
దక్షిణాదికి రాజమార్గమని భారతీయ జనతా పార్టీ.. ఐదేళ్ల పాలనకు ఇంకోసారి పొడిగింపు కావాలని కాంగ్రెస్.. చేజారిన అధికారాన్ని కింగ్మేకర్ రూపంలోనైనా సాధించాలని జేడీఎస్.. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రం ఇదీ..! పోలింగ్ రోజు(మే12) సమీపించేకొద్దీ.. పోరు ఉత్కంఠభరితమవుతూండగా ఓటరు నాడి పట్టడం మాత్రం ఎవరి తరమూ కావడంలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ఎన్నికలు.. ఆ రాష్ట్ర పర్యాటక శాఖ నినాదం ‘ఒకరాష్ట్రం.. అనేక ప్రపంచాలు’ అనే చందంగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆరు భిన్న ప్రపంచాలైన కర్ణాటకలో ఏ పార్టీ అదృష్టం ఎలా ఉందో?
బ్రిటిష్ పాలనా కాలంలో బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతాలతోపాటు హైదరాబాద్ నిజాం పాలనలోని కన్నడ ప్రాంతాలు, కొడగు, పాత మైసూరు ప్రాంతాలను కలిపి కర్ణాటక రాష్ట్రం ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్రం మొత్తాన్ని బొంబాయి, కోస్తా, హైదరాబాద్, పాత మైసూరు, మధ్య కర్ణాటక, బెంగళూరు అర్బన్ అనే ఆరు ప్రాంతాలుగా విభజించి చూడటం ఆనవాయితీ. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కర్ణాటకలో సీట్లవారీగా చూస్తే పాత మైసూరు, బొంబాయి కర్ణాటక పెద్ద ప్రాంతాలు.
కోస్తాలో బీజేపీ ఆధిక్యం నిలిచేనా?
కర్ణాటక సముద్ర తీర ప్రాంతాన్ని కరావళి అంటారు. ఉడుపి, ఉత్తర, దక్షిణ కన్నడ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం 30 ఏళ్లుగా హిందుత్వ ప్రయోగశాలగా మారిందన్నది విశ్లేషకుల అంచనా. హిందూ, ముస్లిం, క్రైస్తవ జనాభా దాదాపు సమానంగా ఉన్న కరావళిలో మత ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎక్కువే. ఫలితంగా కాషాయ పక్షం వేగంగా వేళ్లూనుకుంది. ఈ కారణంగానే 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఘనవిజయం సాధించింది. అయితే అంతకు ఏడాది ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ చతికిలపడింది.
యడ్యూరప్ప, బి.శ్రీరాములు వంటివారు బీజేపీ నుంచి వేరు పడి సొంత పార్టీలు పెట్టుకోవడం ఇందుకు కారణం. అప్పట్లో ఈ ప్రాంతంలోని మొత్తం 19 స్థానాల్లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుచుకుంది. యడ్యూరప్ప, శ్రీరాములు వంటివారిప్పుడు మళ్లీ పార్టీలో చేరిపోవడం.. ఉద్రేకపూరిత ప్రసంగాలు చేసే కేంద్రమంత్రి అనంత్కుమార్హెగ్డే, మాజీ మంత్రి శోభా కరండ్లాజే, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరుల సాయంతో ఈ ప్రాంతంలో మళ్లీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. కాంగ్రెస్ పాలనలో సంఘ్ కార్యకర్తలు 24 మంది హత్యకు గురయ్యారనే విషయాన్ని చర్చకు తెస్తూ హిందువుల ఓట్లు సాధించేందుకు అమిత్షా తదితరులు ప్రయత్నిస్తున్నారు.
బొంబాయి కర్ణాటకలో గెలుపెవరిది?
లింగాయతుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న బొంబాయి కర్ణాటక ప్రాంతంలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ప్రాంతం బీజేపీ కంచుకోట. గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నేతలు సొంత కుంపటి పెట్టుకోవడంతో నష్టపోయింది. మొత్తం 50 స్థానాలున్న ఈ ప్రాంతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 31 స్థానాలు సాధించగా బీజేపీ 13 స్థానాలతో సరిపెట్టుకుంది.
ఈసారి అంతేస్థాయిలో సీట్లు గెలుపొందేందుకు కాంగ్రెస్ లింగాయతులను ప్రత్యేక మతంగా గుర్తించాలన్న డిమాండ్కు ఓకే చెప్పింది. అయితే లింగాయతుల్లోని ఒకవర్గం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఆర్థిక వెనుకబాటు, కరువు, రైతు ఆత్మహత్యలు, మహాదాయి నదీ జలాల వివాదం, నిరుద్యోగం, చెరకు ధర వంటివి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలని అంచనా.
ఇవే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రైతు సంఘం వందలాది మంది రైతులతో ఆదివారం రాష్ట్రపతిని కలిసేందుకు వెళుతుండటం ఇక్కడ ప్రస్తావనార్హం. కేంద్ర సర్కారు ఇప్పటి వరకూ సరిగా స్పందించకపోవడం వల్ల కలిగే నష్టమెంతన్నది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్కంటే బీజేపీ రెండు మూడు సీట్లు ఎక్కువే సాధిస్తుందన్నది సర్వేల సారాంశం.
హైదరాబాద్ కర్ణాటక పయనం ఎటు?
రాష్ట్రంలో మరో వెనుకబడిన ప్రాంతం హైదరాబాద్ కర్ణాటక. కాంగ్రెస్కు కొద్దోగొప్పో ఆశలు కల్పిస్తున్న ప్రాంతమిదే. 2012లో యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రాజ్యాంగంలోని 371–జే ద్వారా ప్రత్యేక హోదా కల్పించడం దీనికి కారణం. దీని వల్ల ఎవరికి ఎంత ప్రయోజనం కలిగిందన్నది చర్చనీయాంశమే అయినా గతంకంటే తాము మెరుగైన స్థితిలో ఉంటామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి సిద్దరామయ్య.
2013 ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్కు 23, బీజేపీకి ఐదు సీట్లు దక్కాయి. జేడీఎస్కు ఐదు సీట్లు లభించాయి. కేజీపీ మూడు స్థానాల్లో గెలిచింది. లింగాయతులు చెప్పుకో దగ్గసంఖ్యలో ఉన్న హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో.
మధ్య కర్ణాటక మొగ్గు ఎటు?
చిత్రదుర్గ, దావణగెరె, చికమగళూరు, శివమొగ్గ జిల్లాలున్న మధ్య కర్ణాటకలో లింగాయతుల ప్రభావం కూడా ఉంది. 2008లో బీజేపీ అధికారం చేపట్టేందుకు ఆ పార్టీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప సొంత జిల్లా శివమొగ్గతో కూడిన మధ్య కర్ణాటక కీలకపాత్ర పోషించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 13 సీట్లు దక్కించుకున్నాయి. గత ఎన్నికల్లో యడ్యూరప్ప సొంతంగా పార్టీపెట్టుకోవడంతో కాంగ్రెస్ తన సీట్ల సంఖ్యను 15కు పెంచుకుంది.
బీజేపీ మూడింటితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జేడీఎస్ ఆరు చోట్ల విజయం సాధించింది. లింగాయతులకు ప్రత్యేక గుర్తింపు ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియడంలేదు. చిత్రదుర్గలో అనేక హిందూ వర్గాల మఠాలున్నాయి. వీటి ప్రభావం ఓటర్లపై ఉంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ నుంచి అమిత్షా వరకూ మఠాధిపతులను కలవడానికి ’క్యూ’ కడుతున్నారు.
జేడీఎస్ అడ్డా.. పాత మైసూరు!
పూర్వపు మైసూరు సంస్థానమైన ఈ ప్రాంతంలో మైసూరు, కొడగు, మండ్య, హాసన్, చామరాజనగర, తుమకూరు, చిక్కబళ్లాపుర, కోలారు, బెంగళూరు గ్రామీణ తదితర జిల్లాలున్నాయి. మాజీ ప్రధాని దేవెగౌడ, అతడి సామాజిక వర్గమైన ఒక్కళిగల ప్రాబల్యం ఎక్కువ. కాంగ్రెస్కు దళితులు, బీసీలు, అల్పసంఖ్య వర్గాల్లో పలుకుబడి ఎక్కువ. ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, జేడీఎస్ల మధ్యే. ఇక్కడ బీజేపీకి బలం అంతంతే.
మొత్తం 61 స్థానాలకుగానూ 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 27, జేడీఎస్ 25 సీట్లు దక్కించుకున్నాయి. బీజేపీ నాలుగు సీట్లతో సరిపెట్టుకుంది. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి సహా దేవెగౌడ కుటుంబ సభ్యులు జేడీఎస్ తరఫున ఈ ప్రాంతం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఒక్కళిగ వర్గానికి చెందిన మాజీ సీఎం ఎస్ఎం కృష్ట కాంగ్రెస్ నుంచి తమ పార్టీలోకి చేరడంతో ఈసారి జేడీఎస్ ప్రభావాన్ని తగ్గించగలమని బీజేపీ భావిస్తోంది.
అయితే తన అనుచరులకు సీట్లు దక్క లేదన్న కారణంతో ఎస్ఎం కృష్ణ అంత చురుకుగా పనిచేయడం లేదని వినిపిస్తోంది. ఇదే ప్రాంతంలోని చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య పోటీ చేస్తున్నారు. అత్యంత సంపన్న అభ్యర్థిగా వార్తలకెక్కిన కాంగ్రెస్ మంత్రి(ఒక్కళిగ నేత) డీకే శివకుమార్ కూడా ఈ ప్రాంతంలోని కనకపుర నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మళ్లీ గెలిస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు.
బీజేపీకి బలం.. బెంగళూరు అర్బన్
రాష్ట్ర రాజధాని బెంగళూరు కొన్నేళ్లుగా బీజేపీకి బలమైన కేంద్రంగా మారింది. అందుకే అవినీతి ఆరోపణలు, పరిపాలన లోపాలు వంటి అనేక అననుకూల పరిస్థితుల్లో కూడా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మొత్తం 28 సీట్లకుగానూ 12 స్థానాలు సాధించగలిగింది. కాంగ్రెస్ 13 సీట్లు కైవసం చేసుకుంది. ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు, కలుషితమౌతున్న సరస్సులు, నానాటికి తీసికట్టుగా మారుతున్న రోడ్లు, వానాకాలంలో వరదలు, క్షీణిస్తున్న శాంతి భద్రతలు వంటి అనేక విషయాలు సిద్దరామయ్య సర్కార్కు సవాల్గా మారాయి.
పేదలు, మైనారిటీల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా క్యాంటీన్ వంటి అనేక ’భాగ్యా’ పథకాలు, ఇతర సంక్షేమ చర్యల ద్వారా కాంగ్రెస్ బెంగళూరులో గట్టెక్కగలనని భావిస్తోంది. హిందీ వ్యతిరేకత, కన్నడ ఆత్మగౌరవం వంటి ప్రచారాంశాలతో మంచి ఫలితాలు సాధించడానికి సిద్దరామయ్య కృషి చేస్తున్నారు. బీటీఎం లేఅవుట్ నుంచి కాంగ్రెస్ హోంమంత్రి ఆర్.రామలింగారెడ్డి, ఆయన కూతురు సౌమ్యారెడ్డి జయనగర నుంచి పోటీ చేస్తున్నారు.
కాంగ్రెస్ టికెట్పై బెంగళూరు మాజీ మేయర్ జి.పద్మావతి, బీజేపీ సీనియర్ నేత సురేష్కుమార్తో రాజాజీనగర్(ఎస్సీ)లో తలపడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మేయర్ ఆర్.సంపత్రాజ్ సీవీరామన్నగర్(ఎస్సీ) నుంచి పోటీకి దిగారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న తెలుగు నేత కట్టా సుబ్రమణ్యంనాయుడు శివాజీనగర్ నుంచి బీజేపీ టికెట్పై మరోసారి పోటీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment