
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి వ్యవస్థలను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఓ పద్ధతి ప్రకారం చేజిక్కించుకుంటోందనీ, ఏకపక్ష విధానాలతో దేశాన్ని నడపలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. విద్యావేత్తలతో రాహుల్ మాట్లాడుతూ ఒకేరకమైన సిద్ధాంతాన్ని తమపై రుద్దుతున్నారనే భావన ప్రజల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ‘దేశాన్ని వ్యవస్థీకరిస్తామని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ తన గత ప్రసంగాల్లో పేర్కొన్నారు. వ్యవస్థీకరించడానికి ఆయనెవరు? దేశం తానంతట తానే వ్యవస్థీకృతమవుతుంది. ఇంకో 2 నెలల్లో వారి భ్రమలు తొలగిపోతాయి’ అని రాహుల్ అన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యావేత్తలతో ఢిల్లీలో రాహుల్ మాట్లాడారు.