‘తొలి’ సమరానికి సై | Telangana ZPTC And MPTC Elections Nominations Medak | Sakshi
Sakshi News home page

‘తొలి’ సమరానికి సై

Published Mon, Apr 29 2019 11:40 AM | Last Updated on Mon, Apr 29 2019 11:40 AM

Telangana ZPTC And MPTC Elections Nominations Medak - Sakshi

పాపన్నపేటలో బీఫాం అందజేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు 

మెదక్‌ రూరల్‌: పరిషత్‌ ఎన్నికల్లో భాగంగా తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఆది వారంతో ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో హవేళిఘణాపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్‌ మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం 339 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో 6 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 18 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 65 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 190 మంది బరిలో నిలిచారు. పెద్దశంకరంపేట మండలం జూకల్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి మానస ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు బీఫాం లను ఇచ్చిన అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించగా, ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్నవారికి బ్యాట్, కత్తెర గుర్తులను కేటాయించారు.

ఆదివారం నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు తర్వాత 6 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 16 నామినేషన్లు, 65 ఎంపీటీసీ స్థానాలకు గాను 158 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు 433 నామినేషన్లు, 6 జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 25న జరిగిన స్క్రూటినీలో పెద్దశంకరంపేట మండలం జూకల్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీటీసీ అభ్యర్థి శైలజ ఐకేపీలో పనిచేస్తున్నందున నామినేషన్‌ను తిరస్కరించారు.

రెండేసి చొప్పున వచ్చిన నామినేషన్లను తొలగించగా మొత్తం 341 మంది అభ్యర్థులు 354 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 41 నామినేషన్లు వేయగా అందులో రెండేసి చొప్పున ఉన్న నామినేషన్లను తొలగించగా, మొత్తం 31 మంది అభ్యర్థులకు గాను 34 నామినేషన్లను పరిగణలోకి తీసుకున్నారు. బరిలో మిగిలిన అభ్యర్థులు సోమవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు.

ముగిసిన రెండో విడత నామినేషన్ల పర్వం
రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు ఆదివారంతో తెరపడింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని నర్సాపూర్, చిలప్‌చెడ్, కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట, తూప్రాన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని వెల్దుర్తి మండలాలకు సంబంధించి ఈనెల 26 నుంచి 28 వరకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 6 జెడ్పీటీసీ స్థానాలకు గాను 53 మంది అభ్యర్థులు 66 నామినేషన్లు వేశారు. 60 ఎంపీటీసీ స్థానాలకు 405 మంది అభ్యర్థులు 454 నామినేషన్లను దాఖలు చేశారు. ఆదివారం చివరి రోజు 60 ఎంపీటీసీ స్థానాలకు 276 మంది అభ్యర్థులు 318 నామినేషన్లను వేయగా, 6 జెడ్పీటీసీ స్థానాలకు 44 మంది అభ్యర్థులు 57 నామినేషన్లను దాఖలు చేశారు. ప్రతి మండల కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ రిటర్నింగ్‌ అధికారులు నామపత్రాలను స్వీకరించారు.

రెండో విడత నామినేషన్ల వివరాలు ఇలా
నర్సాపూర్‌లో 10 ఎంపీటీసీ స్థానాలకు 78 నామినేషన్లు, చిలప్‌చెడ్‌లో 6 ఎంపీటీసీ స్థానాలకు 41నామినేషన్లు, కౌడిపల్లిలో 10 ఎంపీటీసీ స్థానాలకు 66, కొల్చారంలో 10 ఎంపీటీసీ స్థానాలకు 75 నామినేషన్లు, వెల్దుర్తిలో 12 ఎంపీటీసీ స్థానాలకు 83 నామినేషన్లు, శివ్వంపేటలో 12 ఎంపీటీసీ స్థానాలకు 111 నామినేషన్ల చొప్పున మొత్తం 60 ఎంపీటీసీ స్థానాలకు 454 నామినేషన్లు దాఖలయ్యాయి.  ఆరు జెడ్పీటీసీ స్థానాలకు నర్సాపూర్‌లో 11, చిలప్‌చెడ్‌లో 10, కౌడిపల్లి 09, కొల్చారం 12, వెల్దుర్తిలో 15, శివ్వంపేటలో 09 చొప్పున మొత్తం 66 నామినేషన్లు దాఖలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement