
సాక్షి, హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. కాంగ్రెస్కు నైతిక విలువలు ఉంటే రేవంత్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ బ్రోకర్ దందాలు చేసి డబ్బులు సంపాదించారని ఆరోపించారు. మాదిగలకు టీఆర్ఎస్ అండగా ఉంటుందని, వర్గీకరణపై త్వరలోనే ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకెళతామన్నారు.
ఎన్నికల సమయంలో వర్గీకరణ హామీ ఇచ్చి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీని రేవంత్ ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. స్పీకర్కు రేవంత్ రాజీనామా సమర్పిస్తే, సీఎం కేసీఆర్ బలం ఏంటో చూపిస్తామన్నారు. మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సబబు కాదని, రేవంత్ మాటలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్పందించాలని డిమాండ్ చేశారు. రేవంత్ నియంత్రణ లేకుండా మాట్లాడుతున్నారని, చివరకు సీఎం కేసీఆర్ను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ను గెలిపించిన ప్రజలు సైతం సిగ్గుపడేలా ఆయన వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment