
వరుదు కల్యాణి
నక్కపల్లి (పాయకరావుపేట) : కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయింపుల్లో జరిగిన అన్యాయంపై టీడీపీ ఎంపీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కల్యాణి ఆరోపించారు. సోమవారం ఆమె నక్కపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ విభజన చట్టంలో హామీలను నెరవేర్చాలని పార్లమెంట్లో ఒత్తిడి చేయలేక చేతకాని దద్దమ్మల్లా ఉండిపోయారని ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. ఏపీకీ ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ సాధించడంలో వీరంతా విఫలమయ్యారని కల్యాణి విమర్శించారు.
ప్రత్యేక హోదా విషయంపై వైఎస్సార్ సీపీ ఎంపీలే పార్లమెంట్లో గట్టిగా నినాదాలు చేశారంటూ ఈరోజు వరకు కూడా వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం రాజీలేనిపోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే కేంద్ర సహాయ నిరాకరణకు నిరసనగా తమ పార్టీ ఎంపీలు, మంత్రులతో∙రాజీనామాలు చేయించి ప్రజాతీర్పుకోరాలని ఆమె సవాల్ విసిరారు. సమావేశంలో సమన్వయకర్త వీసం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.