
మెదక్ జిల్లా: తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వీరందరికి కంటి పరీక్షలు చాలా అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలు తెప్పించామని, ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 825 టీంలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయని, కంటి పరీక్షల అనంతరం ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. మల్కాపూర్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.