
సాక్షి, అమరావతి : ఏపీ శాసనమండలి రద్దుపై కేంద్రం సానుకూలంగానే స్పందిస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా మండలి రద్దుకు ప్రభుత్వం చట్ట ప్రకారం తీర్మానం చేసిందని తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన నేతలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థులకు మేలు చేసే ఇంగ్లిష్ మీడియం బిల్లును టీడీపీ మండలిలో అడ్డుకుందని మండిపడ్డారు. పెద్దల సభ అంటే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా టీడీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించారని విమర్శించారు. టీడీపీ కుట్రపూరితంగానే మండలిలో బిల్లులను అడ్డుకుందన్నారు.
ఆ ఆదాయం ఏపీ నుంచే అధికం..
మెరైన్ ఎక్స్పోర్ట్ వల్ల విదేశీ మారక ద్రవ్య ఆదాయం ఏపీ నుంచే అధికమని మంత్రి తెలిపారు. తీర ప్రాంతంలోని ప్రతి జిల్లాకు ఒక పోర్ట్ నిర్మించే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజాంపట్నం, మచిలీపట్నం పోర్టులను విస్తృత పరుస్తామని చెప్పారు. అందులో భాగంగా సెకండ్ ఫేస్లో ఫిషింగ్ జట్టీలు ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలో ఫిషింగ్ జట్టీలు నిర్మించనున్నట్టు వెల్లడించారు. రూ. 100 కోట్లతో విశాఖలో ఫిషింగ్ హార్బర్ విస్తరణ పనులు చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment