. తండ్రి ఆశయాలను పుణికిపుచ్చుకుని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారన్నారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారుతారని పేర్కొన్నారు. లోక్సభలో తమకున్న బలంతో అవకాశం దొరికినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉంటామని తెలిపారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని వంటిదని.. దాని సాధన కోసం పార్లమెంటులో తమ గళం బలంగా వినిపిస్తామని శ్రీకాంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. కాగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment