
‘మనపై ఢిల్లీ పెత్తనమేంది, తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడుకోవాలి’ అంటూ..
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 2014కు ముందు జరిగిన పరిణామాలే పునరావృతమవుతాయని టీఆర్ఎస్ నాయకుడు, ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనపై ఢిల్లీ పెత్తనమేంది, తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడుకోవాలి అంటూ కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న టీడీపీ ఇప్పుడు వారితోనే అంటకాగడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బందీ అయిందని... ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేస్తే 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ వద్దని అగ్రిమెంట్ చేసుకున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డిని సొంత పార్టీ వారే నమ్మడం లేదని, ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఏం చెబుతారో ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు.