శివసేన మోసం చేసింది: కిషన్‌రెడ్డి | Kishan Reddy Comments In Visakhapatnam Press Meet | Sakshi
Sakshi News home page

ఆ తీర్పును అందరూ స్వాగతించారు: కిషన్‌రెడ్డి

Published Wed, Nov 13 2019 12:19 PM | Last Updated on Wed, Nov 13 2019 12:40 PM

Kishan Reddy Comments In Visakhapatnam Press Meet - Sakshi

సాక్షి, విశాఖపట్నం: వచ్చే ఏడాది భారత్‌లో ‘నో మనీ ఫర్ టెర్రర్’ మీద అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచ హోం మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారమిక్కడ ఆయన మాట్లాడుతూ... ‘ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకూడదు’ అనే నినాదంతో మెల్‌బోర్న్‌లో సమావేశం జరిగిందని తెలిపారు. 71 దేశాలకు చెందిన అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశాల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు అందకుండా ఆపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఉగ్రవాదులకు సహాయం చేసే బ్యాంకులేవైనా సరే వాటిపై చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్తాన్‌ తీరును ఆయన ప్రస్తావించారు. ‘పాకిస్తాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి డ్రగ్స్‌ విక్రయించి ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తుంది. దొంగ నోట్లను కూడా ముద్రించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కారణంగా మనం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

తీర్పును అందరూ స్వాగతించారు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘సబ్ కె సాథ్ సబ్ కె విశ్వాస్’ పేరిట అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి.. అన్నివర్గాల ప్రజలు విశ్వాసం పొందుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. ‘కాంగ్రెస్ సుస్థిరమైన పాలన అందించలేకపోయింది. ఏనాడు కూడా ప్రజల ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. అయితే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రామజన్మ భూమి అంశం పట్ల కేంద్రం తన వైఖరిని, ప్రతిపాదనను ధైర్యంగా సుప్రీంకోర్టు ముందుంచింది. అయోధ్య అంశంపై తీర్పును అన్ని వర్గాలు స్వాగతించాయి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అభివృద్ధి సాధించే దిశగా కేంద్రం గట్టిగా కృషి చేస్తోందని తెలిపారు. ఆహార భద్రత, విద్యాహక్కును సమర్థవంతగా అమలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విఙ్ఞప్తి చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు. రానున్న రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు.

శివసేన మోసం చేసింది..
‘మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సివచ్చింది. బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటించి శివసేనతో పొత్తు పెట్టుకుంది. అయితే శివసేన మోసం చేసింది. నిజానికి బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసి ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిచి ఉండేది’ అని కిషన్‌రెడ్డి మహా రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ‘స్కూళ్ళు తెరిచాం, పర్యాటకులను అనుమతించాం. 90 శాతం జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కేవలం18 పోలీసు స్టేషన్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం ఉంద’ని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement