
సాక్షి, వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వారణాసిలో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతకుముందు కాలభైరవుడి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారణాసిలో నామినేషన్ వేసేందుకు వచ్చిన నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఆయన కారుపై పూల వర్షం కురిపించారు. కాలభైరవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా స్థానిక మహిళలతో మోదీ కరచాలనం చేశారు. ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
నరేంద్ర మోదీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నాయకులు వారణాసికి వరుస కట్టారు. నామినేషన్ వేయడానికి ముందు కలెక్టరేట్ ఆఫీస్లో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, అకాలీదళ్ నేత ప్రకాశ్సింగ్ బాదల్, ఎల్జేపీ అధ్యక్షుడు రామ్విలాస్ పాశ్వాన్, అన్నాడీఎంకే నేత పన్నీరు సెల్వం, అప్నాదళ్, నార్త్–ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ నేతలతో మోదీ భేటీ అయ్యారు. ప్రకాశ్సింగ్ బాదల్కు ఈ సందర్భంగా పాదాభివందనం చేశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్ తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment